`సనాతన’ వాఖ్యలపై కాంగ్రెస్, శివసేన మౌనమేల?

భారతీయుల విశ్వాసపాత్రమైన సనాతన ధర్మాన్ని కొందరు పనిగట్టుకుని కించపరుస్తున్నారని కేంద్ర సమాచార ప్రసారాల మంత్రి అనురాగ్ ఠాకూర్ విమర్శించారు. ఇంతజరుగుతోన్నా ఇంతవరకూ కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ కానీ, శివసేన నాయకులు ఉద్ధవ్ థాకరే కానీ దీనిపై మౌనం వహించారని ధ్వజమెత్తారు. విదేశీపర్యటనకు వెళ్లిన రాహుల్ పలు విషయాలపై పద్ధతి లేకుండా మాట్లాడుతున్నారని ఆయన మండిపడ్డారు.

హిందూ, హిందూ ధర్మం , ఉపనిషిత్తులలో వీటి గురించి చెప్పడం కాదు, సనాతన ధర్మం పట్ల అవమానకర వ్యాఖ్యలపై రాహుల్ ఏమంటారని కేంద్ర మంత్రి ప్రశ్నించారు. ప్రతిపక్షం ముందు దీనిపై తమ మౌనం వీడాలని స్పష్టం చేశారు. ప్రతిపక్ష నేతలు పనిగట్టుకుని సనాతన ధర్మం గురించి అవహేళనకు దిగుతున్నారని, ఇదే వారి తంతుగా మారిందని కేంద్ర మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. 

విపక్ష నేతలు ఒకరి తరువాత ఒకరుగా దుష్ప్రచారానికి దిగడం ఆనవాయితీ అయిందని అనురాగ్ ఠాకూర్ మండిపడ్డారు. దేశంలో ఇప్పుడు ఇండియా వర్సెస్ భారత్ వివాదం రగులుకుందని లండన్, పారిస్‌లలో రాహుల్ గాంధీ మాట్లాడటం ఎంతవరకూ సబబని ఆయన  ప్రశ్నించారు.  కొందరు పనిగట్టుకుని కొన్నివిషయాలపై భయాందోళనలు , గందరగోళం సృష్టించాలనే ఆలోచన ఉంటుందని పేర్కొంటూ వీరు జీవితాంతం ఇదే పనిలో ఉంటారని, భ్రమలు కల్పిస్తారని విమర్శించారు.

కాగా, వచ్చే ఏడాది అయోధ్యలో రామాలయ ప్రారంభోత్సవం తరువాత గోద్రా తరహా ఘటన జరుగుతుందని శివసేన నేత ఉద్ధవ్ థాకరే చెప్పడం అనుచితం అని కేంద్ర మంత్రి విమర్శించారు. కొందరు అధికార దాహంతో తమ సిద్ధాంతాలను విస్మరిస్తున్నారని ధ్వజమెత్తారు. ఏదో విధంగా అధికారం పొందాలనే తపన కన్పిస్తోందన్నారని చెప్పారు. ఇప్పుడు ఉద్ధవ్ మాటలకు ఆయన తండ్రి బాలాసాహెబ్ థాకరే బతికి ఉంటే ఏ విధంగా స్పందించే వాడో?  ఆలోచించాలని హితవు పలికారు.