రానున్న ఎన్నికల నేపథ్యంలో భారీ స్థాయిలో దొంగ ఓట్లు నమోదు చేయిస్తున్నారని టీడీపీ నేతలు ఆరోపించారు. అయితే దొంగ ఓట్లు టీడీపీ హయాంలోనే నమోదు చేశారని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. దొంగ ఓట్లు విషయంపై టీడీపీ, వైసీపీ ఢిల్లీ వెళ్లీ కేంద్ర ఎన్నికల కమిషన్ అధికారులు పోటాపోటీగా ఫిర్యాదులు చేశారు.
బూత్ లెవల్ అధికారులతో ఓటర్ల జాబితాపై ఎన్నికల కమిషన్ పరిశీలన చేపట్టింది. దీంతో దొంగ ఓట్ల బాగోతం వెలుగుచూసింది. రాష్ట్రంలోని కొన్ని చోట్ల అధికారులపై ఎన్నికల కమిషన్ అధికారులు చర్యలు తీసుకున్నారు. ఉరవకొండ నియోజకవర్గంలో 6 వేల దొంగ ఓట్లు చేర్పించారని టీడీపీ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ కేంద్ర ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదు చేశారు.
ఈ విషయాన్ని పరిగణనలోకి తీసుకున్న ఎన్నికల కమిషన్ విచారణ చేపట్టి జిల్లా పరిషత్ సీఈవో భాస్కర్రెడ్డిని సస్పెండ్ చేసింది. ఆంధ్రప్రదేశ్లో ఓటర్ల సంఖ్యలో 2019తో పోలిస్తే 5 లక్షలు పెరిగారు. 2024 ఎన్నికల నాటికి ఈ సంఖ్య మరింత పెరగొచ్చు. ఏపీ ముసాయిదా ఓటర్ల జాబితాను గత ఏడాది నవంబర్లో రాష్ట్ర ఎన్నికల ప్రధాన కమిషనర్ ఎంకె మీనా ప్రకటించారు.
నవంబరు 9వ తేదీ నాటికి రాష్ట్రంలో 3,98,54,093 మంది ఓటర్లు ఉన్నారని తెలిపారు. రాష్ట్రంలో 2,01,34,621 మంది మహిళా ఓటర్లు ఉండగా 1,97,15,614 మంది పురుష ఓటర్లు ఉన్నారు. సర్వీసు ఓటర్ల సంఖ్య 68,115గా నమోదైంది. ట్రాన్స్ జెండర్ ఓటర్ల సంఖ్య 3858 మందిగా ఉంది. 18-19 ఏళ్ల వయసున్న ఓటర్ల సంఖ్య 68,115గా ఉంది.
రాష్ట్రవ్యాప్తంగా వివిధ కారణాలతో 10,52,326 మంది ఓటర్లను జాబితా నుంచి తొలగించినట్లు ఎన్నికల ప్రధానాధికారి తెలిపారు. చనిపోయిన వారి ఓట్లు 40,345 ఉండగా, ఇతర ప్రాంతాలకు వెళ్లిన ఓట్లు 31,158గా ఉంది. అత్యధిక ఓటర్లతో మొదటి స్థానంలో 19,11,699 ఓట్లతో అనంతపురం నియోజకవర్గం ఉండగా, రెండో స్థానంలో 19,12,049 ఓట్లతో కర్నూలు నియోజకవర్గం, మూడో స్థానంలో 18,98,533 ఓట్లతో నెల్లూరు నియోజకవర్గంలో ఓటర్లు నమోదయ్యారు.
More Stories
విద్యా భారతి విజ్ఞాన కేంద్రంకు డా. భగవత్ తో ప్రారంభోత్సవం
బిజెపి అభ్యర్థి సుజనా చౌదరికి అమరావతి రైతుల మద్దతు
2 పేజీలతో వైసీపీ మేనిఫెస్టో విడుదల