అయోధ్య రామమందిరానికి 400 కిలోల తాళం

తాళాల తయారీలో ఎన్నో ఏళ్ల అనుభవం ఉన్న అలీగఢ్ వృద్ధ కళాకారుడు అయోధ్య రామమందిరం కోసం ప్రత్యేకంగా 400 కిలోల బరువు ఉన్న తాళాన్ని తయారు చేశారు. ఈ భారీ తాళం ఎత్తు 10 అడుగులు, వెడల్పు 4.5 అడుగులు. 9.5 అంగుళాల మందం. దీనికి నాలుగు అడుగుల తాళం చెవి ఉంటుంది.  వచ్చే జనవరిలో దీన్ని అయోధ్య రామాలయానికి అందిస్తారు.

రామభక్తుడైన సత్యప్రకాష్ శర్మ కొన్ని నెలలు శ్రమించి ప్రపంచం లోనే అత్యంత భారీ చేతి తయారీ తాళాన్ని తయారు చేయడం విశేషం. ఈ తాళం ఎక్కడ ఉపయోగపడుతుందో పరిశీలిస్తామని శ్రీరామ జన్మభూమి తీర్థ్ క్షేత్ర ట్రస్ట్ అధికారులు చెప్పారు.  గత శతాబ్ద కాలంగా తమ కుటుంబం ఈ తాళాల తయారీలో పేరు గడించిందని, అలీఘర్‌లో తాను 45 ఏళ్లుగా అనేక రకాల ఆకర్షణలతో తాళాలు తయారు చేస్తున్నానని సత్యప్రకాష్ శర్మ తెలిపారు. భార్య రుక్మిణి కూడా ఈ తయారీలో తనకు సహకరించారని చెప్పారు. 

ఈ తాళం తయారీకి తమకు రూ. 2 లక్షలు అయిందని, తన భార్య దాచుకున్న సొమ్మంతా ఇష్టపూర్వకంగా దీనికోసం వెచ్చించడమైందని శర్శ తెలిపారు. ఈ ఏడాది మొదట్లో అలీగఢ్ వార్షిక ఎగ్జిబిషన్‌లో ఈ భారీ తాళాన్ని సందర్శకుల కోసం ప్రదర్శించారు. అయితే తర్వాత దీనికి స్వల్ప మార్పులు, అలంకారాలతో తీర్చి దిద్దారు. 

వచ్చే జనవరి 21 నుంచి 23 వరకు రామమందిర్‌లో ముడుపుల వేడుక జరపడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. దీనికి ప్రధాని నరేంద్ర మోదీకి ఆహ్వానం కూడా పంపినట్టు ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి చంపత్ రాజ్ తెలియజేశారు.