బీజేపీలో చేరిన కాంగ్రెస్ మాజీ ఎంపీ

రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికలు తరుముకొస్తున్న వేళ కాంగ్రెస్ పార్టీకి భారీ ఎదురుదెబ్బ తగిలింది. కాంగ్రెస్ పార్టీ మాజీ పార్లమెంటు సభ్యురాలు జ్యోతి మీర్దా  సోమవారంనాడు బీజేపీలో చేరారు. ఆమెతో పాటు ఐపీఎస్ నుంచి రాజకీయాల్లోకి వచ్చిన సవాయ్ సింగ్ చౌదరి సైతం బీజేపీలోచేరారు. ఢిల్లీలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో రాజస్థాన్ బీజేపీ అధ్యక్షుడు సీపీ జోషి సమక్షంలో ఈ ఇద్దరూ పార్టీ కండువా కప్పుకున్నారు.

రాజస్థాన్‌లోని నాగౌర్ ప్రాంతంలో మీర్దా, చౌదరి బలమైన నేతలుగా పేరుండటంతో ఆ ప్రభావం రాబోయే ఎన్నికల్లో బలంగా ఉంటుందని బీజేపీ చెబుతోంది. జాతి నిర్మాణ బాధ్యతలకు కాంగ్రెస్ పార్టీ తిలోదకాలు ఇచ్చిందని, పార్టీ నేతలు, కార్యకర్తలను ఆ పార్టీ నిర్లక్ష్యం చేసిందని మీర్దా ఆరోపించారు. 

రాబోయే అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికల్లో బీజేపీ విజయానికి కృషి చేస్తానని ఆమె చెప్పారు. రాష్ట్రంలో పటిష్ట ప్రభుత్వం ఏర్పాటుకు, కేంద్రంలో మూడోసారి బీజేపీ ప్రభుత్వం వచ్చేందుకు పనిచేస్తానని ఆమె తెలిపారు. ప్రధాన మంత్రి నరేంద్రమోదీ కీలక నాయకత్వంలో భారత్ గణనీయంగా అభివృద్ధి సాధించిందని ఆమె ప్రశంసించారు.

కాగా, బీజేపీలో తాజా చేరికలతో నాగౌర్ ప్రాంతంలో కాంగ్రెస్ ఫలితాలపై ప్రభావం ఉండవచ్చని చెబుతున్నారు. నౌగర్ లోక్‌సభకు జ్యోతి మీర్దా ఈసారి బీజేపీ నుంచి పోటీ చేసే అవకాశాలున్నాయి. నాగౌర్ నుంచి ఆరు సార్లు ఎంపీగా ఎన్నికైన నాథూరామ్ మీర్దా మనుమరాలే జ్యోతి మిర్దా. నాగౌర్ ప్రాంతంలో నాథూరామ్ మీర్దాకు గట్టి పట్టు ఉంది. 

వీరిద్దరి చేరికతో రాజస్థాన్ లో బీజేపీ కుటుంభం మరింత బలోపేతం అయిన్నట్లు బిజెపి ప్రధాన కార్యదర్శి, రాజస్థాన్ ఇన్ ఛార్జ్  అరుణ్ సింగ్ తెలిపారు. జ్యోతి మీర్దా 2009లో తొలిసారి నాగౌర్ నుంచి కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసి గెలిచారు. అయితే, ఆ తర్వాత 2014, 2019 ఎన్నికల్లో ఓటమి చవిచూశారు. 2019లో బీజేపీ మద్దతిచ్చిన హనుమాన్ బెనివాల్ చేతిలో జ్యోతి మీర్దా ఓడిపోయారు. ప్రస్తుతం బెనివాల్- బీజేపీ మధ్య సత్సంబంధాలు లేవు. సవాయ్ సింగ్ చౌదరి సైతం నాగౌర్ ప్రాంతానికి చెందిన వారే.