అసెంబ్లీలో జ‌య‌ల‌లిత చీర లాగితే హేళనగా నవ్వారు

తమిళనాడు అసెంబ్లీలో మాజీ సీఎం జయలలితకు జరిగిన ఘోర అవమానాన్ని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రస్తావించారు. మణిపూర్ లో మహిళల పట్ల జరిగిన అరాచక ఘటనల నేపథ్యంలో కేంద్ర సర్కారు విఫలమైందంటూ కాంగ్రెస్ తోపాటు దాని మిత్ర పక్షాలు  ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంపై జరిగిన చర్చలు ఈ అంశాన్ని ప్రస్తావించారు.

తొలుత సభలో డీఎంకే ఎంపీ కనిమొళి మాట్లాడుతూ.. దేశంలో మహిళలపై నేరాలు పెరిగిపోతున్నాయని అన్నారు. ఇందుకు నిర్మలా సీతారామన్ బదులిస్తూ మహిళ అన్ని చోట్ల బాధితురాలిగా ఉంటుందన్న దాన్ని తాను అంగీకరిస్తానని చెప్పారు. మణిపూర్, ఢిల్లీ, రాజస్థాన్ ఘటనలను సీరియస్ గా తీసుకోవాల్సిందే. కానీ రాజకీయాలు చేయకూడదు. తమిళనాడు అసెంబ్లీలో 1989 మార్చి 25న జరిగిన ఒక సంఘటన గురించి నేను ఈ సభ మొత్తానికి గుర్తు చేయాలని అనుకుంటున్నాను” అని తెలిపారు.

“అప్పుడు జయలలిత సీఎంగా లేరు. ఆమె సభలో ప్రతిపక్ష నేతగా ఉన్నారు. తమిళనాడు అసెంబ్లీలో జయలలిత చీర లాగారు. డీఎంకే సభ్యులు ఆమె పట్ల హేళనగా నవ్వారు. జయలలితను డీఎంకే మరిచిపోయిందా?” అంటూ ఆమె ప్రశ్నించారు.  “మీరు ఆమె చీరను లాగేశారు. ఆమెను కించపరిచారు. తాను ముఖ్యమంత్రి అయ్యే వరకు తిరిగి సభకు రాకూడదని ఆమె ఆ రోజు తీర్మానించుకున్నారు. రెండేళ్ల తర్వాత సీఎంగా ఆమె సభలో అడుగుపెట్టారు’’ అని నిర్మలా సీతారామన్ అవిశ్వాసానికి మద్దతు పలికిన పార్టీల్లో ఒకటైన డీఎంకే తీరుని ఏకిపారేశారు.

 అసెంబ్లీలో జయలలితను అవమానిస్తుంటే చూస్తూ ఎలా ఉన్నారంటూ డీఎంకే ఎంపీ కనిమొళిని మంత్రి నిలదీశారు. కౌరవ సభ, ద్రౌపది గురించి మాట్లాడుతున్న మీరు.. జయలలిత గురించి మర్చిపోయారా? అని డీఎంకే సభ్యుల్ని ప్రశ్నించారు.