వైసీపీ ప్రభుత్వంతో ప్రజలు విసిగిపోయారు

వైసీపీ ప్రభుత్వంతో ప్రజలు చాలా విసిగిపోయారని బిజెపి రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి విమర్శించారు. ప్రొద్దుటూరులో రాయలసీమ జోన్ పార్టీ నేతల సమావేశంలో ఆదివారం పాల్గొంటూ రాష్ట్రంలో అభివృద్ధి శూన్యమని, కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న నిధులను రాష్ట్ర ప్రభుత్వం మళ్ళిస్తుందని ఆరోపించారు. రాయలసీమ డిక్లరేషన్‌కు తాము కట్టుబడి ఉన్నామని ఆమె స్పష్టం చేశారు.
రాయలసీమలోని ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో వైసీపీ నేతల అవినీతి, అక్రమాలపై పోరాటాలు చేయాలని పురందేశ్వరి నాయకులకు, కార్యకర్తలకు పిలుపునిచ్చారు. వచ్చే నెల ఆగస్టు 10న కలెక్టరేట్ల వద్ద సర్పంచులతో భారీగా ముట్టడి కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు. ప్రతి నియోజకవర్గంలో బూత్‌ స్థాయి నుంచి పార్టీని బలోపేతం చేయడానికి నాయకులు కృషి చేయాలని ఆమె కోరారు.

రాయలసీమ ఎత్తిపోతల పథకంలో కేంద్ర ప్రభుత్వం రూ. 780 కోట్ల మేర బిల్లులు ఇచ్చిందని, కానీ పనులు మాత్రం జరగలేదని పురందేశ్వరి చెప్పారు. కనీసం ప్రాజెక్టులు మరమ్మత్తులు చేయలేని పరిస్థితిలో రాష్ట్ర ప్రభుత్వం ఉందని ఆమె ధ్వజమెత్తారు. అన్నమయ్య ప్రాజెక్టు వద్ద ఇసుక అక్రమ రవాణా వల్లే గేటు కొట్టుకుపోయిందని ఆమె ఆరోపించారు. గండికోట ప్రాజెక్టు నిర్వాసితులకు ఇప్పటికీ నష్టపరిహారం ఇవ్వకుండా నీటిని నిల్వ చేశారని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు.

కడపలో స్టీల్ ప్లాంట్ నిర్మాణం చేస్తామని, యువతని రాష్ట్ర ప్రభుత్వం మోసం చేస్తోందని పురందేశ్వరి మండిపడ్డారు. ఇక, వైసీపీ ప్రభుత్వం ఒక్క పరిశ్రమను కూడా తీసుకురాలేదని పేర్కొంటూ రాయలసీమ ప్రాంత యువత, రైతులు వలస వెళ్లి.. వేరే ప్రాంతాల్లో కూలీ పనులు చేసుకుంటున్నారని పురందేశ్వరి ఆవేదన వ్యక్తం చేశారు. ఓర్వకల్లులో 10 వేల మెగావాట్ల సౌర విద్యుత్తు ప్లాంట్‌ను కేంద్రం పెడుతోందని ఆమె తెలిపారు. 

రాష్ట్రంలో జాతీయ రహదారుల నిర్మాణం కోసం కేంద్ర ప్రభుత్వం వేల కోట్ల రూపాయలు కేటాయించిందని ఆమె చెప్పారు. రాష్ట్రంలో పేద ప్రజలకు ఇళ్ల నిర్మాణాల కోసం కేంద్ర ప్రభుత్వం నిధులు ఇస్తుంటే, రాష్ట్ర ప్రభుత్వం చేయట్లేదని పురందేశ్వరి ధ్వజమెత్తారు. 14, 15 ఆర్థిక సంఘం ద్వారా పంచాయతీలకు కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న నిధుల్ని రాష్ట్ర ప్రభుత్వం మళ్లిస్తోందని ఆమె ఆరోపించారు. 

సర్పంచ్‌లు చిన్న చిన్న అభివృద్ధి పనులు కూడా చేయలేకపోతున్నారని పేర్కొన్నారు. రాయలసీమలోని గుడ్రేవుల ప్రాజెక్టు, సిద్దేశ్వరం అలుగు చిరకాల కల అలాగే ఉందని ఆమె విమర్శించారు.  వచ్చే ఎన్నికల్లో పొత్తులపై పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సరైన సమయంలో నిర్ణయం తీసుకుంటారని ఆమె చెప్పారు. మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్, మాజీ మంత్రి ఆదినారాయణ రెడ్డితో పాటు పార్టీ ముఖ్య నేతలు హాజరయ్యారు.

తన తండ్రి స్వర్గీయ ఎన్టీఆర్‌ రాయలసీమకు దత్తపుత్రుడిగా ప్రకటించుకున్నారని చెబుతూ అందువల్ల తాను అధ్యక్షురాలిగా ఎన్నిక కాగానే మొదటగా రాయలసీమలో కార్యకర్తలతో కలవడానికే వచ్చానని ఆమె తెలిపారు. బీజేపీ చేసిన సంక్షేమాన్ని ప్రజల వద్దకు తీసుకెళ్లడం కార్యకర్తల ప్రధాన లక్ష్యం అని చెప్పారు.