అరెస్ట్ భయంతో పుతిన్ దక్షిణాఫ్రికా పర్యటన రద్దు

రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ తన దక్షిణాఫ్రికా పర్యటనను రద్దు చేసుకున్నారు. దేశం దాటి దక్షిణాఫ్రికాకు వెళ్తే తనను అరెస్ట్‌ చేస్తారేమోనన్న భయంతో ఆయన తన పర్యటనను విరమించుకున్నారు. దాంతో అధ్యక్షుడు పుతిన్‌కు బదులుగా రష్యా విదేశాంగ శాఖ మంత్రి సెర్గీ లవ్‌రోవ్‌ దక్షిణాఫ్రికా పర్యటనకు వెళ్లనున్నారు. 
 
రష్యా తరఫున బ్రిక్స్‌ సదస్సులో పాల్గొననున్నారు.  ఉక్రెయిన్‌పై యుద్ధం నేపథ్యంలో అంతర్జాతీయ నేర న్యాయస్థానం (ఐసీసీ) ఈ ఏడాది మార్చి నెలలో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌పై అరెస్ట్‌ వారెంట్‌ జారీచేసింది. దాంతో పుతిన్‌ తన దేశం దాటి వస్తే అరెస్టయ్యే అవకాశం ఉన్నది.  ఈ నేపథ్యంలో వచ్చే ఆగస్టు నెలలో దక్షిణాఫ్రికాలో జరుగనున్న బ్రిక్స్‌ దేశాల 15వ సదస్సుకు హాజరుకావాల్సి ఉన్న ఆయన తన పర్యటనను రద్దు చేసుకున్నారు. తనకు బదులుగా తన విదేశాంగ మంత్రి సెర్గీ లవ్‌రోవ్‌ను దక్షిణాఫ్రికాకు పంపనున్నట్లు తెలిపారు. 
 
ఇదిలావుంటే వచ్చే నెలలో దక్షిణాఫ్రికాలో బ్రిక్స్‌ దేశాల 15వ సదస్సు జరుగనుంది. ఈ సదస్సుకు బ్రిక్స్‌ సభ్యదేశాల ప్రతినిధులందరూ హాజరుకానున్నారు. కాగా, ఈ సదస్సుకు సంబంధించిన ఏర్పాట్లను ఇప్పటికే పూర్తిచేసినట్లు దక్షిణాఫ్రికా అధ్యక్షుడు సిరిల్‌ రమాఫోసా ప్రకటించారు. ఆ దేశ రాజధాని జొహన్నెస్‌బర్గ్‌లో జరిగే ఈ సదస్సుకు బ్రిక్స్‌ సభ్యదేశాలైన బ్రెజిల్‌, రష్యా, ఇండియా, చైనా, దక్షిణాఫ్రికా దేశాల ప్రతినిధులు హాజరుకానున్నారు.
కరోనా మహమ్మారి విజృంభన అనంతరం సభ్యదేశాల ప్రతినిధులు వ్యక్తిగతంగా హాజరవుతున్న తొలి బ్రిక్స్‌ సమావేశం ఇదే. గత మూడేళ్లుగా వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా బ్రిక్స్‌ సమావేశాలు జరిగాయి. ఈ క్రమంలో ఈసారి బ్రిక్స్‌ సమావేశాలను విజయవంతంగా నిర్వహిస్తామని దక్షిణాఫ్రికా అధ్యక్షుడు రమాఫోసా విశ్వాసం వ్యక్తం చేశారు. దేశ విదేశాల నుంచి వచ్చే ప్రతినిధుల కోసం అన్ని రకాల ఏర్పాట్లను చేసినట్లు ఆయన తెలిపారు.