నిద్రావస్థలో ఉన్న విక్రమ్‌ ల్యాండర్‌ ఫొటో

నిద్రావస్థలో ఉన్న  విక్రమ్‌ ల్యాండర్‌ ఫొటో

భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) చేపట్టిన ప్రతిష్ఠాత్మక మూన్‌ మిషన్‌ చంద్రయాన్‌-3కు సంబంధించిన తాజా సమాచారాన్ని ఆ సంస్థ ఎప్పటికప్పుడు అందిస్తున్నది. ప్రస్తుతం నిద్రావస్థలో ఉన్న విక్రమ్‌ ల్యాండర్‌ ఫొటోను ఇస్రో విడుదల చేసింది.  చంద్రయాన్-2 ఆర్బిటర్‌లోని డ్యూయల్ ఫ్రీక్వెన్సీ సింథటిక్ ఎపర్చర్‌ రాడార్ పరికరం ద్వారా చంద్రయాన్‌-3 ల్యాండర్‌ ఫొటోను తీసినట్లు తెలిపింది. ఈ నెల 6న తీసిన ఈ ఫొటోను శనివారం ఎక్స్‌లో ఇస్రో షేర్‌ చేసింది.

కాగా, చంద్రయాన్‌-3 మిషన్‌కు సంబంధించిన విక్రమ్‌ ల్యాండర్‌ ఆగస్ట్‌ 23న చంద్రుడి దక్షిణ ధృవంపై సాఫ్ట్‌ల్యాండ్‌ అయ్యింది. ఈ నేపథ్యంలో మూన్‌ సౌత్‌ పోల్‌ వద్ద అడుగుపెట్టిన తొలి దేశంగా భారత్‌ చరిత్ర సృష్టించింది. అయితే చంద్రుడిపై లూనార్‌ నైట్‌  ప్రారంభం కావడంతో విక్రమ్‌ ల్యాండర్‌, దాని నుంచి చంద్రుడి ఉపరితలంపైకి దిగిన ప్రజ్ఞాన్‌ రోవర్‌ను స్లీప్‌ మోడ్‌లో ఇస్రో ఉంచింది.

మరోవైపు ఈ నెల 22న చంద్రుడిపై తిరిగి లూనార్‌ డే ప్రారంభమవుతుంది. ఈ నేపథ్యంలో చంద్రుడిపై సూర్యుడి కాంతి కిరణాలు పడే ఈ సమయం కోసం ఇస్రో ఎదురుచూస్తున్నది.  అయితే లూనార్‌ నైట్‌ సమయంలో చంద్రుడి ఉపరితలంపై ఉండే మైనస్‌ 200 డిగ్రీల సెల్సియస్‌ ఉష్ణోగ్రత వంటి పరిస్థితులను ల్యాండర్‌, రోవర్‌ తట్టుకుని తిరిగి అవి పనిచేస్తాయా అన్నదానిపై సర్వత్రా ఉత్కంఠత నెలకొన్నది.