నేపాల్‌ను చిత్తు చేసి సూపర్‌-4 దశకు భారత్

వరుణుడి దోబూచులాట మధ్య సాగిన పోరులో భారత్‌ విజయం సాధించింది. ఆసియాకప్‌ గ్రూప్‌-‘ఎ’లో భాగంగా సోమవారం జరిగిన పోరులో టీమ్‌ఇండియా 10 వికెట్ల తేడాతో (డక్‌వర్త్‌ లూయిస్‌ పద్ధతి ప్రకారం) నేపాల్‌ను చిత్తు చేసి సూపర్‌-4 దశకు చేరింది. మ్యాచ్‌కు పలుమార్లు వర్షం అడ్డుపడగా సవరించిన లక్ష్యాన్ని భారత్‌ అలవోకగా ఛేదించింది.

టాస్‌ ఓడి మొదట బ్యాటింగ్‌కు దిగిన నేపాల్‌ 48.2 ఓవర్లలో 230 పరుగులకు ఆలౌటైంది. ఓపెనర్‌ ఆసిఫ్‌ (58), సోమ్‌పాల్‌ (48) రాణించారు. భారత బౌలర్లలో సిరాజ్‌, జడేజా చెరో మూడు వికెట్లు పడగొట్టారు. అనంతరం వర్షం కారణంగా మ్యాచ్‌కు అంతరాయం కలగగా సుదీర్ఘ నిరీక్షణ అనంతరం డకవర్త్‌ పద్ధతిలో భారత విజయ లక్ష్యాన్ని 23 ఓవర్లలో 145గా నిర్ధారించారు.

చేజింగ్‌లో ఓపెనర్లు రోహిత్‌ శర్మ (59 బంతుల్లో 74 నాటౌట్‌; 6 ఫోర్లు, 5 సిక్సర్లు), శుభ్‌మన్‌ గిల్‌ (62 బంతుల్లో 67; 8 ఫోర్లు, ఒక సిక్సర్‌) అజేయ అర్ధశతకాలతో కదంతొక్కడంతో టీమ్‌ఇండియా 20.1 ఓవర్లలో సునాయాసంగా గెలుపొందింది. రోహిత్‌కు ‘మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌’ అవార్డు దక్కింది. మ్యాచ్‌కు వర్షం ముప్పు పొంచి ఉన్న నేపథ్యంలో గత మ్యాచ్‌లో టాస్‌ గెలిచి తొలుత బ్యాటింగ్‌ ఎంచుకున్న భారత కెప్టెన్‌ రోహిత్‌ శర్మ ఈ సారి బౌలర్లకు తగినంత ప్రాక్టీస్‌ లభించాలనే ఉద్దేశంతో బౌలింగ్‌ తీసుకున్నాడు. 

వ్యక్తిగత కారణాలతో బుమ్రా ఈ మ్యాచ్‌కు అందుబాటులో లేకపోవడంతో మహమ్మద్‌ షమీ జట్టులోకి రాగా టీమ్‌ఇండియాతో తొలి అంతర్జాతీయ మ్యాచ్‌ ఆడుతున్న నేపాల్‌ తమ పోరాటంతో ఆకట్టుకుంది. ముఖ్యంగా ఓపెనర్లు కుషాల్‌ (39), ఆసిఫ్‌ చక్కటి ప్రతిభ చూపారు. మన ఫీల్డర్ల తప్పిదాలు కూడా వారికి సహకరించడంతో నేపాల్‌ తొలి వికెట్‌కు 65 పరుగులు జోడించగలిగింది.

గత మ్యాచ్‌లో ఇదే పిచ్‌పై పాకిస్థాన్‌ బౌలర్లు కొత్త బంతితో నిప్పులు చెరిగిన చోట మన వాళ్లు మాత్రం ప్రత్యర్థిని దెబ్బ కొట్టలేకపోయారు.  పేస్‌ ఆల్‌రౌండర్‌ శార్దూల్‌ ఠాకూర్‌ జట్టుకు బ్రేక్‌ త్రూ అందించగా జడేజా చకచకా 3 వికెట్లు పడగొట్టి ప్రత్యర్థిని ఆత్మరక్షణలో పడేశాడు. అయితే మిడిలార్డర్‌ పోరాటంతో నేపాల్‌ మంచి స్కోరే చేసింది.

ఈ మ్యాచ్‌లో భారత ఓపెనర్లు రోహిత్‌, గిల్‌ నేపాల్‌ బౌలర్ల అనుభవరాహిత్యాన్ని సొమ్ము చేసుకుంటూ పరుగుల వరద పారించారు. ఈ క్రమంలో మొదట హిట్‌మ్యాన్‌ 39 బంతుల్లో హాఫ్‌ సెంచరీ పూర్తి చేసుకోగా, గిల్‌ 47 బంతుల్లో ఆ మార్క్‌ అందుకున్నాడు. ఈ ఇద్దరే మ్యాచ్‌ను ముగించారు.