తెలీదు.. గుర్తులేదు- చంద్రబాబు సమాధానాలివేనా!

స్కిల్ డెవలప్మెంట్ కేసులో అరెస్టైన టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడును సీఐడీ అధికారులు దాదాపు శనివారం రాత్రి  విచారించినా ఆయన మాత్రం దాదాపు ఒకే రకమైన సమాధానాలు ఇచ్చినట్లు చెబుతున్నారు. చాలావరకు `తెలీదు’, `గుర్తులేదు’ సమాధానాలే ఇచ్చారని తెలుస్తున్నది. సాయంత్రం 5.30 గంటల నుండి ఉదయం 3 గంటల వరకు విచారించి, విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు జరిపించారు. తిరిగి సిట్ కార్యాలయంకు తీసుకొచ్చారు.
చంద్రబాబును నంద్యాలలో అరెస్టు చేసిన సీఐడీ అధికారులు విజయవాడకు తరలించారు. చంద్రబాబును తాడేపల్లి సిట్ కార్యాలయానికి తరలించిన సీఐడీ అధికారులు తెల్లవారుజాము వరకు విచారించారు.   కేసుకు సంబంధించిన పేపర్ వర్క్ పూర్తి కాకపోవడంతో ఆయనను రాత్రి కోర్టులో హాజరపపరచకుండా ఉదయమే హాజరుపరిచారు. సీఐడీ రిమాండ్ రిపోర్టులో ఏ37గా చంద్రబాబును పేర్కొన్నారు.
 
అయితే తన న్యాయవాదులను కలిసేందుకు చంద్రబాబు వినతిని సీఐడీ అధికారులు నిరాకరించారు. న్యాయసాయం కోసం లాయర్లను కలిసేందుకు అనుమతివ్వాలని చంద్రబాబు రాసిన లేఖపై సీఐడీ అధికారులు స్పందించలేదు. చంద్రబాబు విచారిస్తోన్న సీఐడీ అధికారులు 20 ప్రశ్నలు పైగా సంధించినట్లు తెలుస్తోంది. మరో వైపు భువనేశ్వరి, నారా లోకేశ్‌, బాలకృష్ట, బ్రాహ్మణి చంద్రబాబును కలిసేందుకు సీఐడీ కార్యాలయం లోపలికి వెళ్లారు.

స్కిల్ డెవలప్మెంట్ స్కాంకు సంబంధించి అప్పట్లో ఏం జరిగిందన్న దానిపై టీడీపీ అధినేత చంద్రబాబుకు సిట్ కార్యాలయంలో సీఐడీ అధికారులు 20 ప్రశ్నలు సంధించారు. అప్పట్లో అధికారులు రాసిన నోట్ ఫైల్స్ ను కూడా చంద్రబాబుకు సీఐడీ అధికారులు చూపించారు. దీనిపై ఆయన వివరణ ఏంటని అడిగారు. దీనికి చంద్రబాబు తెలీదు, నాకు గుర్తులేదు అనే సమాధానాలే ఇస్తున్నట్లు తెలుస్తోంది.

ముఖ్యంగా చంద్రబాబు మాజీ పీఎస్ పెండ్యాల శ్రీనివాస్, షెల్ కంపెనీల ప్రతినిధుల మధ్య వాట్సాప్ చాట్ ను కూడా సీఐడీ అధికారులు ఆయనకు చూపించారు. చాటింగ్ గురించి ప్రశ్నించగా చంద్రబాబు తెలీదన్నారు. ఓ దశలో అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది.  మధ్యమధ్యలో సీఐడీ అధికారులు అనుబంధ ప్రశ్నలు సంధించడంతో చంద్రబాబు కాస్త కూల్ అయ్యారని సమాచారం.

మొత్తంగా చూస్తే చంద్రబాబు సీఐడీ అధికారుల విచారణకు సహకరించడం లేదని తెలుస్తోంది. అధికారులు అడిగిన ఏ ప్రశ్నకు కూడా ఆయన సరైన సమాధానం చెప్పలేదని చెబుతున్నారు. దీంతో కాసేపట్లో ఏసీబీ కోర్టులో హాజరు పర్చాక సీఐడీ చంద్రబాబు రిమాండ్ తర్వాత కస్టడీ కూడా కోరవచ్చని తెలుస్తోంది. విచారణకు చంద్రబాబు సహకరించని అంశాన్ని కూడా కోర్టుకు వివరించే అవకాశం ఉన్నట్లు సీఐడీ వర్గాలు అనధికారికంగా వెల్లడించాయి.

నేడు టీడీపీ నిరసనలు, గవర్నర్ తో భేటీ

చంద్రబాబు అరెస్టుకు నిరసనగా ఆదివారం రాష్ట్ర వ్యాప్తంగా నిరాహార దీక్షలు చేపట్టాలని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు పిలుపునిచ్చారు. చంద్రబాబు అరెస్ట్, పార్టీ నేతలు, కార్యకర్తలపై పోలీసుల దాడులకు నిరసనగా ఆదివారం రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గ ప్రధాన కేంద్రాల్లో నిరాహార దీక్షలు చేపట్టాలని నిర్ణయించారు.

మరోవంక, అచ్చెన్నాయుడు అధ్యక్షతన 11 మంది టీడీపీ నేతలు ఆదివారం గవర్నర్ నజీర్ ను కలవనున్నారు. చంద్రబాబు అరెస్టు విషయంతో పాటు టీడీపీ నేతల పట్ల పోలీసులు వ్యవహరించిన తీరుపై గవర్నర్ కు ఫిర్యాదు చేయనున్నాయి. అయితే గవర్నర్ విశాఖ పర్యటనలో ఉండడంతో ఆయనను విశాఖలో టీడీపీ నేతలు కలవనున్నట్లు తెలుస్తోంది. టీడీపీ బృందానికి గవర్నర్ అపాయింట్మెంట్ ఇచ్చారు.