పోలవరం ఇరిగేషన్ ప్రాజెక్ట్ తొలిదశలో మిగిలిన పనులు పూర్తి చేయడానికి అదనంగా రూ. 12,911 కోట్లు విడుదల చేయడానికి ఆర్థిక మంత్రిత్వ శాఖలోని వ్యయ విభాగం ఆమోదం తెలిపినట్లు కేంద్ర జల శక్తి శాఖ సహాయ మంత్రి బిశ్వేశ్వర్ తుడు వెల్లడించారు. రాజ్యసభలో సోమవారం వైఎస్సార్సీపీ సభ్యులు విజయసాయిరెడ్డి అడిగిన ప్రశ్నకు మంత్రి రాతపూర్వకంగా జవాబిచ్చారు.
పోలవరం ప్రాజెక్ట్ తొలిదశ కింద చేపట్టిన నిర్మాణాల్లో మిగిలిన పనులు పూర్తి చేసి 41.15 మీటర్ల వరకు నీటిని నిలువ చేసేందుకు 10,911.15 కోట్లు ఖర్చు అవుతుంది. వరదల కారణంగా దెబ్బతిన్న నిర్మాణాల మరమ్మతుల కోసం మరో రూ. 2 వేల కోట్లు విడుదల చేయడానికి తమకు అభ్యంతరం లేదని వ్యయ విభాగం గత జూన్ 5న తెలిపిందని పేర్కొన్నారు.
పోలవరం నిధులకు సంబంధించి గతంలో తీసుకున్న నిర్ణయాన్ని సవరిస్తూ కేంద్ర మంత్రివర్గం తాజా ప్రతిపాదనలను ఆమోదించాల్సి ఉందని మంత్రి వివరించారు. పోలవరం తొలిదశ నిర్మాణంలో మిగిలిన పనులు పూర్తి చేయడానికి సవరించిన అంచనాల ప్రకారం రూ. 17,144 కోట్లు అవసరం ఉంటుందని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గత జూన్ 5న తమకు ప్రతిపాదనలు సమర్పించిందని మంత్రి తెలిపారు.
వీటిని త్వరితగతిన పరిశీలించి ప్రభుత్వ ఆమోదం పొందేందుకు తగిన చర్యలు తీసుకున్నట్లు ఆయన చెప్పారు. అయితే ఈ ప్రక్రియ నిర్దిష్ట కాలపరిమితిలోగా పూర్తి చేయాలని కోరడం సబబు కాదని చెప్పారు.
పోలవరం ప్రాజెక్ట్ సవరించిన అంచనా వ్యయంకు సంబంధించి మార్చి 15, 2022న రాష్ట్ర ప్రభుత్వం సమర్పించిన ప్రతిపాదనల ప్రాతిపదికన తక్షణం రూ. 10 వేల కోట్లు విడుదల చేయాలని కోరుతూ ముఖ్యమంత్రి జూలై 15, 2022న రాసిన లేఖను కూడా ఆర్థిక శాఖ వ్యయ విభాగం పరిగణనలోకి తీసుకున్న తర్వాతే మొత్తం రూ. 12,911 కోట్ల నిధుల విడుదలకు ఆమోదం తెలిపిందని కేంద్ర మంత్రి సమాధానంలో వివరించారు.
More Stories
ఎన్డీఏది అభివృద్ధి మంత్రం – వైసీపీది అవినీతి తంత్రం
ఏపీ ప్రభుత్వ నిధులు విడుదల ఎత్తుగడకు ఈసీ అడ్డు
జగన్ ప్రభుత్వం అభివృద్ధిలో సున్నా, అవినీతిలో జెట్ స్పీడ్