ఈ ఏడాది జూన్తో పోలిస్తే జూలైలో కూరగాయల ధరలు ముఖ్యంగా టమాటా కొండెక్కడం రిటైల్ ద్రవ్యోల్బణం భారీ పెరుగుదలకు దారితీసింది. ముగిసిన నెలలో రిటైల్ ద్రవ్యోల్బణంలో సగం వెయిటేజి ఉన్న కూరగాయల ద్రవ్యోల్బణం భారీగా 37.34 శాతం పెరిగింది. వాస్తవానికి 2022 జూలైలో ఈ ద్రవ్యోల్బణం 0.93 శాతం తగ్గింది. ఆహారోత్పత్తులు, పానీయాల ద్రవ్యోల్బణం 4.63 శాతం నుంచి 10.57 శాతానికి చేరింది.
అసమాన రుతుపవనాల కారణంగా దేశవ్యాప్తంగా రెండు నెలల నుంచి కూరగాయల ధరలు పెరుగుతున్నాయి. హోల్సేల్ మార్కెట్లోనైతే టమోటో ధర మూడు నెలల్లో ఏకంగా 1400 శాతం ఎగిసింది. ఆహారోత్పత్తుల ధరల విలయాన్ని ప్రతిబింబిస్తూ జూలై నెలలో రిటైల్ ద్రవ్యోల్బణం దాదాపు 15 నెలల గరిష్ఠస్థాయి 7.44 శాతానికి ఎగిసినట్టు కేంద్ర గణాంకాల శాఖ నేతృత్వంలోని నేషనల్ స్టాటస్టికల్ ఆఫీస్ (ఎన్ఎస్వో) తెలిపింది.
2022 ఏప్రిల్ నెల (7.79 శాతం) తర్వాత ఇదే అత్యంత గరిష్ఠస్థాయి. ఈ ఏడాది జూన్లో ఇది 4.81 శాతం కాగా, 2022 జూలైలో 6.71 శాతం. ఇటీవల రాయిటర్స్ వార్తా సంస్థ సర్వేలో పాల్గొన్న 53మంది ఆర్థిక వేత్తలు ఆహారోత్పత్తుల ధరల కారణంగా జూలైలో కన్జూమర్ ప్రైస్ ఇండెక్స్ (సీపీఐ) 6.4 శాతం పెరుగుతుందని అంచనావేయగా, దానిని మించి నమోదుకావడం గమనార్హం. ప్రస్తుత జూలై-సెప్టెంబర్ త్రైమాసికంలో ద్రవ్యోల్బణం 6.2 శాతం, మొత్తం ఆర్థిక సంవత్సరంలో 5.4 శాతంగా ఉంటుందని గతవారం ఆర్బీఐ పాలసీ సమీక్షలో అంచనా వేశారు.
అయితే, ఏకంగా 7.44 శాతానికి చేరిపోవడం ఆందోళన కలిగిస్తుంది. ఇది ఆర్బీఐ నిర్దేశిత స్థాయి 6 శాతాన్ని మించడం గమనార్హం. వరుసగా నాలుగు నెలల పాటు నిర్ణీత స్థాయిలోపే కదలాడిన ద్రవ్యోల్బణం జూలైలో ఒక్కసారిగా భగ్గుమంది. ఇక కేంద్ర వాణిజ్యశాఖ విడుదల చేసిన హోల్సేల్ ధరల పరిస్థితీ ఇంతే దారుణంగా ఉంది.
జూలైలో హోల్సేల్ స్థాయిలో కూరగాయల ద్రవ్యోల్బణం అత్యంత భారీగా 62.12 శాతం పెరిగింది. 2022 జూలైలో ఈ పెరుగుదల 18.46 శాతం. మొత్తం హోల్సేల్ ఆహారోత్పత్తుల ద్రవ్యోల్బణం వార్షిక ప్రాతిపదికన 7.75 శాతం పెరిగింది. ఈ ఏడాది జూన్లో ఇది 1.24 శాతం తగ్గుదల కనపర్చినప్పటికీ, మరుసటి నెలలోనే భగ్గుమనడం గమనార్హం.
ప్రపంచమార్కెట్లో గత నెల క్రూడాయిల్ ధర తగ్గినందున, మొత్తంగా హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్ (డబ్ల్యూపీఐ) మాత్రం జూలైలో 1.36 శాతం దిగింది. అయితే జూన్లో 4.12 శాతం పడిపోయిన డబ్ల్యూపీఐ సూచి, జూలైలో తక్కువ తగ్గుదలను కనపర్చడానికి కారణంగా అధిక కూరగాయల ధరలే. ఆర్థికవేత్తలైతే జూలైలో మొత్తంగా టోకు ధరలు 2.50 శాతం తగ్గుతాయని అంచనా వేశారు. ఖనిజ నూనెలు, లోహాలు, రసాయినాలు, రసాయిన ఉత్పత్తులు, జౌళి ఉత్పత్తుల ధరలు తగ్గినందున, టోకు ద్రవ్యోల్బణం రేటు క్షీణించిందని వాణిజ్య శాఖ తెలిపింది. టోకు ఆహారోత్పత్తుల ధరలైతే ఏ నెలకానెల పెరుగుతూ వస్తున్నాయి.
More Stories
మహారాష్ట్ర నుండి ఉల్లి ఎగుమతులకు అనుమతి
రుతుపవనాల తర్వాతే ఆహార ధరలు తగ్గుముఖం
ఐదు ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో వాటా ఉపసంహరణ