2047 నాటికి భారత్ అభివృద్ధి చెందిన దేశంగా ఎదుగుతుందని ప్రధాని నరేంద్ర మోదీ భరోసా వ్యక్తం చేశారు. దేశంలో అవినీతి, కులమత తత్వాలకు స్థానం ఉండదని స్పష్టం చేశారు. మరికొన్ని రోజుల్లో ఢిల్లీలో జీ 20 శిఖరాగ్ర భేటీ జరగనున్న నేపథ్యంలో ఆయన ఓ ఇంటర్వ్యూ లో జీడీపీ దృక్కోణంలో చూడటం నుంచి , మానవీయ దృక్కోణంలో చూసే దిశగా ప్రపంచం మారుతోందని తెలిపారు.
భారత్ ఇందుకు ఉత్ప్రేరకంగా పనిచేస్తుందని చెబుతూ ప్రపంచ సంక్షేమానికి ‘సబ్కా సాత్, సభ్కా వికాస్’ మార్గదర్శకంగా మారుతుందని విశ్వాసం వ్యక్తం చేశారు. జీ20 పై ప్రధాని మోదీ మాట్లాడుతూ “ భారత్ అధ్యక్షత వహించడంతో జీ 20 పై చాలా సానుకూల ప్రభావం పడింది. వీటిల్లో కొన్ని నా మనసుకు దగ్గరైనవి ఉన్నాయి” అని చెప్పారు.
ఈ సదస్సులో భారత్ మాటలు, దార్శనికతను ప్రపంచం భవిష్యత్తుకు రోడ్మ్యాప్గా భావిస్తోందని తెలిపారు. అంతేకాదు, భారత నాయకత్వం పేద దేశాల్లో ఆత్మవిశ్వాసాన్ని నింపిందని చెప్పారు. ‘వసుధైవ కుటుంబం’ అనేది కేవలం ఒక నినాదం మాత్రమే కాదని, అది మన సాంస్కృతిక విలువల నుంచి నడిపించిన సమగ్ర తత్వం అని ప్రధాని స్పష్టం చేశారు.
ఏడాదిపాటు జరిగే జీ 20 కార్యక్రమాల్లో దాదాపు 1.5 కోట్ల మంది భారతీయులు భాగస్వాములయ్యారని ప్రధాని చెప్పారు. మన జీ20లో ఆఫ్రికాకు అత్యధిక ప్రాధాన్యత ఇచ్చాం అని తెలిపారు. కాగా, కశ్మీర్, అరుణాచల్ ప్రదేశ్లో జీ 20 సదస్సు నిర్వహించడంపై చైనా, పాక్ వ్యక్తం చేసిన అభ్యంతరాలను మోదీ కొట్టిపారేశారు. దేశంలోని ప్రతిభాగంలో జీ 20 కార్యక్రమాలు నిర్వహించడం సర్వసాధారణమని పేర్కొన్నారు.
భారత్ వృద్ధిపై ప్రధాని మాట్లాడుతూ “ ఒకప్పుడు భారత్ను 100 కోట్ల ఆకలి కడుపులుగా చూసేవారు. కానీ ఇప్పుడు ఆకాంక్షలతో నిండిన 100 కోట్ల మెదళ్లుగా, నైపుణ్యంతో కూడిన 200 కోట్ల చేతులుగా చూస్తున్నారు. వచ్చే వెయ్యేళ్లకు గుర్తుండిపోయే విధంగా అభివృద్ధికి పునాది వేయడానికి భారతీయులకు ఇప్పుడే మంచి అవకాశం అంటూ భారత్ గత పదేళ్లలో జీడీపీ విలువల్లో ఐదు స్థానాలు ఎగబాకిందని వెల్లడించారు.
రష్యా- ఉక్రెయిన్ యుద్ధంపై మోదీ ప్రస్తావిస్తూ కేవలం చర్చలు, సంప్రదింపులతో మాత్రమే వేర్వేరు ప్రాంతాల్లో తలెత్తిన వేర్వేరు సంక్షోభాలను పరిష్కరించుకోగలమని చెప్పారు. ఇక ఉగ్రవాదం, సైబర్ ముప్పులపై ప్రధాని స్పందిస్తూ “సైబర్ ముప్పులను తీవ్రంగా పరిగణించాలి. సైబర్ ఉగ్రవాదం, ఆన్లైన్ రాడికలైజేషన్, మనీలాండరింగ్లు కేవలం ఓ చిన్నభాగం మాత్రమే” అని హెచ్చరించారు.
ఉగ్రవాదులు దేశాల సామాజిక స్థిరత్వాన్ని దెబ్బతీయాలనే దారుణ లక్ష సాధన కోసం డార్క్నెట్, మెవెర్స్, క్రిప్టో కరెన్సీలను వాడుకొంటున్నారని ప్రధాని తెలిపారు. వార్తలపై విశ్వాసాన్ని ఫేక్ న్యూస్, డీప్ ఫేక్లు దెబ్బతీస్తాయని చెప్పారు. ఇది సామాజిక అస్థిరతకు కారణమవుతుందని చెబుతూ సైబర్ క్రైమ్పై పోరాడేందుకు ప్రపంచ సహకారం అనివార్యం అని ప్రధాని స్పష్టం చేశారు.
దేశంలోగత తొమ్మిదేళ్లుగా నెలకొన్న రాజకీయ స్థిరత్వం తోనే పలు సంస్కరణలు సాధ్యమయ్యాయని మోదీ తెలిపారు. అభివృద్ధి అనేది దీనికి లభించిన బోనస్ మాత్రమేనని అని చెప్పారు.
More Stories
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికపై అందరి దృష్టి
కాంగ్రెస్కు అధికారమిస్తే రామాలయాన్ని కూల్చేస్తారు
ఆప్ తనను `బిజెపి ఏజెంట్’ అనడంపై మండిపడ్డ స్వాతి మలివాల్