కాంగ్రెస్ సభ్యుల ఆందోళనతో మణిపూర్ అసెంబ్లీ నిరవధిక వాయిదా

మణిపూర్ అసెంబ్లీ ఒకే రోజు సమావేశం మంగళవారం ప్రారంభమైన గంట లోనే కాంగ్రెస్ సభ్యుల ఆందోళనతో నిరవధిక వాయిదా పడింది. సమావేశాలను అయిదు రోజుల పాటు పొడిగించాలని కాంగ్రెస్ సభ్యులు డిమాండ్ చేయడం గందరగోళానికి దారితీసింది. 

విపక్ష ఎమ్‌ఎల్‌ఎలకు నాయకత్వం వహించిన మాజీ సిఎం ఒక్రమ్ ఇబోబీ మణిపూర్ రాష్ట్రంలో ప్రస్తుతం జాతుల మధ్య రగులుతున్న హింసాకాండపై చర్చించడానికి అసెంబ్లీ ఒకరోజు సమావేశం సరిపోదని మాజీ సిఎం ఒక్రమ్ ఇబోబి సింగ్ వాదించారు. కుకి ఎమ్‌ఎల్‌ఎలు మొత్తం 10 మంది సమావేశాలకు గైరు హాజరయ్యారు. 

అసెంబ్లీ సమావేశాలు ఉదయం 11 గంటలకు ప్రారంభమైన తర్వాత మే 3 నాటి హింసాకాండలో మరణించిన వారికి సంతాప సూచకంగా రెండు నిమిషాలు మౌనం పాటించారు. ముఖ్యమంత్రి ఎన్. బీరేన్ సింగ్ సభను ఉద్దేశించి మాట్లాడుతూ హింసాకాండలో మరణించిన వారి పట్ల విషాదం వెలిబుచ్చారు. 

మణిపూర్‌లోని కులాలు, మతాలకు అతీతంగా ప్రజలందరి సామరస్యత, ఏకాభిప్రాయంతో పనిచేయడానికి సభ ఏకగ్రీవంగా తీర్మానించిందని తెలిపారు. ప్రజల్లో బేధాలు సమసి పోయేందుకు సభ కృషి చేస్తుందని పేర్కొన్నారు. చంద్రయాన్ 3 విజయాన్ని ఈ సందర్భంగా సభ ప్రశంసించింది. ఇస్రో శాస్త్రవేత్తల బృందం లోని మణిపూర్‌కు చెందిన శాస్త్రవేత్త ఎన్. రఘుసింగ్ ఉన్నందున ఆయనకు అభినందనలు తెలిపారు. 

ఈ సందర్భంగా కాంగ్రెస్ సభ్యులు లేచి “పరిహాసాలు ఆపుదాం.., ప్రజాస్వామ్యాన్ని మనం పరిరక్షిద్దాం” అంటూ కేకలు వేశారు. ఐదు రోజుల సమావేశాల కోసం డిమాండ్ చేశారు. స్పీకర్ టిహెచ్ సత్యబ్రసింగ్ ఎంత అభ్యర్థించినా ఫలితం లేకపోవడంతో సభను 30 నిమిషాల పాటు వాయిదా వేశారు. ఆ తర్వాత సభ తిరిగి ప్రారంభమైనా గందరగోళం ఆగకపోవడంతో నిరవధికంగా వాయిదా వేశారు.