దేశంలో ఎంఎల్‌ఎలలో 44 శాతం మంది నేరచరితులే

దేశవ్యాప్తంగా రాష్ట్ర అసెంబ్లీలో ఉన్న ఎంఎల్‌ఎలలో దాదాపు 44 శాతం మందిపై క్రిమినల్ కేసులు ఉన్నట్లు అసోసియేషన్ ఆఫ్ డెమోక్రటిక్ రిఫార్మ్(ఎడిఆర్) అనే స్వచ్ఛంద సంస్థ వెల్లడించిది. రాష్ట్ర అసెంబ్లీలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో ప్రస్తుతం ఎంఎల్‌ఎలుగా ఉన్న వారు పోటీ చేసే సమయంలో సమర్పించిన అఫిడవిట్లను పరిశీలించి ఎడిఆర్, నేషనల్ ఎలక్షన్ వాచ్‌లు ఈ వివరాలను వెల్లడించాయి. 

22 రాష్ట్ర అసెంబ్లీలు, రెండు కేంద్రపాలిత ప్రాంతాల్లోని మొత్తం 4,033 మంది ఎంఎల్‌ఎలకు గాను 4001 మంది ఎంఎల్‌ఎలు సమర్పించిన అఫిడవిట్లను పరిశీలించిన అనంతరం ఈ నివేదికను రూపొందించారు. వీరిలో 1,136 మంది అంటే 28 శాతం మంది తమపై హత్య, హత్యాయత్నం, కిడ్నాపింగ్, మహిళలపై నేరాలు లాంటి తీవ్రమైన క్రిమినల్ కేసులు ఉన్నట్లు ప్రకటించడం గమనార్హం.

కేరళలో మొత్తం135 మంది ఎంఎల్‌ఎలలో 95 శాతం మంది, అంటే 70 శాతం మంది ఎంఎల్‌ఎలు తమపై క్రిమినట్ కేసులున్నట్లు అఫిడవిట్‌లలో పేర్కొన్నారు. అలాగే బీహార్‌లోని 242 మంది ఎంఎల్‌ఎలలో 161 మంది (67 శాతం), ఢిల్లీలోని 70 మందిలో 44 మంది(63శాతం), మహారాష్ట్రలోని 284 మంది ఎంఎల్‌ఎలలో 175 మంది(62 శాతం) తెలంగాణలోని 118 మంది శాసన సభ్యుల్లో 72 మంది(61శాతం), తమిళనాడులో224 మంది ఎంఎల్‌ఎలలో 134 మంది(60 శాతం)తమపై క్రిమినల్ కేసులున్నట్లు అఫిడవిట్‌లలో పేర్కొన్నారు.

అంతే కాకుండా ఢిల్లీలో 37 మంది (53 శాతం), బీహార్‌లో 122 మంది (50 శాతం) మహారాష్ట్రలో 114 మంది(40 శాతం), జార్ఖండ్‌లో 31మంది(39 శాతం), తెలంగాణలో46 మంది(39శాతం), ఉత్తరప్రదేశ్‌లోని మొత్తం403 మంది ఎంఎల్‌ఎలలో 155 మంది (38శాతం)తమపై తీవ్రమైన క్రిమినల్ కేసులున్నట్లు వెల్లడించడం గమనార్హం. 

ఇందులో కూడా 114 మంది ఎంఎల్‌ఎలపై మహిళలపై నేరాలకు సంబంధించిన కేసులు ఉన్నట్లు కూడాఆ వివరాలు వెల్లడించడం గమనార్హం. 14 మందిపై రేప్‌కు సంబంధించిన కేసులు కూడా ఉండడం గమనార్హం.

ఈ నివేదిక క్రిమినల్ కేసులే కాకుండా ఎంఎల్‌ఎల ఆస్తులను కూడా విశ్లేషించింది. రాష్ట్రాల్లోని ఎంఎల్‌ఎ తలసరి సగటు ఆస్తి రూ.13.63 కోట్లుగా ఉందని పేర్కొంది. అయితే క్రిమినల్ కేసులున్న వారి ఆస్తులు కేసులు లేని వారి సగటు ఆస్తులకన్నా ఎక్కు ఉండడం విశేషం. క్రిమినల్ కేసులు లేని ఎంఎల్‌ఎల సగటు ఆస్తి రూ.11.45 కోట్లుగా ఉండగా , కేసులున్న వారి సగటు ఆస్తి రూ.16.36 కోట్లుగా ఉంది.

కాగా కర్నాటక ఎంఎల్‌ఎల సగటు ఆస్తుల విలువ రూ.64.39 కోట్లతో అగ్రస్థానంలో ఉండగా రూ.28.24 కోట్ల సగటు ఆస్తులతో ఆంధ్రప్రదేశ్ రెండో స్థానంలో, రూ.23.51 కోట్లతో మహారాష్ట్ర మూడో స్థానంలో ఉంది. కాగా అతి తక్కువ ఆస్తుల విషయంలో రూ.1.54 కోట్లతో త్రిపుర మొదటి స్థానంలో ఉండగా, రూ.2.80 కోట్లతో పశ్చిమ బెంగాల్, రూ.3.15 కోట్లతో కేరళ తర్వాతి స్థానాల్లో నిలిచాయి.

 కాగా మొత్తం 4001 మంది ఎంఎల్‌ఎలలో రూ.100 కోట్లకు పైగా ఆస్తులున్న వారు 88 మంది  ఉండడం విశేషం. ఈ విషయంలో కర్ణాటక 32 మందితో అగ్రస్థానంలో ఉండగా, ఆంధ్రప్రదేశ్ మూడో స్థానంలో ఉంది.