హనీట్రాప్‌లో సిఐఎస్‌ఎఫ్ సెక్యూరిటీ గార్డ్

పాకిస్తాన్‌ మహిళ హనీట్రాప్‌లో స్టీలు ప్లాంట్‌ సెక్యూరిటీ విధుల్లో ఉన్న సీఐఎస్‌ఎఫ్‌ కానిస్టేబుల్‌ కపిల్‌ కుమార్‌ జగదీష్‌భాయ్‌ మురారీ చిక్కుకోవడాన్ని కేంద్ర నిఘా సంస్థలు గుర్తించాయి. గుజరాత్‌కు చెందిన కపిల్‌ కుమార్‌ గతంలో హైదరాబాద్‌లోని భారత్‌ డైనమిక్స్‌ లిమిటెడ్‌‌లో విధులు నిర్వహించాడు. 2022 ఆగస్టు 22న బదిలీపై వచ్చి విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ సెక్యూరిటీ విభాగంలో చేరారు.
 
ప్రస్తుతం సీఐఎస్‌ఎఫ్‌ ఫైర్‌ విభాగంలో విధులు నిర్వహిస్తున్న కపిల్‌కు రెండేళ్ల క్రితం తమీషా పేరుతో ఫేస్‌బుక్‌‌లో ఓ మహిళ పరిచయమైంది. అది కాస్త న్యూడ్‌ వీడియో కాల్స్‌ వరకు వెళ్లింది. ఆపై హైదరాబాద్‌లోరహస్యంగా కలిసేంత వరకు వీరి వ్యవహారం వెళ్లింది. ఆమె, పాకిస్తాన్‌కు చెందిన ఓ ఉగ్రవాద సంస్థకు చెందిన ముఖ్య నాయకుడి వద్ద వ్యక్తిగత సహాయకురాలిగా పని చేస్తున్నట్లు నిఘా సంస్థలు అనుమానిస్తున్నాయి.
 
గత రెండేళ్లుగా కపిల్‌ నుంచి భారత్‌ డైనమిక్స్‌ లిమిటెడ్‌, స్టీల్‌ ప్లాంట్‌ రహస్య సమాచారాలు బయటకు వెళ్లి ఉంటాయని అనుమానిస్తున్నారు.

విశాఖ నుంచి ఒక మొబైల్‌ నంబరుతో పాకిస్థాన్‌కు కాల్స్ వెళుతున్నట్లు నిఘా సంస్థలు గుర్తించడంతో పోలీసులు అప్రమత్తం అయ్యారు. కేంద్ర నిఘా సంస్థలు ఇచ్చిన సమాచారంతో పోలీసులు కపిల‌కుమార్‌ను అదుపులోకి తీసుకున్నారు. 
అతని ఫోన్లు స్వాధీనం చేసుకొని పరిశీలించడంతో తమీషా పేరుతో నంబరు సేవ్‌ చేసుకోవడాన్ని గుర్తించారు. ఆగష్టు 1న కపిల్‌ వద్ద రెండు సెల్‌ఫోన్లు మాత్రమే గుర్తించారు. 4వ తేదీన మరో ఫోన్‌ కనిపించింది. అయితే ఈ మూడు సెల్‌ఫోన్లల్లోను సోషల మీడియా ఖాతాల్లో ఉన్న మెసేజులు డిలీట్‌ చేసినట్లు పోలీసులు గుర్తించారు. దీంతో ఈ ఫోన్లను స్వాధీనం చేసుకుని ఫోరెన్సిక్‌ ల్యాబ్‌కు పంపారు.

అతని నుంచి కీలక సమాచారం తెలుసుకునే క్రమంలో హనీట్రాప్‌ ప్రయోగించినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. అతని నుంచి కీలక సమాచారం పాకిస్థాన్ గూఢచార సంస్థకు చేరినట్టు అధికారులు అనుమానిస్తున్నారు. ఈ వ్యవహారంపై విచారణ కోరుతూ స్టీల్ ప్లాంట్ పోలీసు స్టేషన్‌లో సీఐఎస్ఎఫ్ యూనిట్ ఇన్ఛార్జ్ ఫిర్యాదు చేశారు. అధికారిక రహస్యాల ఉల్లంఘన నేరం కింద కేసు నమోదు చేశారు. అంతరంగిక భద్రతకు సంబంధించిన వ్యవహారం కావడంతో కేంద్ర దర్యాప్తు సంస్థలు కేసును పర్యవేక్షిస్తున్నాయి.