చంద్రయాన్-3 ల్యాండింగ్ కు రానున్న ప్రధాని మోదీ!

చంద్రయాన్-3 ల్యాండింగ్ కు రానున్న ప్రధాని మోదీ!

మొత్తం ప్రపంచం ఆసక్తి కనబరుస్తున్న భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) చేపట్టిన అంతరిక్ష నౌక చంద్రయాన్-3  ప్రయోగం కోసం శ్రీహరికోట వద్ద ముమ్మరంగా సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ నెల 14న మధ్యాహ్నం 2:35 నిమిషాలకు నింగిలోకి దూసుకెళ్తనుంది.  ప్రయోగించిన తేదీ నుంచి 40 రోజుల పాటు సుమారు 3. 84 లక్షల కిమీ సుదీర్ఘ ప్రయాణం తర్వాత ఆగస్టు 23 లేదా 24 తేదీల్లో జాబిల్లిపై చంద్రయాన్ 3 అడుగుపెట్టనుంది.

చంద్రుడిపై కాలుమోపే చారిత్రాత్మక సన్నివేశాన్ని వీక్షించేందుకు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సహితం శ్రీహరికోటకు వచ్చే అవకాశం ఉందని ఇస్రో ఛైర్మన్ ఎస్ సోమ్‌నాథ్ వెల్లడించారు. 2019లో జరిగిన చంద్రయాన్ మిషన్ ల్యాండింగ్ ప్రక్రియను పర్యవేక్షించడానికి ప్రధాని మోదీ శ్రీహరికోటకు వచ్చిన విషయం తెలిసిందే. అప్పట్లో ఆ ప్రయోగం విఫలమైంది.

చంద్రుడిపై ల్యాండ్ అయ్యే చివరి నిమిషంలో రోవర్ గతి తప్పింది. దాన్ని వేగాన్ని నియంత్రించే విషయంలో ఇస్రో శాస్త్రవేత్తలు సక్సెస్ కాలేకపోయారు. ఫలితంగా చంద్రుడి ఉపరితలంపై రోవర్ క్రాష్ ల్యాండింగ్ అయింది. ఎన్నో ఆశలు పెట్టుకున్న ఈ మిషన్ విఫలం కావడం దేశ ప్రజలను దిగ్భ్రాంతికి గురి చేసింది. అప్పటి ఇస్రో ఛైర్మన్ శివన్‌ కన్నీరు మున్నీరయ్యారు. ఆయనను మోదీ అక్కున చేర్చుకుని ఓదార్చిన వీడియో అప్పట్లో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

ప్రస్తుతం చంద్రయాన్-3 పై అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ నాసాతో పాటు ప్రపంచంలోని ఇతర దేశాల అంతరిక్ష శాస్త్రవేత్తలు కూడా ఆసక్తి కనబరుస్తున్నారు. భారత్ ఇప్పటికి రెండు సార్లు ఈ దశలో అవాంతరాలు ఎదుర్కొన్నప్పటికీ ప్రస్తుతం చంద్రయాన్-3 లో ఉపయోగిస్తున్న ఉపకరణాలు అత్యంత శక్తివంతమైనవి. చంద్రుని కక్ష నుంచే భూమిపై పరిశోధనలు చేసే సామర్థ్యం కలిగి ఉన్నాయి.
 
పైగా చంద్రుని దక్షిణ ధ్రువం పై ఇప్పటికీ ఏ దేశము చేయని పరిశోధనల కోసం చంద్రయాన్-3 ని  ప్రయోగిస్తున్నారు. శ్రీహరికోటలోని సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రంలో చంద్రయాన్-3 ప్రయోగం కోసం తుది ఏర్పాట్లు జోరందుకున్నాయి. భారత్ ఇటీవల వలె  ఎల్విఎం-3 రాకెట్ ను చంద్రయాన్-3 ఉపగ్రహం ప్రయోగానికి ఉపయోగిస్తున్నారు.
 
ఎల్విఎం3 -04 పేరుతో ఈ రాకెట్ రూపొందించగా, 3900 కిలోల బరువైన చంద్రయాన్-3 ని అలవాలగా చంద్రుని సమీపం వరకు మోసుకెళ్లే సామర్ధ్యాన్ని ఈ భారీ రాకెట్ కలిగి ఉంది. ల్యాండర్ లో అమర్చిన రోవర్ 14 రోజుల పాటు చంద్రునిపై నిర్దేశించిన ప్రదేశంలో పరిశోధనలు జరిపి ప్రపంచ శాస్త్రవేత్తలకు సమాచారం అందిస్తుంది.

చంద్రయాన్ 2తో పోలిస్తే చంద్రయాన్ 3ని ఫెయిల్యూర్ ఆధారిత విధానంతో అభివృద్ధి చేశామని ఇస్రో తెలిపింది. చంద్రయాన్ 2 లో సమస్య ఏమిటనే విషయాన్ని పరిశీలిస్తే  పెరామీటర్ వేరియేషన్ లేదా విభాగాలను వేరు చేసే వ్యవస్థను నిర్వహించే సామర్ధం చాలా పరిమితమే. అందుకే ఈసారి ఆ సామర్ధాన్ని మరింత పెంచామని వివరించింది. 

“చంద్రయాన్ 2ను సక్సెస్ ఆధారిత మోడల్ లోరూపొందించగా, చంద్రయాన్ 3 లో మాత్రం ఫెయిల్యూర్ ఆధారిత డిజైన్‌ను అమలు చేస్తున్నాం. ఏదైనా వ్యవస్థ విఫలమైనప్పుడు దాన్ని ఎలా రక్షించాలనే విధానమే ఇది” అని ఇస్రో చైర్మన్ ఎస్. సోమనాథ్ వెల్లడించారు.