ఆన్‌లైన్‌ పెట్టుబడి పేరుతో రూ. 712 కోట్లు టెర్రర్ మాడ్యూల్ స్వాహా

ఆన్‌లైన్‌ పెట్టుబడి పేరుతో ఘరానా మోసానికి పాల్పడిన భారీ సైబర్‌ నేరం కేసును హైదరాబాద్‌ పోలీసులు ఛేదించారు. గత కొంత కాలంగా ఇక్కడ అడ్డా ఏర్పాటు చేసుకున్న నేరగాళ్ళు ఈ కార్యకలాపాలకు పాల్పడ్డారు. ఈ క్రమంలో ఇప్పటికే వెలుగు చూసిన అంచనాల ప్రకారం దేశవ్యాప్తంగా రూ.712 కోట్లు స్వాహా చేశారు. 

ఆన్‌లైన్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ పేరుతో అమాయకుల కష్టార్జితం కోట్లాది రూపాయలను దోచుకున్న ముఠాను శనివారం హైదరాబాద్‌ సైబర్‌ కైమ్‌ పోలీసులు అరెస్టు చేసిన్నట్లు హైదరాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌ సీవీ ఆనంద్‌  వెల్లడించారు.ఈ కేసులో ఇప్పటివరకు మొత్తం 9 మంది నిందితులను అరెస్టు చేసినట్లు ప్రకటించారు.  టెలిగ్రామ్‌, వాట్సాప్‌ ద్వారా ఈ మోసాలు చేస్తున్నారని పేర్కొన్నారు. ఈ ఆన్‌లైన్‌ దోపిడీలో 15 వేల మంది బాధితులు ఉన్నారని చెప్పారు.

ఆన్‌లైన్‌లో టాస్క్‌లు ఇచ్చి మొదట డబ్బులు ఇచ్చి,  ఆ తర్వాత ఎక్కువ నగదు మొత్తాన్ని ఇన్వెస్ట్‌మెంట్‌ చేసిన తర్వాత మోసం చేస్తున్నారని కమిషనర్‌ వివరించారు. టాస్క్‌ ఓరియెంటెడ్‌ జాబ్స్‌ అని చెప్పి ప్రజలను మోసం చేస్తున్నారని ఈ సందర్భంగా సీపీ వివరించారు. చైనా, దుబాయ్‌ కేంద్రంగా ఈ మోసం జరుగుతోందని చెబుతూ ఇక్కడ ఎజెంట్లను నియమించుకుని, షెల్‌ కంపెనీలు, బ్యాంక్‌ అకౌంట్స్‌ ఓపెన్‌ చేసి  వచ్చిన డబ్బును చైనా, దుబాయ్‌ నుండి ఆపరేట్‌ చేస్తున్నారని వెల్లడించారు. 

బ్యాంక్‌ అకౌంట్లలో ఉన్న డబ్బును క్రిఎ్టో కరెన్సీ ద్వారా ట్రాన్స్‌ఫర్‌ చేసుకొంటూ,  ఆ క్రిఎ్టో కరెన్సీని హిజ్బుల్లాకి సంబంధించిన టెర్రర్‌ మాడ్యూల్‌కి ట్రాన్స్‌ఫర్‌ అయినట్లు దర్యాప్తులో గుర్తించామని తెలిపారు.  ఆ డబ్బును ఉగ్రవాదులకు పంపే అవకాశం కూడా ఉందని చెప్పారు.  శివకుమార్‌ అనే వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా ఈ కేసును దర్యాప్తు చేశామని కమిషనర్‌ సీవీ ఆనంద్‌ తెలిపారు.

నిందితులకు చెందిన 48 అకౌంట్లలో రూ.584 కోట్లు జమయ్యాయని పేర్కొన్నారు. మరో రూ.128 కోట్లు ఇతర అకౌంట్లలో జమయ్యాయని పేర్కొన్నారు. నకిలీ ధృవీకరణ పత్రాలతో లక్నోలో 33 షెల్‌ అకౌంట్స్‌, 65 బ్యాంక్‌ అకౌంట్స్‌ ఓపెన్‌ చేశారని వెల్లడించారు. ఫ్రాడ్‌ చేసిన డబ్బును ఈ షెల్‌ కంపెనీలు, అకౌంట్స్‌లో డిపాజిట్‌ అవుతున్నాయని చెప్పుకొచ్చారు.