బియ్యం ఎగుమతులపై నిషేధం

దేశంలో బియ్యం ధరలు భారీగా పెరుగుతుండటంతో కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. దేశం నుంచి బియ్యం ఎగుమతులపై కేంద్రం నిషేధం విధించింది. బాస్మతియేతర బియ్యం ఎగుమతులను నిలిపివేస్తూ డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ఫారెన్ ట్రేడ్ (డిజిఎఫ్‌టి) గురువారం ప్రకటన వెలువరించింది. దేశీయంగా బియ్యం సరఫరా సక్రమానికి, ధరల నియంత్రణకు ఈ కీలక నిర్ణయం తీసుకున్నారు. 

మార్కెట్‌లో ఇప్పటికే నాణ్యమైన బియ్యం ధర కిలో రూ 60 వరకూ ఉంది. వచ్చే నెల నుంచి పండుగల సీజన్ కావడంతో ధరలు మరింతగా పెరుగుతాయనే ఆందోళన వ్యక్తం అయింది. దీనితో సాధారణ తెల్ల బియ్యం ఎగుమతిని నిషేధించారు. అయితే పారాబాయిల్డ్ నాన్‌బాస్మతి, బాస్మతి రకం బియ్యం ఎగుమతులు యధావిధిగా ఉంటాయి.

ఈ విధానంలో ఎటువంటి మార్పు ఉండదు. కాగా ఇప్పటికే లోడింగ్ దశలో ఉన్న బియ్యం ఎగుమతిని అనుమతిస్తారు. మొత్తం బియ్యం ఎగుమతులలో బాస్మతియేతర బియ్యం వాటా పాతికశాతం వరకూ ఉంటుంది. బియ్యం ఎక్కువగా థాయ్‌లాండ్, ఇటలీ, స్పెయిన్, శ్రీలంక, అమెరికాలకు ఎగుమతి అవుతోంది. 

ఏడాది కాలంగా దేశంలో బియ్యం ధరలు మొత్తం మీద 11.5 శాతం పెరిగాయి. నెలరోజులలో 3 శాతం వరకూ పెరిగాయి. ధరలను నియంత్రించేందుకు ఈ ఎగుమతి నిషేధానికి దిగినట్లు అధికారిక ప్రకటనలో తెలిపారు. కాగా, ఆహార భద్రత కింద కేంద్ర ప్రభుత్వం అనుమతించిన దేశాలకు మాత్రం బియ్యం ఎగుమతులు యధావిధిగా జరుగుతాయని ఇందులో స్పష్టం చేశారు.

ఎల్‌నినో ప్రభావంతో ఈ ఏడాది రుతు పవనాలు ఆలస్యంగా ప్రవేశించాయి. దీని వల్ల దేశంలో చాలా ప్రాంతాల్లో వరినాట్లు ఆలస్యమయ్యాయి. ఫిబ్రవరి, మార్చి నెలల్లో కురిసిన వర్షాల మూలంగా చాలా చోట్ల పంట నష్టం జరిగింది. దీని వల్ల ఈ సారి దిగుబడులపై ప్రభావం ఉంటుందని అంచనా. ఈ నేపథ్యంలో బియ్యం ధరలు భారీగా పెరుగుతున్నాయి. దీంతో బియ్యం ఎగుమతులపై నిషేధం విధించాలన్న నిర్ణయానికి ప్రభుత్వం వచ్చింది. 

ఈ నిర్ణయం వల్ల దేశీయ మార్కెట్‌లో బియ్యం ధరలు కొంత మేర తగ్గుతాయని భావిస్తున్నారు. మరో వైపు ధరల పెరుగుదల ప్రభావం ద్రవ్యోల్బణం పెరుగుదలకు దారి తీసుకుందని ప్రభుత్వం భావించింది. దీంతో నిషేధం విధించింది. మన దేశం నుంచి బియ్యం ఎగుమతులను నిషేధించడం వల్ల మన దేశం నుంచి దిగుమతులు చేసుకునే దేశాల్లో వీటి ధరలు భారీగా పెరగనున్నాయి.