మరోసారి అధికారంలోకి రాలేమని కేసీఆర్ కు అర్థమైంది

బీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్‌ విడుదల చేసిన ఎమ్మెల్యే అభ్యర్థుల జాబితా చూస్తే మరోసారి అధికారంలోకి రాలేమని కేసీఆర్ కు అర్థమైందని కేంద్ర మంత్రి, రాష్త్ర బిజెపి అధ్యక్షుడు జి కిషన్‌ రెడ్డి ఎద్దేవా చేశారు. తెలంగాణలో బీజేపీకి పెరుగుతున్న ఆదరణ చూసి కేసీఆర్‌లో ఆందోళన మొదలైందని తెలిపారు. కేసీఆర్ లో నెలకొన్న భయంతోనే గజ్వేల్‌తో పాటు కామారెడ్డి నుంచి పోటీ చేయాలని నిర్ణయించుకున్నారని కిషన్‌ రెడ్డి స్పష్టం చేశారు.
మెజారిటీ ఎమ్మెల్యేలకు మళ్లీ సీట్లు ఇవ్వడం ద్వారా వచ్చే ఎన్నికల్లో కేసీఆర్ తమ ఓటమిని అంగీకరించినట్లు స్పష్టమవుతోందని పేర్కొన్నారు. ఐదేళ్లుగా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు నియోజకవర్గాల్లో చేస్తున్న అవినీతి, అక్రమాలకు పచ్చజెండా ఊపినట్లయిందని తెలిపారు. నిజాయితీగా పోటీ చేస్తే ఎలాగూ గెలిచేది లేదు.. కాబట్టి కనీసం అక్రమంగా సంపాదించిన డబ్బుతోనైనా ప్రయత్నించాలని కేసీఆర్ ఆలోచనగా ఉందని ధ్వజమెత్తారు.

 లోక్‌సభలో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించాలంటూ ఢిల్లీలోని జంతర్‌మంతర్‌లో దొంగ దీక్షలు చేస్తారని, తెలంగాణలో మాత్రం 33 శాతం సీట్లు కేటాయించకుండా కేవలం 6 శాతం సీట్లే మహిళలకు కేటాయించారని విమర‌్శించారు. మహిళలకు సీట్ల కేటాయింపుపై కేసీఆర్‌ను ఎమ్మెల్సీ కవిత నిలదీయాలని ఆయన హితవు చెప్పారు.

హైదరాబాద్ ప్రాంతంలో బీఆర్ఎస్, మజ్లిస్ కలిసి 29 సీట్లు గెలవాలని కేసీఆర్ చెప్పారని పేర్కొంటూ ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ చెప్పిన అభ్యర్థులనే ఎన్నికల బరిలో దింపుతూ ఆ పార్టీకి కేసీఆర్ మద్దతుగా నిలుస్తున్నారని ఆరోపించారు.

కాగా, బి ఆర్ఎస్ నుంచి పోటీ చేయబోయే అభ్యర్థుల జాబితా చూసాక తెలంగాణ ఎమ్యెల్సీ కవిత తెలంగాణ మహిళలకు క్షమాపణ చెప్పాలని బిజెపి రాష్ట్ర అధికార ప్రతినిధి రాణి రుద్రమ డిమాండ్ చేశారు.  కేవలం లిక్కర్ స్కాం నుంచి దేశ ప్రజలను పక్క దారి పట్టించేందుకే కవిత మహిళా రిజర్వేషన్ డ్రామా అనేది ఈ జాబితాతో రుజువైందని ఆమె ధ్వజమెత్తారు.

119 స్థానాల్లో 7 గురు మహిళలకు మాత్రమే టికెట్ లు ఇచ్చిన మీకు మహిళా రిజర్వేషన్ బిల్లు కోసం మాట్లాడే అర్హత లేదని ఆమె స్పష్టం చేశారు. జనాభాలో 50% ఉన్న మహిళలకు బిఆర్ఎస్ 6 శాతం  టికెట్ లు ఇస్తూ దేశవ్యాప్తంగా పార్టీ కమిటీలలో మహిళలకు 30% రిజర్వేషన్ ఇస్తున్న బిజెపి మీద వీళ్ళు పోరాటం చేస్తాననడం సిగ్గుచేటని ఆమె మండిపడ్డారు. మహిళా రిజర్వేషన్ కోసం ఢిల్లీ రోడ్ ల మీద ధర్నాలు చేసిన కవిత ప్రగతి భవన్ ముంగట ఎందుకు ధర్నా లు చేయలేదని ఆమె ప్రశ్నించారు.