జ్ఞానవాపి మసీదులో సర్వేకు హైకోర్టు అనుమతి

జ్ఞానవాపి మసీదులో సర్వేకు అలహాబాద్ హైకోర్టు గురువారం అనుమతి ఇచ్చింది. వాస్తవాలు బయటపడాలంటే సర్వే అవసరమని తెలిపింది. అంజుమన్ ఇంతెజామ్ దాఖలు చేసిన పిటిషన్‌ను తోసిపుచ్చింది. సర్వేకు అనుకూలంగా జిల్లా కోర్టు ఇచ్చిన తీర్పును సమర్థించింది. 

దీంతో హిందూ పక్షం ‘‘హర హర మహాదేవ్’’ అంటూ నినాదాలు చేస్తూ, సంతోషం వ్యక్తం చేసింది. జ్ఞానవాపి మసీదులో ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా సైంటిఫిక్ సర్వే జరపడం అవసరమని హైకోర్టు తీర్పు చెప్పింది. సర్వే చేసేటపుడు నిర్మాణాలకు ఎటువంటి నష్టం జరగకూడదని స్పష్టం చేసింది. సర్వేలో నిర్మాణాలకు నష్టం జరగబోదని ఏఎస్ఐ తెలిపింది. 

ఇదిలావుండగా, ఈ తీర్పుపై సుప్రీంకోర్టులో సవాల్ చేస్తామని ముస్లిం పక్షం తెలిపింది. సుప్రీంకోర్టులో సవాల్ చేసే అధికారం, హక్కులు ముస్లింలకు ఉన్నాయని హిందూ పక్షం తెలిపింది. అయితే న్యాయమే గెలుస్తుందన్న ధీమా వ్యక్తం చేసింది. జ్ఞానవాపి మసీదులో హిందూ దేవీ, దేవతలను పూజించేందుకు అనుమతించాలని కొందరు మహిళలు వారణాసి కోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే.

గతంలో ఇది హిందూ దేవాలయమని, శృంగార గౌరిని ప్రతి రోజూ పూజించేందుకు అనుమతించాలని వీరు కోరారు. దీంతో కోర్టు వీడియోగ్రాఫిక్ సర్వే చేయాలని 2022లో ఆదేశించింది. ఈ సర్వేలో ఓ నిర్మాణం కనిపించింది. అది శివలింగం అని హిందువులు చెప్తుండగా, ఫౌంటెన్ అని ముస్లింలు వాదిస్తున్నారు. శివలింగం ఉన్న ప్రాంతాన్ని సీలు చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. 

మసీదు ప్రాంగణంలోని హిందూ దేవీ, దేవతలకు పూజలు చేయడానికి అనుమతించాలని కోరుతూ హిందూ మహిళలు దాఖలు చేసిన పిటిషన్లకు విచారణార్హత లేదని మసీదు కమిటీ వాదించింది. దీనిని వారణాసి జిల్లా కోర్టు 2022 సెప్టెంబరులో తోసిపుచ్చింది.