21 నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు

ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ సమావేశాలు వచ్చే వారంలో నిర్వహించనున్నారని ఈ ప్రభుత్వ చీఫ్ విప్ ముదునూరి ప్రసాదరాజు ప్రకటన చేశారు. అయితే అసెంబ్లీ సమావేశాల్లో ఏ అంశాలు చర్చకు వస్తాయనేది ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఈ నెల 21 నుంచి జరుగనున్నట్లు తెలుస్తున్నది. ప్రభుత్వ వర్గాలు అందిస్తున్న సమాచారం ప్రకారం.. ఈ నెల 21 నుంచి అయిదు రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు జరుపుతారు.

బిల్లులపై నిర్వహించే చర్చ, సభ జరిగే అవసరాన్ని బట్టి మరో రెండు రోజులు పొడిగించే అవకాశాలు ఉన్నాయి. కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణ బిల్లును ఈ సమావేశాల్లో ప్రవేశ పెట్టనున్నారు. సీపీఎస్ ఉద్యోగులకు ప్రభుత్వం తీసుకురావాలనుకుం టున్న జీపీఎస్ సంబంధిత బిల్లు కూడా అసెంబ్లీ సమావేశాల్లో ప్రవేశపెట్టే అవకాశం ఉంది.

ఏపీలో ముందస్తు ఎన్నికలు వస్తాయని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో అసెంబ్లీ సమావేశాల నిర్వహణపై రాజకీయంగా ఉత్కంఠ నెలకొంది. టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడును అవినీతి కేసుల్లో అరెస్ట్‌ చేసిన నేపథ్యంలో కీలక పరిణామాలు జరుగుతాయని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.

మంగళవారం ఉదయం లండన్ పర్యటన ముగించుకుని తాడేపల్లికి చేరుకున్న సీఎం జగన్  రాష్ట్రంలోని తాజా పరిస్థితులు, శాంతి భద్రతలపై సమీక్ష నిర్వహించారు.  ఈ సమయంలో సీఎం క్యాంపు కార్యాలయానికి వచ్చిన చీఫ్ విప్ ప్రసాదరాజు వచ్చే వారం అసెంబ్లీ సమావేశాలు  జరగనున్నట్టుగా చెప్పారు. మరోవంక,  సీఎం జగన్ బుధవారం ఢిల్లీ పర్యటనకు వెళ్లే అవకాశం ఉందని తెలుస్తోంది. 

ఢిల్లీ వెళ్లనున్న జగన్‌మోహన్‌రెడ్ ప్రధాని మోడీతోపాటు కేంద్ర హోంమంత్రి అమిత్‌షాతో సమావేశం అవుతారని చెబుతున్నారు. చంద్రబాబు అరెస్ట్‌, జమిలీ ఎన్నికలకు కేంద్రం కసరత్తు వేళ  సీఎం జగన్ ఢిల్లీ పర్యటన రాజకీయ ప్రాధాన్యత సంతరించుకునే అవకాశం ఉంది. ఇక, ఢిల్లీ పర్యటన అనంతరం సీఎం జగన్ కేబినెట్ భేటీ నిర్వహించనున్నారు.

ఇందులో కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది.  ఆ తర్వాత వచ్చే వారంలో ఏపీ అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి. అయితే కేంద్రం జమిలి ఎన్నికలకు సిద్దమైన నేపథ్యంలో ఏపీలో కూడా ముందస్తు ఎన్నికలు ఉండే అవకాశం ఉందని, కేబినెట్ భేటీలో సీఎం జగన్ ఈ సంకేతాలు ఇచ్చే అవకాశం ఉందనే ప్రచారం సాగుతుంది.