ఉదయ్‌ నిధి వాఖ్యలు హేయం, రాజ్యాంగ విరుద్ధం

సన్నాతన ధర్మంపై తమిళనాడు మంత్రి ఉదయ్‌ నిధి స్టాలిన్ చేసిన వ్యాఖ్యలపై ఏపీ బీజేపీ అధ్యక్షురాలు, మాజీ కేంద్ర మంత్రి దగ్గుబాటి పురంధేశ్వరి తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.  ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ భారత రాజ్యాంగం ద్వారా ప్రమాణం చేసిన మంత్రి ఉదయ్‌స్టాలిన్, సనాతాన ధర్మాన్ని దోమల నిర్మూలన చర్యతో పోల్చి నిర్మూలించాలని తన ఆకాంక్షను వ్యక్తం చేయడం హేయమైన చర్య, రాజ్యాంగ విరుద్ధం అంటూ మండిపడ్డారు.
అలాగే ఉదయినిధిని సమర్థిస్తూ కార్తిక్ చిదంబరం చేసిన వ్యాఖ్యలపై సహితం ఆమె తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేశారు.  అదే వేదికపై ఉన్నటువంటి తమిళనాడులోని హిందూ మతపరమైన, ధర్మాదాయ సంస్థలకు బాధ్యత వహించే పీకే శేఖర్‌బాబు ఎటువంటి అభ్యంతరం చెప్పకుండా మౌనంగా ఉండడాన్ని దేనికి సంకేతం? అంటూ ఆమె ప్రశ్నించారు.
సనాతన ధర్మాన్ని విచ్ఛిన్నం చేయడమే ఇండియా కూటమి ఉద్దేశమని ఐఎన్‌సీటీ తమిళనాడు అధ్యక్షుడు పేర్కొన్నారని ఆమె గుర్తు చేశారు. ఈ చర్యలు భారతదేశంలోని హిందూ సమాజాన్ని ఆందోళనకు గురిచేస్తున్నాయని పురందేశ్వరి తెలిపారు. విపక్ష కూటమి ఇండియా అని పేరు పెట్టుకోవడానికి కనీస నైతిక హక్కు కూడా వీరికి లేదని ఆమె ధ్వజమెత్తారు.
 
 2010 సంవత్సరంలో హిందూ సంస్ధలను లష్కరే తొయిబా సంస్ధతో రాహుల్ గాంధీ పోల్చి మాట్లాడడం అత్యంత దారుణమని ఈ సందర్భంగా ఆమె పేర్కొన్నారు.  హిందువుల మనోభావాలను దెబ్బదీసే విధంగా ఇండియా కూటమిలోని నేతలు వ్యాఖ్యలు చేస్తున్నారని ఆమె మండిపడ్డారు.