
కోనసీమ జిల్లాలోని రాజోలులో బోరులో నుంచి గ్యాస్, మంటలు ఎగసిపడుతున్నాయి. బోరు పైన సుమారు 20 అడుగుల మేర అగ్ని కీలలు ఎగసిపడుతున్నాయి. రాజోలు మండలం శివకోటిలోని ఆక్వా చెరువు వద్ద ఈ ఘటన చోటుచేసుకుంది. శనివారం ఉదయం నుంచి గ్యాస్, అగ్నికీలలు ఎగసిపడుతున్నాయని స్థానికులు తెలిపారు.
ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. జనం భయాందోళనలకు గురవుతున్నారు. ఈ ఘటనకు సంబంధించి సమాచారం అందుకున్న ఓఎన్జీసీ సిబ్బంది అక్కడికి చేరుకున్నారు. అగ్నిమాపక సిబ్బందితో కలిసి మంటలను ఆర్పేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు. ప్రస్తుతం మంటలు ఎగసిపడుతున్న ప్రదేశంలో గతంలో సెస్మిక్ సర్వే జరిగిందని స్థానికులు తెలిపారు.
ఆక్వా చెరువుల్లో నీటి కోసం ఆరేళ్ల క్రితం అదే ప్రాంతంలో బోరు వేశారని, రెండు రోజుల క్రితం బోరును మరింత లోతుకు తవ్వారని వివరించారు. ఈ రోజు (శనివారం) ఉదయం ఆ బోరులో నుంచి గ్యాస్, దాంతో పాటే మంటలు ఎగసిపడ్డాయని, అప్పటి నుంచి మంటలు చల్లారటంలేదని తెలిపారు. అయితే, పైప్ లైన్ నుంచి గ్యాస్ లీక్ అయితే వెంటనే ఆపేసే అవకాశం ఉండేదని, భూమి పొరల్లోని గ్యాస్ నిక్షేపాల నుంచి గ్యాస్ లీకైతే మాత్రం మంటలు ఆర్పివేయటం కష్టమవుతుందని అధికారులు తేల్చి చెప్పారు. ఈ మంటలను అదుపు చేసేందుకు ప్రత్యేక నిపుణులు నరసాపురం నుంచి రానున్నట్లు సమాచారం.
More Stories
పీపుల్స్ ఫస్ట్ అనే నినాదంతో ఢిల్లీలో విజయం
వైసీపీ మాజీ ఎంపీ ఆస్తులను జప్తు చేసిన ఈడీ
ఫైళ్లను పట్టించుకోని చంద్రబాబు, ఆయన మంత్రులు