భారత అంతరిక్ష చరిత్రలో చంద్రయాన్-3 సరికొత్త అధ్యాయాన్ని లిఖించిందని ప్రధాని మోదీ కొనియాడారు. ఈ విజయం కోట్లాది మంది భారతీయుల కలల్ని, ఆశయాల్ని మరింత ఉన్నత స్థాయికి తీసుకెళ్లిందని ప్రశంసించారు. ఈ మహత్తర విజయం మన శాస్త్రవేత్తల నిర్విరామ అంకితభావానికి నిదర్శనమని. వారి స్ఫూర్తికి సెల్యూట్ అంటూ ప్రధానమంత్రి నరేంద్రమోడీ ఇస్రో బృందాన్ని అభినందించారు.
చంద్రయాన్-3ని విజయవంతంగా కక్ష్యలోకి ప్రవేశపెట్టడంతో భారత్ చరిత్రాత్మకమైన అంతరిక్ష ప్రయాణాన్ని ప్రారంభించిందని, తరతరాలు గుర్తుంచుకునే అద్భుతమైన అంతరిక్ష చరిత్రను లిఖిస్తున్న ఇస్రో శాస్త్రవేత్తలకు అభినందనలు అంటూ కేంద్ర హోంమంత్రి అమిత్ షా ట్విట్ చేశారు. దేశానికి ఇది గర్వించదగ్గ రోజని, దేశ సాంకేతికాభివృద్ధికి ఇది తార్కాణమని కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ పేర్కొన్నారు. చరిత్రాత్మక ఘట్టంలో తాను కూడా భాగస్వామి కావడం ఆనందంగా ఉందంటూ ఇస్రో శాస్త్రవేత్తలకు ధన్యవాదాలు తెలిపారు.
చంద్రయాన్ 3 విజయవంతంగా కక్షలో ప్రవేశించడంపై కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ సంతోషం వ్యక్తం చేశారు. ‘ఇది చాలా అద్భుతమైన సందర్భం. గొప్ప విజయం. ఇస్రో టీమ్ కు నా శుభాభినందనలు’ అని రాహుల్ గాంధీ ట్వీట్ చేశారు.
చంద్రయాన్ 3 ప్రయోగం విజయవంతంగా ప్రారంభమైంది. తొలి దశలో ఎల్వీఎం 3 బాహుబలి రాకెట్ చంద్రయాన్ 3 మోడ్యూల్స్ ను విజయవంతంగా నిర్దేశిత కక్షలో ప్రవేశపెట్టింది. ప్రణాళిక ప్రకారం ప్రయోగం జరిగిందని ఇస్రో చీఫ్ సోమనాథ్ వెల్లడించారు. ఈ ప్రయోగం విజయవంతమైతే, చంద్రుడిపై సాఫ్ట్ ల్యాండ్ అయిన నాలుగో దేశంగా భారత్ నిలుస్తుంది. ఇప్పటివరకు ఈ ఘనత అమెరికా, సోవియట్ యూనియన్, చైనా సాధించాయి.
More Stories
లోక్సభ ఎన్నికల నాలుగో దశ పోలింగ్ నేడే
మోదీ వారణాసిలో రేపే నామినేషన్.. ఘనంగా రోడ్ షో
ఆసుపత్రిలో కర్ణాటక మాజీ సీఎం ఎస్ఎం కృష్ణ!