బ్రిజ్ భూషణ్‌కు ఢిల్లీ కోర్టు సమన్లు

మహిళా రెజ్లర్లపై లైంగిక వేధింపులకు పాల్పడినట్లు ఆరోపణలు నమోదైన కేసులో రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా మాజీ అధ్యక్షుడు, బిజెపి ఎంపి బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ జులై 18న కోర్టులో హాజరుకావాలంటూ ఢిల్లీ కోర్టు శుక్రవారం సమన్లు జారీచేసింది. బ్రిజ్ భూషణ్‌పై విచారణ కొనసాగించడానికి తగినన్ని ఆధారాలు ఉన్నాయంటూ ఢిల్లీలోని రోజ్ అవెన్యూ కోర్టు పేర్కొంది.

ఢిలీ పోలీసులు దాఖలు చేసిన చార్జిషీట్‌ను పరిగణనలోకి తీసుకున్న అదనపు మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్(సిఎంఎం) హర్జీత్ సింగ్ జస్పాల్ జులై 18న తమ ఎదుట హాజరుకావాలని బ్రిజ్ భూషణ్‌ను ఆదేశించారు.  ఆయనతోపాటు సస్పెన్షన్‌లో ఉన్న రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా అసిస్టెంట్ సెక్రటరీ వినోద్ తోమర్‌కు కూడా కోర్టు సమన్లు జారీచేసింది.

ఆరుసార్లు ఎంపిగా గెలిచిన బ్రిజ్ భూషణ్‌పై ఢిల్లీ పోలీసులు జూన్ 15న చార్జ్‌షీట్ దాఖలు చేశారు. ఐపిసిలోని వివిధ సెక్షన్ల కింద బ్రిజ్ భూషణ్‌పై అభియోగాలు నమోదయ్యాయి. తోమర్‌పై కూడా వివిధ సెక్షన్ల కింద అభియోగాలు నమోదయ్యాయి. బ్రిజ్ భూషణ్‌ తమను లైంగికంగా వేధించినట్లు పలువురు మహిళా రెజ్లర్లు ఆరోపించారు. దీనిపై ఢిల్లీ పోలీసులకు ఫిర్యాదు చేసినప్పటికీ స్పందించలేదని విమర్శించారు.

ఈ నేపథ్యంలో ఢిల్లీలోని జంతర్‌మంతర్‌ వద్ద రెండోసారి కూడా కొన్ని రోజుల పాటు నిరసనకు దిగారు. మరోవైపు రెజర్లు సుప్రీంకోర్టును కూడా ఆశ్రయించారు. దీంతో సర్వోన్నత న్యాయస్థానం జోక్యం చేసుకుంది. బ్రిజ్‌ భూషణ్‌పై కేసు నమోదు చేయాలని ఆదేశించింది. ఈ నేపథ్యంలో ఢిల్లీ పోలీసులు జూన్‌ 2న పలు సెక్షన్ల కింద బీజేపీ ఎంపీపై రెండు కేసులు నమోదు చేశారు. జూన్‌ 15న ఛార్జిషీట్‌ కూడా ఫైల్‌ చేశారు. లైంగిక వేధింపులు, నేరపూరిత బెదిరింపులు వంటి అభియోగాలను అందులో పేర్కొన్నారు.