ప్రపంచ దేశాలతో పోలిస్తే మన దేశంలోనే నిరుద్యోగం తక్కువగా వుందని, భారత్లో నిరుద్యోగం 3.3 శాతం మాత్రమేనని కేంద్ర ఎరువులు, రసాయనాల శాఖ సహాయమంత్రి భగవంత్ ఖూబా తెలిపారు. హైదరాబాద్ లో శనివారం నిర్వహించిన రోజ్గార్ మేళాలో కేంద్ర పర్యాటక శాఖా మంత్రి కిషన్ రెడ్డితో కలిసి పాల్గొని 135 మంది యువతకు ఉద్యోగ నియామక పత్రాలు అందజేశారు.
ఎయిమ్స్, పవర్ గ్రిడ్, ఎల్ఐసీ, కేంద్ర పరోక్ష పన్నుల బోర్డు, బ్యాంక్ ఆఫ్ బరోడా లాంటి ప్రభుత్వ సంస్థలలో ఉద్యోగాలు పొందిన తెలుగు రాష్ట్రాలకు చెందిన యువత ఈ సందర్భంగా నియామక పత్రాలు నుంచి అందుకున్నారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి మట్లాడుతూ, కేంద్ర ప్రభుత్వం గత తొమ్మిదేళ్ళలో పారదర్శక విధానాల ద్వారా చేపట్టిన చర్యల కారణంగా ప్రపంచ దేశాల్లో ఎక్కడా లేని విధంగా జీడీపీ 7.5 శాతానికి పెరిగిందని, ద్రవ్యోల్బణం 4.2కు తగ్గిందని చెప్పారు.
గత తొమ్మిదేళ్ళలో పేదల జీవితాలు మెరుగుపడ్డాయని, 15 కోట్ల మంది ప్రజలు దారిద్య్ర రేఖ పైకి వచ్చారని పేర్కొన్నారు. ముద్రా యోజన ద్వారా 40 కోట్ల మందికి రుణాలు లభించగా ఇందులో అత్యధిక శాతం మహిళలే లబ్దిపొందారని చెప్పారు. నాలుగు కోట్ల మంది పేదలకు ఇళ్ళు, 12 కోట్ల మరుగుదొడ్లు నిర్మించి ఇచ్చినట్లు పేర్కొన్నారు.
పేదల జనధన్ ఖాతాలలో లక్షా తొంభై వేల కోట్ల రూపాయిలు జమ అయ్యాయని, ప్రత్యక్ష నగదు బదిలీ ద్వారా పేదలకు ఇస్తున్న ప్రతి రూపాయి వారికే అందుతోందని చెప్పారు. మరే దేశంలో లేని విధంగా భారత్లో 92 కోట్లమంది 18-59 ఏళ్ళ మధ్య వారున్నారని పేర్కొన్న ఆయన మానవ వనరులను గరిష్టంగా ఉపయోగించుకుంటూ, 2047 నాటికి భారత్ ప్రపంచంలొనే అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించబోతోందని భరోసా వ్యక్తం చేశారు.
కేంద్ర ప్రభుత్వం అత్యంత
పారదర్శకంగా అమలుచేస్తున్న విధానాల వల్ల నిరుద్యోగం గణనీయంగా తగ్గిందని, అయితే తెలంగాణాలో మాత్రం నిరుద్యోగం 7.5 శాతం ఉందని చెప్పారు. అవినీతికి తావు లేకుండా, ఏడాదిలో 10 లక్షల ఉద్యోగాలను భర్తీ చేస్తూ కేంద్ర ప్రభుత్వం చరిత్ర సృష్టించిందని మంత్రి పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కస్టమ్స్ విభాగం చీఫ్ కమిషనర్ సందీప్ ప్రకాష్, కమిషనర్ సంగీత, ఇతర అధికారులు పాల్గొన్నారు.
More Stories
నేటి నుండి తెలంగాణాలో థియేటర్ల మూసివేత
హైదరాబాద్ లో రీ పోలింగ్ కు బీజేపీ అభ్యర్థి డిమాండ్
ఉమ్మడి రాజధాని గడువు ముగింపుతో ఏపీ ఆస్తుల స్వాధీనం!