మావోయిస్టు ఆర్కే భార్య శిరీష అరెస్ట్‌

మావోయిస్టు అగ్రనేత ఆర్కే భార్య శిరీషను శుక్రవారం ఎపి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ప్రకాశం జిల్లా టంగుటూరు మండలం ఆలకూరపాడుకు పోలీసులు మఫ్టీలో వచ్చారు. పోలీసులు, ప్రత్యేక బలగాలు మూడు కార్లలో వచ్చి శిరీషను తీసుకెళ్లారు. ఆమెను అరెస్ట్ చేసిన్నట్లు ఎన్ఐఎ సాయంత్రం ప్రకటించింది.

ఆమెను బలవంతంగా కారులో ఎక్కించుకుని తీసుకెళ్లినట్టు తెలుస్తోంది. కుటుంబ సభ్యులు అడ్డుపడినప్పటికీ పోలీసులు వారిని పక్కకి నెట్టివేసినట్టు సమా చారం. ఆర్కే భార్య శిరీష నివాసంలో ఎన్‌ఐఎ, ఇతర దర్యాప్తు సంస్థలు ఇప్పటికే పలుమార్లు సోదాలు జరిపాయి. ఆర్‌కే డైరీ ఆధారంగా శిరీషను అరెస్టు చేసినట్లు అధికారులు పేర్కొన్నారు. అలాగే దుడ్డు ప్రభాకర్‌ను సైతం అరెస్ట్‌ చేసినట్లు తెలిపారు.

శిరీష, దుడ్డు ప్రభాకర్‌ ఇద్దరూ మావోయిస్టుల కోసం పని చేస్తున్నారని చెప్పారు. మావోయిస్టుల నుంచి భారీగా నిధులు తీసుకున్నట్లు గుర్తించామని, 2019 తిరియా ఎన్‌కౌంటర్‌లో ప్రభాకర్‌, శిరీష ఇద్దరు పాల్గొన్నట్లు ఎన్‌ఐఏ పేర్కొంది. మావోయిస్టుల కోసం కొత్త రిక్రూట్‌మెంట్లు కూడా ఇద్దరు చేస్తున్నారని, వారోత్సవాల సందర్భంగా భారీ కుట్రకు ప్రణాళిక సిద్ధం చేశారని వివరించింది.

సీపీఐ (మావోయిస్ట్) కేంద్ర కమి టీ, పొలిట్‌బ్యూరో సభ్యుడు ఆర్కే అలియాస్ అక్కిరాజు హరగోపాల్ 2021 అక్టోబర్ 14న దక్షిణ బస్తర్‌లో మరణించారు. కిడ్నీ వైఫల్యం, ఇతర వ్యాధులతో మరణించినట్లు మావోయిస్టు పార్టీ అప్పట్లో ధృవీకరించిన విషయం విదితమే.  కాగా, శిరీష కూడా గతంలో నక్సల్ ఉద్యమంలో పని చేశారు. ఉద్యమంలో ఉన్నప్పుడే ఆర్కేను పెళ్లి చేసుకున్నారు. ఉద్యమం నుంచి బయటికి వచ్చిన శిరీష ప్రకాశం జిల్లాలో ఉంటున్నారు.