చంద్రుడి ఉప‌రిత‌లంపై మ‌రో చోట విక్ర‌మ్

చంద్ర‌యాన్‌-3 మిష‌న్ విజయవంతంగా కొన‌సాగుతోంది. తాజాగా విక్ర‌మ్ ల్యాండ‌ర్‌ను మ‌ళ్లీ సాఫ్ట్ ల్యాండింగ్ చేశారు. చంద్రుడి ఉప‌రిత‌లంపై మ‌రో చోట విక్ర‌మ్ ల్యాండైంది. దీనికి సంబంధించిన విష‌యాన్ని ఇస్రో సోమవారం త‌న సోష‌ల్ మీడియా అకౌంట్ ఎక్స్‌లో వెల్ల‌డించింది. తాము ఇచ్చిన క‌మాండ్‌కు విక్ర‌మ్ స‌క్ర‌మంగా స్పందించిన‌ట్లు ఇస్రో చెప్పింది.

ఆగ‌స్టు 23వ తేదీన తొలిసారి చంద్రుడి ద‌క్షిణ ద్రువంపై విక్ర‌మ్ ల్యాండైన విష‌యం తెలిసిందే. అయితే తాజాగా మిష‌న్ ల‌క్ష్యంలో భాగంగా ఆ ల్యాండ‌ర్‌ను మ‌రో చోట దించారు. దీని కోసం నిర్వ‌హించిన హాప్ ఎక్స్‌ప‌రిమెంట్ విజ‌య‌వంతం అయిన‌ట్లు ఇస్రో తెలిపింది. క‌మాండ్ ఇచ్చిన త‌ర్వాత విక్ర‌మ్ ల్యాండ‌ర్ ఇంజిన్లు ఫైర్ అయ్యాయని, ఆ త‌ర్వాత ఆ ల్యాండ‌ర్ దాదాపు 40 సెంటీమీట‌ర్ల మేర‌కు పైకి లేచి సుమారు 30 నుంచి 40 సెంటీమీట‌ర్ల దూరంలో సుర‌క్షితంగా ల్యాండ్ అయిన‌ట్లు ఇస్రో వెల్ల‌డించింది.

ఈ మిష‌న్‌కు చెందిన వీడియోను కూడా ఇస్రో త‌న ఎక్స్ అకౌంట్‌లో పోస్టు చేసింది.  విక్ర‌మ్ ల్యాండ‌ర్ చేప‌ట్టిన ప్ర‌యోగం చాలా కీల‌క‌మైంద‌ని ఇస్రో తెలిపింది. భ‌విష్య‌త్తులో చేప‌ట్ట‌బోయే ప్ర‌యోగాల‌కు ఇది నాందిగా నిలుస్తుంద‌ని వెల్ల‌డించింది. ఒక‌వేళ చంద్రుడి నుంచి మ‌ళ్లీ భూమ్మీద‌కు శ్యాంపిల్స్ తీసుకురావాల‌న్నా, లేక మాన‌వుల త‌ర‌లింపు ప్ర‌క్రియ చేప‌ట్టాల‌న్నా, ఇవాళ నిర్వ‌హించిన ప్ర‌యోగాం కీల‌క‌మైంద‌ని ఇస్రో తెలిపింది.

విక్ర‌మ్ ల్యాండ‌ర్‌కు చెందిన అన్ని సిస్ట‌మ్స్ నార్మ‌ల్‌గా ప‌నిచేస్తున్న‌ట్లు ఇస్రో పేర్కొన్న‌ది. ర్యాంప్‌ను మోహ‌రించామ‌ని, చేస్ట్‌, ఐఎల్ఎస్ఏ ప‌రిక‌రాలు ఫోల్డ్ అయ్యాయ‌ని, ప‌రీక్ష పూర్తి అయిన త‌ర్వాత అవి మ‌ళ్లీ య‌ధావిధిగా త‌మ ప‌ని చేస్తున్న‌ట్లు ఇస్రో చెప్పింది.

మరోవంక,చంద్రయాన్ 3 ప్రజ్ఞాన్‌ రోవర్ మరో కీలక ఘట్టాన్ని పూర్తి చేసుకుంది. తన అసైన్‌మెంట్‌ను పూర్తి చేసుకుని సురక్షితంగా పార్క్ చేయబడింది. మిషన్‌లోని అన్ని పేలోడ్స్ ప్రస్తుతం స్లీప్ మోడ్‌లోకి వెళ్లిపోయాయి. ఈ విషయాన్ని ఇస్రో తన అధికారిక ట్విటర్ (ఎక్స్) ఖాతా ద్వారా తెలిపింది. 

 
‘‘ ప్రస్తుతం APXS, LIBS పేలోడ్‌లు ఆఫ్ చేయబడ్డాయి. ఈ పేలోడ్‌ల నుంచే సమాచారం ల్యాండర్ ద్వారా భూమికి ప్రసారం చేయబడుతుంది.’’ అని ఇస్రో ట్వీట్ చేసింది. ప్రస్తుతం చంద్రయాన్ 3 ప్రజ్ఞాన్‌ రోవర్ పూర్తి స్థాయిలో ఛార్జ్ అయిందని, రిసీవర్‌ను ఆన్‌లో ఉంచినట్లు తెలిపింది. సోలార్ ప్యానెల్ సెప్టెంబర్ 22న సూర్యోదయం సమయంలో కాంతిని స్వీకరిస్తుందని అంచనా వేస్తున్నట్లు ఇస్రో పేర్కొంది. 
 
దీంతో మరో అసైన్‌మెంట్ కోసం ప్రజ్ఞాన్‌ రోవర్ మరోసారి అందుబాటులోకి వస్తుందని ఇస్రో ఆశిస్తోంది. అంటే సెప్టెంబర్ 22 వరకు చంద్రుడి దక్షిణ ధృవం చీకట్లోనే ఉండనుంది. మళ్లీ సెప్టెంబర్ 22నే అక్కడ సూర్యుడు ఉదయించనున్నాడు.
 
కాగా చంద్రుడిపై ప్రజ్ఞాన్‌ రోవర్ ఇప్పటికే 100 మీటర్ల దూరం ప్రయాణించింది. జాబిల్లి ఉపరితలంపై కలియ తిరిగిన ప్రజ్ఞాన్‌ రోవర్‌ తన పరిశోధనల్లో సల్ఫర్‌తో పాటు ఆక్సిజన్‌ ఉనికిని గుర్తించిన సంగతి తెలిసిందే. చంద్రుని దక్షిణ ధ్రువంపై అరుదైన సల్ఫర్‌ జాడ కనిపించడం చాలా కీలకం. ఈ లిబ్స్‌ పరికరాన్ని బెంగళూరులోని లేబొరేటరీ ఫర్‌ ఆస్ట్రో ఆప్టిక్స్‌ సిస్టమ్స్‌, ఇస్రో సంయుక్తంగా అభివృద్ధి చేశాయి.