భార‌త్‌, సౌదీ భాగ‌స్వామ్యం ప్ర‌పంచ సుస్ధిర‌త‌కు కీల‌కం

ప్రాంతీయంగానే కాకుండా అంతర్జాతీయ స్థిరత్వం, సంక్షేమంలో భారత్‌- సౌదీ అరేబియాల మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యం ఎంతో కీలకమని
ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ తెలిపారు. జీ-20 స‌ద‌స్సు నేప‌ధ్యంలో భార‌త్ ప‌ర్య‌ట‌న‌కు వ‌చ్చిన సౌదీ అరేబియా యువ‌రాజు మహ్మద్ బిన్ సల్మాన్ అల్ సౌద్ సోమ‌వారం ప్ర‌ధాని మోదీతో ఢిల్లీలోని హైదరాబాద్ హౌస్‌లో స‌మావేశమ‌య్యారు.
 
భారత్‌కు అత్యంత వ్యూహాత్మక భాగస్వాముల్లో సౌదీ అరేబియా ఒకటని చెబుతూ మారుతున్న కాలానికి అనుగుణంగా ఇరు దేశాలు, కొత్త అంశాలతో తమ సంబంధాలను మరింత బలోపేతం చేసుకుంటున్నాయని ప్రధాని మోదీ తెలిపారు. ఇరువురు నేత‌లు ద్వైపాక్షిక సంబంధాల‌తో పాటు ప‌లు అంశాల‌పై సంప్ర‌దింపులు జ‌రిపారు. 

2019లో రియాద్‌లో ఇరు దేశాలు సంత‌కం చేసిన ద్వైపాక్షిక ఒప్పందంలో భాగంగా వ్యూహాత్మ‌క భాగ‌స్వామ్య మండ‌లి తొలి భేటీకి హైద‌రాబాద్ హౌస్ వేదికైంది. భార‌త్‌కు సౌదీ అరేబియా కీల‌క, అతిపెద్ద వ్యూహాత్మ‌క భాగ‌స్వామి అని మోదీ పేర్కొన్నారు.  త‌మ భాగ‌స్వామ్య‌న్ని త‌దుప‌రి ద‌శ‌కు తీసుకువెళ్లేందుకు అవ‌స‌ర‌మైన చ‌ర్య‌ల‌ను గుర్తించామ‌ని చెప్పారు.

 వ్యూహాత్మ‌క భాగ‌స్వామ్య మండ‌లిలోని ప‌లు ఉన్న‌త‌స్ధాయి క‌మిటీల పురోగ‌తిని ఇరువురు నేత‌లు స‌మీక్షించారు. ద్వైపాక్షిక సంబంధాల‌తో పాటు ప్రాంతీయ‌, అంత‌ర్జాతీయ అంశాల‌పైనా ఇరువురు నేత‌లు చ‌ర్చ‌లు జ‌రిపారు.బ్రిక్స్‌లో సౌదీ అరేబియా పూర్తిస్ధాయి స‌భ్య‌త్వం పొందినందుకు మ‌హ్మ‌ద్ బిన్ స‌ల్మాన్‌ను ప్ర‌ధాని మోదీ అభినందించారు.

సౌదీ యువరాజు మహ్మద్ బిన్ సల్మాన్ మాట్లాడుతూ భారత్‌లో పర్యటించడం సంతోషంగా ఉందని పేర్కొన్నారు. జీ20 సదస్సును నిర్వహించినందుకు భారత్‌ను అభినందిస్తున్నానని, ఈ సదస్సు వల్ల యావత్ ప్రపంచం ఎంతో ప్రయోజనం పొందుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఇరు దేశాల గొప్ప భవిష్యత్తు కోసం రెండు దేశాలు కలిసి పనిచేస్తాయని తెలిపారు. 

కాగా, భారత్‌లో మహ్మద్ బిన్ పర్యటించడం ఇది రెండవ సారి. భారత్‌కు వ్యూహాత్మక భాగస్వాముల్లో సౌదీ అరేబియా కీలక దేశంగా ఉంది. గత కొన్నేళ్లుగా తీసుకుంటున్న చర్యలతో ఇరుదేశాల సంబంధాలు ఉన్నతస్థాయికి చేరుకున్నాయి. ముఖ్యంగా రక్షణ , భద్రతను మరింత బలోపేతం చేసేందుకు ఇరు దేశాలు కృషి చేస్తున్నాయి. 

ఈ క్రమంలో భారత్‌సౌదీ అరేబియా వ్యూహాత్మక భాగస్వామ్య మండలిని 2019 లో ప్రకటించారు. 2020 డిసెంబరులో అప్పటి భారత చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్ జనరల్ ఎంఎ నరవణె కూడా సౌదీ అరేబియాలో తొలిసారి పర్యటించారు. అనంతరం ఇరు దేశాల సైనిక ఉన్నతాధికారుల మధ్య రాకపోకలు సాగుతున్నాయి.