మంత్రికి సీట్ ఇస్తే రాజినామాకు వైసీపీ ఎంపీ సిద్ధం

ఎన్నికలు దగ్గర పడుతూ ఉండడంతో వైసిపిలో కుమ్ములాటలు పతాకస్థాయికి పలు నియోజకవర్గాలలో చేరుకొంటున్నాయి. ముఖ్యంగా వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయం నుండి ఆ కుటుంబానికి సన్నిహితంగా ఉంటూ, వైసిపి ఏర్పడినప్పటి నుండి కీలకంగా వ్యవహరిస్తున్న రాజ్యసభ సభ్యుడు పిల్లి సుభాష్ చంద్రబోస్ ఇప్పుడు పార్టీ నాయకత్వంపై ఆగ్రవేశాలు వ్యక్తం చేస్తున్నారు.
 
వైఎస్, జగన్ మంత్రివర్గాలలో కూడా పనిచేసిన ఆయన తన సొంత నియోజకవర్గంలో తన ప్రత్యర్థి మంత్రి చెల్లుబోయిన వేణుగోపాల్ పై అగ్గిమీద గుగ్గిలం అవుతున్నారు. రామచంద్రపురం సీటు తనకు లేదా తన కుమారుడికి ఇవ్వాలని పట్టుబడుతున్నారు. అట్లా కాకుండా మంత్రి వేణుకు ఇస్తే తాను రాజ్యసభకు, పార్టీకి రాజీనామా చేసి తాను గాని, తన కుమారుడు గాని స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తామని ప్రకటించారు.
 
ఇటీవల ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పిలిపించి నచ్చచెప్పే ప్రయత్నం చేసినా సుభాష్ చంద్రబోస్ తన ధోరణిని మార్చుకోవడం లేదు.
మంత్రి వేణుతో కూర్చోబెట్టి, వారి మధ్య వివాదాలు సర్దుబాటు చేస్తానని ముఖ్యమంత్రి చెప్పినా ప్రయోజనం లేకపోయింది. మంత్రి వేణు తో కలిసి కూర్చునే పరిస్థితి లేదన్నారు.

తనకు వ్యతిరేకంగా మంత్రి వేణు వర్గం పనిచేస్తున్నా వైసిపి అధిష్టానం చూసి చూడనట్లు వ్యవహరిస్తోందని ఎంపీ బోసు అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ తరుణంలో వచ్చే నెలలో ఏ క్షణమైనా వైసీపీకి రాజీనామా చేసేందుకు సన్నాహాలు చేసుకుంటున్నట్లు సమాచారం. ప్రస్తుతం బోసు తనయుడు పిల్లి సూర్యప్రకాష్ మంత్రి వేణుకు వ్యతిరేకంగా నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటిస్తూ తనను ఆశీర్వదించాలని కోరుతున్నారు. వచ్చే ఎన్నికల్లో అధిష్టానం మంత్రి వేణుకే టిక్కెట్ ఖరారు చేస్ ఇండిపెండెంట్‌గానైనా లేదా టీడీపీ తరఫున బరిలోదిగి వేణును ఓడించాలని నిర్ణయించారు. స్పష్టంగా చెప్పాలంటే ఇక్కడ మంత్రి వర్సెస్ బోసుగా మారింది.

ఈ నేపథ్యంలో తాజాగా మంత్రి వేణు వర్గం వైసీపీ ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేసింది. మంత్రిగా వేణు బాధ్యతలు చేపట్టి మూడేళ్లు పూర్తయిన సందర్భంగా ఆయనను సన్మానించేందుకు ఈ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంపై తనకు సమాచారం లేదని పిల్లి సుభాష్ చెబుతున్నారు. మరోవైపు గత వారం బోస్ వర్గం నిర్వహించిన సమావేశంలో రాబోయే ఎన్నికల్లో బోస్ కుమారుడు పిల్లి సూర్యప్రకాశ్ పోటీ చేస్తారని మంత్రికి వ్యతిరేకంగా తీర్మానం చేశారు. అయితే ఎంపీ బోస్ వాఖ్యాలను మంత్రి వేణు కొట్టిపారవేస్తూ పార్టీకి నష్టం కలిగించే వారిపై చర్య ఉంటుందని స్ఫష్టం చేశారు.

ఎన్నికల్లో బోస్ ఓడిపోయినప్పటికీ సీఎం జగన్ ఆయనకు ఎమ్మెల్సీ, మంత్రి, ఎంపీ పదవుల్ని ఇచ్చారని గుర్తు చేశారు. తోట త్రిమూర్తులు, పిల్లి బోస్ ముందే వచ్చే ఎన్నికల్లో వేణుగోపాలకృష్ణ పోటీ చేస్తారని సీఎం జగన్ వెల్లడించారని పేర్కొన్నారు. 2024లోనే కాదు, 2029, 2034లలో కూడా రామచంద్రాపురం నుంచి తానే పోటీ చేస్తానని మంత్రి వేణు ధీమా వ్యక్తం చేశారు.