కాళేశ్వరం మీద అనవసర రాద్ధాంతం

కాళేశ్వరం ప్రాజెక్టుకు రుణాలు అందజేసింది కేంద్ర ప్రభుత్వ సంస్థలు కాదా? ఇదే విషయాన్ని చెబితే ఎందుకు రాద్ధాంతం చేస్తున్నారని బీజేపీ ఎంపీ, పార్లమెంటరీ బోర్డు సభ్యుడు డా. కె. లక్ష్మణ్ ప్రశ్నించారు. శుక్రవారం ఆయన పార్లమెంట్ మీడియా పాయింట్ వద్ద విలేకరులతో మాట్లాడుతూ పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో ప్రజా అంశాలు చర్చకు రాకుండా ప్రతిపక్ష కూటమి అడ్డుకుందని ఆరోపించారు.

 కాంగ్రెస్ గొడవకు వత్తాసు పలికి బీఆర్ఎస్ అవిశ్వాసంలో ఆ పార్టీతో కలిసి నడిచిందని విమర్శించారు. అవిశ్వాస తీర్మానంపై ఓటింగ్ సమయంలో సభలో లేని విపక్షాలు అవిశ్వాసం పెట్టడం దేనికని ఆయన నిలదీశారు. కాంగ్రెస్ తోక పార్టీలుగా బీఆర్ఎస్, మజ్లిస్ కూడా వాకౌట్ చేశాయని ఎద్దేవా చేశారు. అవిశ్వాస తీర్మానం పెట్టి చివరి వరకు లేకుండా పారిపోవడం చరిత్రలో బహుశా ఇదే మొదటిసారని అభిప్రాయపడ్డారు.

పార్లమెంటు సాక్షిగా ప్రతిపక్షాలు బొక్క బోర్ల పడ్డాయని, అభాసుపాలయ్యాయని ఎంపీ ధ్వజమెత్తారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ కలిసి ఆడుతున్న నాటకం ఢిల్లీలో బహిర్గతమైందని ఆయన విమర్శించారు.  కేసీఆర్ కుటుంబ పాలన అంతం చేయడానికి బీజేపీ మాత్రమే ఏకైక ప్రత్యమ్నాయని ఎంపీ స్పష్టం చేశారు. బీఆర్ఎస్ వైఫల్యాలను ఎండగట్టడంతో పాటు, ప్రత్యామ్నాయంగా అభివృద్ధి ఎజెండాను ప్రజల ముందు ఉంచుతామని వెల్లడించారు.

కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసిన గృహాలను ఇప్పటిదాకా నిర్మించి పేదలకు ఇవ్వలేకపోయిన బీఆర్ఎస్ నేతలు విమర్శలు చేస్తున్నారని లక్ష్మణ్ మండిపడ్డారు. పార్లమెంటు సభ్యుడిగా తెలంగాణకు జరుగుతున్న అన్యాయం గురించి బండి సంజయ్ అవిశ్వాస తీర్మానం సందర్భంగా మాట్లాడారని ఆయన కొనియాడారు.

“రజాకార్ల” బృందంకు అభినందన

 
రజాకార్ల పాలనను కళ్లకు కట్టేలా సినిమా తీస్తున్న ‘‘రజాకార్’’ సినిమా బృందాన్ని డా. లక్ష్మణ్)అభినందించారు. శుక్రవారం తెలంగాణ బీజేపీ నాయకులు తూళ్ల వీరేందర్ గౌడ్ ఆధ్వర్యంలో ఢిల్లీలో జరిగిన ప్రముఖ స్వాతంత్ర్య సమర యోధులు, దేశభక్తుడు బత్తిని మొగిలయ్య గౌడ్ వర్ధంతి కార్యక్రమంలో కేంద్ర పర్యాటక శాఖ సహాయ మంత్రి శ్రీపాద్ నాయక్ , డా. లక్ష్మణ్ , తెలంగాణ బీజేపీ నాయకులు అలే భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.
 
ఈసందర్భంగా లక్ష్మణ్ మీడియాతో మాట్లాడుత గత పాలకులు ఎంతోమంది సమరయోధుల చరిత్ర తెలియకుండా చేశారని మండిపడ్డారు.దేశంలో నెహ్రు కుటుంబం, తెలంగాణలో కల్వకుంట్ల కుటుంబ చరిత్రే చరిత్ర అన్నట్లు వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మజ్లిస్ ఒత్తిడికీ లోబడి నిజాంకి వ్యతిరేకంగా పోరాడినవారి చరిత్ర మరుగున పడేలా చేశారని దయ్యబట్టారు.
బీజేపీ అధికారంలోకి వస్తే మరుగునపడిన ఇలాంటి యోధుల విగ్రహాలు పెట్టడమే కాదు, త్యాగాలను స్మరిస్తూ  వారి కుటుంబాలకు న్యాయం చేస్తామని చెప్పారు. సమాజానికి వన్నె తెచ్చిన వారికి బీజేపీ సరైన గుర్తింపు ఇస్తుందని లక్ష్మణ్ పేర్కొన్నారు.