దిగవంత ముఖ్యమంత్రి, ప్రముఖ సినీ నటుడు ఎన్టీ రామారావు శతజయంతి సందర్భంగా రూ.100 స్మారక నాణేన్ని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సోమవారం విడుదల చేశారు. న్యూఢిల్లీలోని రాష్ట్రపతి భవన్లోని సాంస్కృతిక కేంద్రంలో జరిగిన ఈ కార్యక్రమానికి కేంద్ర మాజీ మంత్రి పురందేశ్వరి, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, నటుడు బాలకృష్ణ, ఎన్టీఆర్ కుటుంబ సభ్యులు, సినీ, రాజకీయ రంగాల్లో ఎన్టీఆర్తో పనిచేసిన సన్నిహతులు హాజరయ్యారు.
ఈ సందర్భంగా రాష్ట్రపతి ముర్ము మాట్లాడుతూ భారతీయ సినిమా చరిత్రలో ఎన్టీర్ ఎంతో ప్రత్యేకమని తెలిపారు. కృష్ణుడు, రాముడి వంటి పాత్రల్లో ఆయన నటన అద్భుతమని, ప్రజల్లో చెరగని ముద్ర వేశారని చెప్పారు. రాజకీయాల్లోనూ ఎన్టీఆర్ తన ప్రత్యేకత చాటుకున్నారని తెలిపారు. సామాజిక న్యాయం కోసం ఎంతో కృషి చేశారని కొనియాడారు. ఎన్టీఆర్ విలక్షణ వ్యక్తిత్వాన్ని ప్రజలు ఎప్పటికీ మర్చిపోలేరని చెప్పారు.
హైదరాబాద్ మింట్ కాంపౌండ్లో తయారైన ఈ స్మారక నాణెం.. 44 మిల్లీమీటర్ల చుట్టుకొలతతో 50 శాతం వెండి, 40 శాతం రాగి, 5 శాతం నికెల్, 5 శాతం జింక్ కలిపి ఉంటుంది. ఓ వైపు ఎన్టీఆర్ బొమ్మ ఉంటే మరోవైపు మూడు సింహాల బొమ్మ ఉంటుంది. ఎన్టీఆర్ శత జయంతి అని హిందీలో రాసి దాని కింద 1923-2023 అని రాసుంటుంది.
టీడీపీ ఎంపీలు కనకమేడల రవీంద్ర కుమార్, గల్లా జయదేవ్, కేశినేని నాని, రామ్మోహన్ నాయుడు, ఎంపీ రఘురామకృష్ణరాజు, బీజేపీ ఎంపీ సీఎం రమేష్, మాజీ ఎంపీలు సుజనా చౌదరి, కంభంపాటి రామ్మోహన్ రావు, అశ్విని దత్, బీజేపీ జాతీయ కార్యదర్శి సత్యకుమార్ తదితరులు ఎన్టీఆర్ స్మారక నాణెం విడుదల కార్యక్రమానికి హాజరయ్యారు.
More Stories
విపక్షాలకు పాకిస్థాన్పై ప్రేమ? భారత సైన్యంపై ద్వేషం!
నేడు 92 స్థానాల్లో మూడో దశ ఎన్నికల పోలింగ్
కేజ్రీవాల్పై ఎన్ఐఏ దర్యాప్తునకు ఎల్జీ సక్సేనా సిఫార్సు