రూ. 19,761 కోట్లతో రాయలసీమలో జాతీయ రహదారులు

ఆంధ్రప్రదేశ్‌లోని రాయలసీమ ప్రాంతంలో  రూ.19761.8 కోట్లతో పలు జాతీయ రహదారులను అభివృద్ధి చేస్తున్నట్లు కేంద్ర జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ వెల్లడించారు. ఎంపీ విజయసాయి రెడ్డి అడిగిన ప్రశ్నకు మంత్రి రాతపూర్వకంగా జవాబిస్తూ ప్రతిపాదించిన ఈ జాతీయ రహదారి ప్రాజెక్ట్‌లలో 9 ప్రాజెక్ట్‌లు నిర్మాణ దశలో ఉండగా 3 ప్రాజెక్ట్‌ కాంట్రాక్ట్‌లు అవార్డు అయినప్పటికీ ఇంకా ప్రారంభం కాలేదని, మరో 11 ప్రాజెక్ట్‌లు మంజూరైనప్పటికీ కాంట్రాక్ట్‌ అవార్డు కాలేదని తెలిపారు.

జాతీయ రహదారి 71 పరిధిలో రూ. 2237.99 కోట్లతో చేపట్టిన రేణిగుంట-నాయుడు పేట సెక్షన్ 6 లేన్లు అభివృద్ధి పనులు 2024 జనవరి 31 నాటికి పూర్తి కావలసి ఉండగా, ప్రస్తుతం 48.40 శాతం పురోగతి సాధించినట్లు మంత్రి తెలిపారు. అలాగే జాతీయ రహదారి 716లో రేణిగుంట-కడప-ముద్దనూరు రోడ్డులో పాపాగ్ని నదిపై అప్రోచ్ రోడ్డుతో పాటు రూ. 82.18 కోట్లతో నిర్మిస్తున్న వంతెన, రహదారి పనులు 2025 జనవరి 31 నాటికి పూర్తవ్వాల్సి ఉండగా, 24.79శాతం పురోగతిలో ఉన్నాయని వివరించారు.

మొత్తంగా  రూ.12951.68కోట్లతో చేపట్టిన వివిధ జాతీయ రహదారి అభివృద్ది పనులు గ్రౌండ్‌ అయి వివిధ దశల్లో పురోగతిలో ఉన్నట్లు మంత్రి చెప్పారు. రూ. 1989.4 కోట్లతో చేపట్టాల్సిన మూడు జాతీయ రహదారి పనులకు సంబంధించిన కాంట్రాక్ట్‌లు అవార్డు పూర్తయి పనులు ప్రారంభం కావాల్సి ఉందని, రూ. 4820.72 కోట్లతో చేపట్టాల్సిన మరో 11 ఎన్‌హెచ్‌ పనులు మంజూరై అవార్డు కోసం ఎదురుచూస్తున్నట్టు తెలిపారు.

జాతీయ రహదారుల అభివృద్ధి, నిర్వహణ నిరంతర ప్రక్రియని మంత్రి తెలిపారు. రాష్ట్ర రహదారులను జాతీయ రహదారులుగా ప్రకటించాలని ఆంధ్రప్రదేశ్ సహా వివిధ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల తమ మంత్రిత్వ శాఖకు ప్రతిపాదనలు అందాయని గడ్కరీ తెలిపారు. అయితే ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లో ఏ రహదారినీ జాతీయ రహదారిగా ప్రకటించే ప్రతిపాదనేదీ పరిగణలో లేదని మంత్రి తెలిపారు.