హకీంపేట్ స్పోర్ట్స్ స్కూల్ లో లైంగిక వేధింపుల ప్రకంపనలు

తెలంగాణలో హకీంపేట్ స్పోర్ట్స్ స్కూల్ లో లైంగిక వేధింపుల వ్యవహారం ప్రకంపనలు సృష్టిస్తోంది. హకీంపేట స్పోర్ట్స్ స్కూల్లో బాలికలపై లైంగిక వేధింపులకు పాల్పడుతున్న ఓ అధికారి వెలుగులోకి వచ్చింది. ఓ వార్త పత్రిక ప్రధానంగా ప్రచురించిన వార్తలపై రాష్ట్ర క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ స్పందిస్తూ సదరు అధికారిపై సస్పెన్షన్ వేటు వేసినట్లు ప్రకటించారు. 

ఈ ఘటనపై ఐదుగురు సభ్యులతో కమిటీని ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. హకీంపేట స్పోర్ట్స్ స్కూల్ లో బాలికలపై లైంగిక వేధింపుల వార్తలు వైరల్ కావడంతో ఎమ్మెల్సీ కవిత ట్వీట్ చేస్తూ చర్యలు తీసుకోవాలంటూ సూచించడంతో మంత్రి శ్రీనివాస్ గౌడ్ వెంటనే స్పందించారు.  హకీంపేటలోని స్పోర్ట్స్ స్కూల్ లో బాలికలు వివిధ ఆటల పోటీలకు సంబంధించి కోచింగ్ తీసుకుంటున్నారు.

హాస్టల్ లో ఉంటూ ప్రాక్టీస్ చేస్తున్నారు. స్పోర్ట్స్ స్కూల్ ఓఎస్డీ హరికృష్ణ కొంతకాలంగా లైంగిక వేధింపులకు పాల్పడుతున్నాడని బాలికలు ఆరోపిస్తున్నారు.  బాలికల హాస్టల్ లోకి అధికారులైనా సరే రాత్రిపూట పురుషులు వెళ్లడం నిషేధం. అయితే, ఓఎస్డీ మాత్రం హాస్టల్ ఆవరణలోని గెస్ట్ హౌస్ లోనే మకాం పెట్టారని బాలికలు చెప్పారు.

సాయంత్రం పూట ఆట విడుపు పేరుతో బాలికలలో కొంతమందిని బయటకు తీసుకెళుతున్నాడని, అక్కడ లైంగిక వేధింపులకు పాల్పడుతున్నాడని ఆరోపిస్తున్నారు. అర్ధరాత్రి గదుల్లోకి వచ్చి అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడని చెప్పారు. హరికృష్ణకు ఓ మహిళా ఉద్యోగి సహా ముగ్గురు అధికారులు సహకరిస్తున్నారని ఆరోపించారు.

కాగా, తనపై వచ్చిన ఆరోపణలపై ఓఎస్డీ హరికృష్ణ స్పందిస్తూ సెలక్షన్ సమయంలో ఇలాంటి ఆరోపణలు చేయడం దురదృష్టకరమని చెప్పారు. స్కూలుకు వస్తున్న మంచిపేరును చూసి ఓర్వేలేక తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని ఆరోపించారు. ఈ ఘటనపై సమగ్ర విచారణ జరిపించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నట్లు హరికృష్ణ వివరించారు.