ప్రజ్ఞాన్ రోవర్‌కి తప్పిన భారీ ప్రమాదం

చంద్రుని ఉపరితలంపై చక్కర్లు కొడుతూ, అక్కడ పరిస్థితులపై అధ్యయనం చేస్తున్న ప్రజ్ఞాన్ రోవర్‌కి భారీ ప్రమాదం తప్పింది. తాను ప్రయాణిస్తున్న మార్గంలో అది నాలుగు మీటర్ల వెడల్పు గల బిలాన్ని గుర్తించింది. ఇది గమనించిన ఇస్రో శాస్త్రవేత్తలు వెంటనే అప్రమత్తమై, రోవర్‌కు కీలక ఆదేశాలు జారీ చేశారు. తన మార్గాన్ని మళ్లించుకోవాలని సూచించారు. 
 
దీంతో రోవర్ తన మార్గాన్ని మళ్లించుకుంది. ప్రస్తుతం ఇది సురక్షిత మార్గంలో పయనిస్తున్నట్టు ఇస్రో శాస్త్రవేత్తలు తెలిపారు. ‘‘ఈ బిలాన్ని ప్రజ్ఞాన్ రోవర్ ఆగస్టు 27వ తేదీన 3 కిలోమీటర్ల దూరంలోనే గుర్తించింది. దీంతో మార్గం మార్చుకోవాల్సిందిగా వెంటనే రోవర్‌ని ఆదేశించాం. ఇప్పుడది సురక్షితంగా కొత్త మార్గంలో పయనిస్తోంది’’ అని ఇస్రో ట్విటర్ మాధ్యమంగా తెలిపింది.
 
రోవ‌ర్ వెళ్తున్న దారిలో భారీ అగాధం ఎదురైంది. చంద్రుడి ఉప‌రిత‌లంపై దాదాపు నాలుగు మీట‌ర్ల విస్తీర్ణం ఉన్న‌ గొయ్యిని గుర్తించారు. దీంతో ప్ర‌జ్ఞాన్ రోవ‌ర్ రూటును మార్చేశారు. రోవ‌ర్‌కు ఉన్న నావిగేష‌న్ కెమెరాలు ఆగ‌స్టు 27వ తేదీన ఆ క్రాట‌ర్ ఫోటోను తీశాయి. ఆ ఫోటోను సోమవారం ఇస్రో త‌న సోష‌ల్ మీడియా అకౌంట్‌లో అప్‌లోడ్ చేసింది. 
 
ఆ గొయ్యి రోవ‌ర్ ప్ర‌జ్ఞాన్‌కు సుమారు మూడు మీట‌ర్ల దూరంలో ఉన్న‌ట్లు శాస్త్ర‌వేత్త‌లు గుర్తించారు. దీంతో మ‌ళ్లీ రోవ‌ర్‌ను వెన‌క్కి తీసుకెళ్లారు. అయితే ఇప్పుడు ఆ రోవ‌ర్ కొత్త రూట్లో సుర‌క్షితంగా వెళ్తున్న‌ట్లు ఇస్రో పేర్కొన్న‌ది.
 
కాగా.. విక్రమ్ ల్యాండర్ చంద్రుని ఉపరితలంపై అడుగుపెట్టినప్పటి నుంచి, ల్యాండర్ మాడ్యూల్ రికార్డ్ చేస్తున్న దృశ్యాల్ని ఇస్రో సంస్థ సోషల్ మీడియాలో షేర్ చేస్తూ వస్తోంది. తొలుత ల్యాండర్ నుంచి ప్రజ్ఞాన్ రోవర్ జారుకుంటూ కిందకు దిగిన దృశ్యాల్ని ఇస్రో పంచుకుంది. అనంతరం శివశక్తి పాయింట్ (విక్రమ్ ల్యాండర్ ల్యాండింగ్ సైట్) వద్ద రోవర్ చక్కర్లు కొట్టిన వీడియోని విడుదల చేశారు.
 
అందులోని ఛేస్ట్ పేలోడ్ చంద్రుని ఉపరితలంలోని నేల ఉష్ణోగ్రతల తీరును కొలిచిన వివరాల్ని ‘గ్రాఫ్‌’తో సహా ఇస్రో వెల్లడించింది. ఈ గ్రాఫ్‌ను పరిశీలించినపుడు.. చంద్రునిపై ఉష్ణోగ్రతలు మైనస్ 10 డిగ్రీల సెల్సియస్ నుంచి దాదాపు 55 డిగ్రీల సెల్సియస్ వరకు ఉన్నట్లు మనం అర్థం చేసుకోవచ్చు. ఇంకా మరిన్ని వివరాలను తెలుసుకోవడం కోసం పరిశోధనలు జరుగుతున్నాయని ఇస్రో తెలిపింది.ఇదిలావుండగా, జులై 14వ తేదీన చంద్రయాన్-3 ప్రాజెక్ట్‌ని లాంచ్ చేయగా, అది ఆగస్టు 23వ తేదీన సాయంత్రం 6:03 గంటల సమయంలో విజయవంతంగా చంద్రుని ఉపరితలంపై ల్యాండ్ అయ్యింది. దీంతో.. చంద్రుని ఉపరితలంపై కాలు మోపిన నాలుగో దేశంగా భారత్ నిలిచింది. అంతేకాదు, దక్షిణ ధ్రువంపై చంద్రయాన్-3ని ల్యాండ్ చేసి, ఈ ఘనత సాధించిన తొలి దేశంగా భారత్ సరికొత్త చరిత్ర సృష్టించింది. 

ఈ ప్రాజెక్ట్ విజయవంతం అయిన ఉత్సాహంలో ఇస్రో సంస్త సెప్టెంబర్ 2వ తేదీన ఆదిత్య ఎల్1 అనే సోలార్ మిషన్‌ను లాంచ్ చేసేందుకు సమాయత్తమవుతోంది. సూర్యుని పుట్టుక, అక్కడి వాతావరణ పరిస్థితులు, సౌర కరోనా ఉష్ణోగ్రత్తలు గణనీయంగా పెరగడానికి గల కారణాల్ని తెలుసుకోవడం కోసం ఈ ప్రయోగాన్ని చేపడుతున్నారు.