ఓ మహిళపై సిఐడి ఎస్పీ లైంగిక వేధింపులు

తీవ్రమైన నేరాలపై దర్యాప్తు చేపట్టి అరికట్టాల్సిన సిఐడి విభాగంలో పనిచేస్తున్న ఓ ఎస్పీ స్థాయి అధికారి ఓ మహిళను లైంగిక వేధింపులకు గురిచేయడం తెలంగాణాలో కలకలం రేపుతోంది. తన దగ్గరకు సహాయం కోసం వచ్చిన ప్రభుత్వ ఉద్యోగిణిపైనే వేధింపులకు పాల్పడ్డాడు. ఆమెతో అసభ్యకరంగా ఎలా పడితే అలా ఫోన్‌లో మాట్లాడాడు. 

మహిళ పోలీసులకు ఫిర్యాదు చేయడం, కేసు నమోదు కావడంతో ఈ విషయం ఇప్పుడు బయటకు పొక్కింది.  తెలంగాణ రాష్ట్ర సదరన్‌ పవర్ డిస్ట్రిబ్యూషన్ కార్ఫోరేషన్‌ లిమిటెడ్‌లో సీనియర్‌ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న మహిళా ఉద్యోగిని సిఐడీ ఎస్పీ స్థాయి అధికారి వేధింపులకు గురిచేయడం కలకలం రేపింది.

పోలీస్ అధికారి తనకు అసభ్యకరమైన మెసేజ్‌లు పంపుతున్నారని, లైంగిక వేధింపులకు పాల్పడుతున్నారని బాధితురాలు పోలీసులను ఆశ్రయించడంతో తెలంగాణలో సీఐడీ విభాగంలో ఎస్పీ ర్యాంకులో పనిచేస్తున్న కిషన్ సింగ్‌పై ఆదివారం సెక్షన్‌ 354(సీ) కింద కేసు నమోదు చేసినట్టు చైతన్యపురి పోలీసులు వెల్లడించారు.

దిల్‌సుఖ్ నగర్ కొత్తపేటలో టీఎస్‌ఎస్‌పీడీసీఎల్ విభాగంలో పనిచేస్తున్న మహిళా ఉద్యోగి ఒకరు సీఐడీ ఎస్పీపై ఫిర్యాదు చేశారు. తన ఫోన్‌ నంబర్‌కు సీఐడీ ఎస్పీ అసభ్యకరమైన మేసేజ్‌లు, ఫొటోలు, వీడియోలు పంపుతున్నారని సదరు మహిళ తన ఫిర్యాదులో పేర్కొంది.

సిఐడి డిఎస్పీగా ఉన్న సమయంలో తాను స్పెషల్ క్లాసులు నిర్వహిస్తున్నానని వాటిలో పాల్గొనాలని మహిళా ఉద్యోగినికి చెప్పి, ఆమె వద్ద నుంచి ఫోన్ నంబర్ తీసుకున్నట్టు తెలిపారు. చేశారు.ఆ మహిళకు రెండేళ్ల క్రితం అంబర్‌పేట పోలీస్ ట్రైనింగ్ కాలేజీలో డీఎస్పీగా పనిచేస్తున్న కిషన్‌సింగ్‌ పరిచయం అయ్యాడు. బాధిత మహిళతో మాట కలిపిన డీఎస్పీ, ఆమెకు హిందీ సినిమా పాటలు, ఇతర వీడియోలతో వాట్సప్‌లో తరచూ సందేశాలు పంపేవాడు.

తనకు అలాంటి మెసేజీలు ఎందుకు పంపిస్తున్నారంటూ ప్రశ్నించినా డీఎస్పీ తీరు మారలేదు. విసిగిపోయిన మహిళ ఆ సందేశాలకు బదులివ్వడం మానేయగా  ఏడాది కాలంగా డీఎస్పీ ఎలాంటి సందేశాలు పంపలేదు. తాజాగా ఓ కేసు వ్యవహారంలో తనకు సాయం చేయాలంటూ సదరు మహిళ డీఎస్పీకి ఫోన్‌ చేసింది.

దీనిని ఎస్పీ కిషన్ సింగ్ అవకాశంగా తీసుకొంటూ తనతో స్నేహం చేయాలని, తనను కౌగిలించుకుంటే అన్ని విధాలా సాయం చేస్తానని వేధించాడు. లేకుంటే తనకు దూరంగా ఉండాలని ఫోన్‌ కూడా చేయొద్దన్నాడు. దీంతో మనస్తాపానికి గురైన బాధితురాలు ఈ నెల 28న రాచకొండ షీ టీమ్స్‌ను ఆశ్రయించారు.