జ్ఞానవాపిని మసీదు అని పిలిస్తే వివాదమే!

జ్ఞానవాపిని మసీదు అని పిలవలేమని, అలా పిలిస్తే అది వివాదం అవుతుందని ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ స్పష్టం చేశారు. దీనిపై ముస్లిం సమాజం ముందుకు వచ్చి ‘చారిత్రక తప్పిదానికి’ పరిష్కారం చూపాలని ఆయన ఒక ఇంటర్వ్యూలో హితవు చెప్పారు.  జ్ఞానవాపి సముదాయంలో హిందూ ఆలయానికి సంబంధించిన గుర్తులు ఉన్నాయని చెబుతూ అందులో ఉన్న విషయాలని దేశ ప్రజలు తెలుసుకోవాలని భావిస్తున్నారని తెలిపారు. 
అది ముమ్మాటికీ హిందువులదేనని.. దానిపై మసీదు నిర్మించారని వ్యాఖ్యానించారు. ఆ జ్ఞానవాపి సముదాయంలో హిందూ దేవుళ్ల విగ్రహాలు, త్రిశూలం, జ్యోతిర్లింగం కూడా ఉందని పేర్కొంటూ  అందుకే జ్ఞానవాపి సముదాయాన్ని మసీదు అని పిలవలేమని పేర్కొన్నారు. దాన్ని మసీదు అని పిలవడమే అతి పెద్ద వివాదం అని చెప్పారు. ఇప్పటికైనా ముస్లిం సమాజం అర్థం చేసుకోవాలని సూచించారు.
 
”జ్ఞానవాపిని మసీదుగా పిలిస్తే, దీనిపై ఒక వివాదం కూడా ఉందని గుర్తించాలి. అదేమిటో చూడాలి. మసీదులో ఒక త్రిశూలంతో పనేంటి? అది మేము పెట్టినది కాదే? అక్కడ ఒక జ్యోతిర్లింగం కూడా ఉంది. దేవతల విగ్రహాలు కూడా ఆలయ ఆవరణలో ఉన్నాయి” అని గుర్తు చేశారు.  తప్పిదం జరిగినప్పుడు దానిని సరిద్దుదుకోవాలని చెబుతూ అది జరుగుతుందనే నమ్మకం తనకు ఉందని యోగి ఆదిత్యనాథ్ ఆ ఇంటర్వ్యూలో తెలిపారు.
 
“అక్కడ దేవుళ్ల ప్రతిమలు (విగ్రహాలు) ఉన్నాయి. గోడలు ఆర్తనాదాలు చేస్తున్నాయి. మనకు ఏవో చెబుతున్నాయి. ఇది కచ్చితంగా ‘చారిత్రక తప్పిదమే” అని స్పష్టం చేశారు. అయితే ఈ వివాదానికి పరిష్కారం ముస్లిం సమాజం నుంచే రావాలని అనుకుంటున్నట్లు ఆదిత్యనాథ్ స్పష్టం చేశారు.
 
యోగి ఆదిత్యనాథ్ చేసిన వ్యాఖ్యలకు అఖిల భారత హిందూ మహాసభ జాతీయ అధ్యక్షుడు స్వామి చక్రపాణి మహారాజ్ మద్ధతు పలికారు. జ్ఞానవాపి ఆవరణలో ఏఎస్‌ఐ సర్వేపై స్టే విధించిన అలహాబాద్‌ హైకోర్టు దాన్ని ఆగస్టు 3 వ తేదీ వరకు పొడిగించింది. వారణాసి జిల్లా కోర్టు ఇచ్చిన ఉత్తర్వులపై ఆగస్టు 3 వ తేదీనే తీర్పు వెలువరించనున్నట్లు తెలిపింది. అప్పటివరకు తీర్పును రిజర్వ్‌లో ఉంచుతున్నట్లు అలహాబాద్ హైకోర్టు వెల్లడించింది. 
 
అంతకుముందు జ్ఞానవాపి సముదాయంలో ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా సర్వే నిర్వహించాలంటూ అలహాబాద్ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులపై ముస్లిం సంఘాలు సుప్రీంకోర్టును ఆశ్రయించగా,  కోర్టు స్టే విధించింది. దీంతో జ్ఞానవాపి సముదాయంలోకి వెళ్లిన 30 మంది ఏఎస్ఐ సర్వే అధికారులు.. వెనక్కి వచ్చాశారు.

జ్ఞానవాపి సముదాయంలో మసీదు ఉండేదని ముస్లింలు వాదిస్తుండగా, అందులో హిందూ ఆలయం ఉండేదని దాన్ని కూల్చి మసీదు నిర్మించారని హిందువులు చెబుతున్నారు. ఇప్పటికీ ఆ సముదాయంలో హిందూ దేవతల విగ్రహాలు, ఆనవాళ్లు ఉన్నాయని హిందూ సంఘాలు చెబుతున్నాయి. 

2021 లో ఓ హిందూ మహిళ  తమను కూడా ఆ జ్ఞానవాపి సముదాయంలో పూజలు చేసుకునేందుకు అనుమతి కల్పించాలని కోరుతూ కోర్టును ఆశ్రయించడంతో ఈ వివాదం మొదలైంది. అప్పటి నుంచి వివిధ కోర్టుల్లో విచారణ జరిగిన ఈ కేసు చివరకు సుప్రీంకోర్టుకు కూడా చేరింది. 
 
తాజాగా ఆ జ్ఞానవాపి సముదాయంలో ఒకప్పుడు హిందూ ఆలయం ఉండేదా లేక మసీదు ఉండేదా అని నిర్ధారించేందుకు ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా – ఏఎస్ఐ అధికారులు సర్వే నిర్వహించాలని ఆదేశించిన కోర్టు మళ్లీ దానిపై స్టే విధించింది. ఈ క్రమంలోనే ఆ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న యోగి ఆదిత్యనాథ్ చేసిన ఈ వాఖ్యలు సంచలనం కలిగిస్తున్నాయి.