సుప్రీంకోర్టులో వనమా వెంకటేశ్వరావుకు ఊరట

బిఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి వనమా వెంకటేశ్వరావుకు సుప్రీంకోర్టులో ఊరట లభించింది. ఎమ్మెల్యే అనర్హతపై హైకోర్టు ఇచ్చిన తీర్పుపై ధర్మాసనం స్టే ఇచ్చింది. ప్రతివాదులకు నోటీసులు జారీ చేస్తూ తదుపరి విచారణ నాలుగు వారాలకు వాయిదా వేసింది. సుప్రీంకోర్టులో వనమా వెంకటేశ్వర రావు కేసు విచారణను జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ దీపాంకర్ దత్తా ధర్మాసనం చేపట్టింది. తెలంగాణ హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ ఆయన సుప్రీంను ఆశ్రయించారు. సోమవారం న్యాయస్థానం విచారణ జరిపింది.

2018 అసెంబ్లీ ఎన్నికల్లో కొత్తగూడెం అసెంబ్లీ స్థానం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా వనమా వెంకటేశ్వర రావు పోటీ చేశారు. బీఆర్ఎస్ అభ్యర్థి జలగం వెంకటరావుపై 4వేలకు పైగా ఓట్ల తేడాతో గెలుపొందారు. అయితే ఎన్నికల అఫిడవిట్‌లో వనమా తన ఆస్తులు, కేసుల వివరాలను పొందుపర్చలేదని, తప్పుడు సమాచారం ఇచ్చినందుకు అనర్హుడిగా ప్రకటించాలని కోరుతూ ప్రత్యర్థి జలగం వెంకటరావు హైకోర్టును ఆశ్రయించారు. 

సుదీర్ఘ విచారణ అనంతరం జులై 25న వనమాను అనర్హుడిగా ప్రకటిస్తూ తెలంగాణ హైకోర్టు తీర్పు ఇచ్చింది. అలాగే జలగం వెంకటరావును ఎమ్మెల్యేగా తీసుకోవాలంటూ ఆదేశాలు జారీ చేసింది. రూ. 5 లక్షల జరిమానా కూడా విధించింది. తీర్పు కాపీని జులై 26న అసెంబ్లీ సెక్రటరీ, తెలంగాణ రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారికి జలగం అందజేశారు. 

తీర్పుపై స్టే కోరుతూ తొలుత వనమా హైకోర్టునే ఆశ్రయించారు. స్టే ఇచ్చేందుకు న్యాయస్థానం నిరాకరించింది. దీంతో వెంకటేశ్వర రావు సుప్రీంకోర్టును ఆశ్రయించారు.