మహారాష్ట్రలో కరోనా కొత్త వేరియంట్!

బ్రిటన్‌ను భయపెట్టిస్తున్న కరోనా కొత్త వేరియంట్ ఇప్పుడు భారత్‌లో కూడా విజృంభిస్తోంది. యూకేలో విస్తృతంగా వ్యాపిస్తున్న ఎరిస్‌ (ఈజీ.5.1) అని పిలిచే ఈ వేరియంట్ కేసులు మహారాష్ట్రలో కూడా గణనీయంగా పెరుగుతున్నాయి. మహారాష్ట్రలో జూలై చివరినాటికి 70 యాక్టివ్ కేసులు ఉండగా, ఆగస్టు 6 నాటికి ఆ సంఖ్య 115కు చేరింది. మంగళవారంకు ఆ సంఖ్య 106కి తగ్గింది. 
 
అయితే వీటిలో అత్యధిక కేసులు ముంబైలో నమోదయ్యాయి. ముంబైలో 43, పుణెలో 34, థానేలో 25 కేసులు నమోదయ్యాయి. రాయ్‌గడ్‌, సంగ్లీ, షోలాపూర్‌, సతారా, పాలఘఢ్‌లో ఒక్కో కొవిడ్‌-19 కేసు బయటపెడింది. ఒక్కసారిగా కరోనా కొత్త వేరియంట్‌ కేసులు పెరుగుతుండటంతో మళ్లీ భయాందోళనలు మొదలయ్యాయి.
 
ఈ నేపథ్యంలో ఆ రాష్ట్ర సీనియర్‌ అధికారి ఒకరు స్పందిస్తూ కేసులు పెరిగినంత మాత్రాన కొత్త వేరియంట్‌ విజృంభిస్తుందని అప్పుడే నిర్ధారించలేమని స్పష్టం చేశారు. ఒక వారం పాటు నమోదైన కేసులను పరిశీలించిన తర్వాతనే దీనిపై స్పష్టత ఇవ్వగలమని పేర్కొన్నారు. సాధారణంగా జూన్‌ నుంచి సెప్టెంబర్‌ మధ్యలో శ్వాస కోశ సమస్యలు ఎక్కువగా ఉంటాయని ఆయన తెలిపారు. 
 
నాలుగు ఐదు రోజులుగా కరోనా కేసులు కూడా అధికంగానే నమోదవుతున్నాయని చెప్పారు. ఎరిస్‌ వేరియంట్ తొలిసారిగా మే నెలలో బయటపడిందని మహారాష్ట్రలోని బీజే మెడికల్‌ కాలేజీకి చెందిన సీనియర్‌ శాస్త్రవేత్త రాజేశ్‌ కార్యకర్తె తెలిపారు. అయితే అప్పటినుంచి ఇప్పటిదాకా కేసుల్లో గణనీయ పెరుగుదల మాత్రం లేదని స్పష్టం చేశారు.ఒమిక్రాన్‌ వేరియంట్‌ కొన్ని జన్యు మార్పులు సంతరించుకోవడం ద్వారా ఈ న్యూ వేరియంట్‌ ఉత్పన్నమైందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఒమిక్రాన్‌ వేరియంట్‌ సోకిన వారిలో కనిపించిన వ్యాధి లక్షణాలే ఇంచుమించుగా ఈ కొత్త వేరియంట్‌ సంక్రమించిన వారిలో కూడా కనిపిస్తున్నాయని తెలిపారు. 

సాధారణంగా ఒమిక్రాన్‌ వేరియంట్‌ సోకిన వారిలో ముక్కు కారడం, తీవ్రమైన తల నొప్పి, గొంతు నొప్పి, తుమ్ములు, ఆయాసం లాంటి లక్షణాలు ఎక్కువగా కనిపిస్తాయని, కొత్త వేరియంట్ ఎరిస్‌ సోకిన వారిలో ఈ లక్షణాలే కామన్‌గా ఉన్నాయని పరిశోధకులు వెల్లడించారు. ప్రస్తుతం బ్రిటన్‌లో ఎక్కువగా ఒమిక్రాన్‌ వేరియంట్‌ కొవిడ్‌ కేసులే ఉన్నాయని, ఆ తర్వాత ఎరిస్‌ వేరియంట్‌ కొవిడ్‌ కేసులదే రెండో స్థానమని వారు తెలిపారు.