వ్యవసాయంకు 24 గంటల విద్యుత్ ఇస్తుంటే  రాజీనామా చేస్తా

తెలంగాణాలో కేసీఆర్ ప్రభుత్వం వ్యవసాయానికి 24 గంటల విద్యుత్ ఇస్తున్నట్టు రుజువు చేస్తే రాజీనామా చేస్తామని ఎమ్మెల్యే, రాష్ట్ర ఎన్నికల నిర్వహణ కమిటీ చైర్మన్  ఈటల రాజేందర్  సవాల్ చేశారు. 24 గంటల కరెంట్‌పై బహిరంగ చర్చకు సిద్ధమని స్పష్టం చేశారు.

“అబిడ్స్ చౌరస్తా, అసెంబ్లీ ఎదురుగా, సచివాలయం ఎదురుగా ఎక్కడైనా 24 గంటల కరెంట్‌పై బహిరంగ చర్చకు సిద్ధం. 24 గంటలు కరెంట్ ఇస్తున్నారని తేలితే ఎమ్మెల్యే సభ్యత్వానికి రాజీనామా చేస్తా. ముక్కు నేలకు రాస్తా. ఒకవేళ చర్చకు రాకపోతే ప్రభుత్వం 24 గంటల కరెంట్ ఇస్తున్నామనే తప్పుడు ప్రచారం మానుకోవాలి” అంటూ ప్రభుత్వాన్ని నిలదీశారు. 

“మీ తప్పుడు ప్రచారం వాళ్ల ప్రజలు నవ్వుకుంటున్నారు. విద్యా వ్యవస్థను కేసీఆర్ నాశనం పట్టించారు. మంత్రులకు ఎవరికి స్వేచ్ఛ లేదు. ఉన్నా మంత్రులకు అవగాహన లేదు.” అని రాజేందర్ విమర్శించారు. రాష్ట్రంలో హోంగార్డుల పరిస్థితి దయనీయంగా ఉందని, ఐదు నెలల జీతాలు పెండింగ్ లో ఉన్నాయని, హోంగార్డులను ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తూ వారిని వేధింపులకు గురిచేస్తున్నదని ధ్వజమెత్తారు. జీతాలు సరిగ్గా రాక హోంగార్డులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

రాష్ట్రంలో ప్రైవేటు, కార్పొరేట్ స్కూల్స్ ఫీజులుతో విద్యార్థులు, తల్లిదండ్రులు ఇబ్బంది పడుతున్నా సర్కారు నియంత్రణ చర్యలు తీసుకోవడం లేదని విమర్శించారు. ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు  వేతనాలు అందడం లేదని తెలిపారు.  విద్యార్థులకు ఫీజు రీయింబర్స్ మెంట్  సరిగ్గా అందించడం లేదని చెప్పారు.  హాస్టల్స్ లో విద్యార్థులకు  నాణ్యమైన  భోజనం ఇవ్వడం లేదని, హెల్త్ కార్డు ద్వారా ఏ ఒక్కరికీ కూడా కార్పొరేట్ హాస్పిటల్ లో వైద్యం అందడం లేదని అంటూ కేసీఆర్ పాలనను రాజేందర్ ఎండగట్టారు.

కేయూ విద్యార్థులను వీసీ పోలీసులతో దారుణంగా కొట్టించడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యార్థులను విచక్షణారహితంగా, తీవ్రంగా పోలీసులతో కొట్టించిన ఘనత వీసీతో పాటు కేసీఆర్ సర్కార్‌దే అని మండిపడ్డారు. వైస్ ఛాన్సలర్ అనుమతి లేకుండా పోలీసులు యూనివర్సిటీకి ఎలా వచ్చారు? అని ప్రశ్నించారు.  పీహెచ్‌డీ అడ్మిషన్‌ విషయంలో మెరిట్‌పై మాట్లాడటానికి వెళ్లిన విద్యార్థి నేతలపై పోలీసులు దాడి చేయడం ఏంటి? అంటూ విస్మయం వ్యక్తం చేశారు.  బీఆర్‌ఎస్‌కు కేయూ వీసీ రమేష్‌ తొత్తుగా పని చేస్తున్నారని ధ్వజమెత్తారు. 

విసి ఒక ఎమ్మెల్సీ సిఫార్స్ తో వచ్చినట్టున్నారని ఎద్దేవా చేశారు. సమస్యల గురించి అధ్యాపకులతో మాట్లాడి వాటిని పరిష్కరించుకునే సంస్కృతి తెలంగాణలో ఉందని, కానీ టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు విద్యార్థులను కొట్టడం తెలంగాణ చరిత్రలోనే ఇదే మొదటిసారని రాజేందర్ దుయ్యబట్టారు.  రాష్ట్రంలో విద్యార్థుల హక్కులను కాపాడుకోవాల్సిన అవసరం ఉందని చెబుతూ విద్యార్థులు తలుచుకుంటే సామ్రాజ్యలే కూలిపోతాయని హెచ్చరించారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా అవతరించడంలో కీలక పాత్ర పోషించింది విద్యార్థులే అని గుర్తు చేశారు.

రుణమాఫీ విషయంలో రైతులను ప్రభుత్వం మోసం చేస్తోందని అంటూ రూ. 25 వేల కోట్ల రుణాలు మాఫీ చేస్తామని ప్రకటించి ఐదేళ్లు గడిచినా అమలు చేయలేదని ఈటెల విమర్శించారు.  రైతులను రుణ విముక్తులను చేసి కొత్త లోన్ లను ఇవ్వాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం భూములమ్మి ఆదాయం సమకూర్చుకునే పనిలో ఉందని ధ్వజమెత్తారు.

లిక్కర్ డ్రా పై చాలా కుటుంబాలు రోడ్డున పడ్డాయని చెబుతూ చాలా మందికి లక్కీ డ్రా లో మద్యం షాప్ లు రాలేదని చెప్పారు.  మద్యం టెండర్ల డబ్బులు వస్తె తప్ప రైతులకు ఇవ్వడానికి ప్రభుత్వం వద్ద డబ్బులు లేవని ధ్వజమెత్తారు. అప్పులలో నెంబర్ వన్, భూములు అమ్ముకోవడం లో నెంబర్ వన్, చిన్న ఉద్యోగులను వేధించడంలో నెంబర్ వన్ తెలంగాణనే అంటూ మండిపడ్డారు.