ఉమ్మడి పౌర స్మృతి తీసుకొచ్చే సమయం

ఉమ్మడి పౌర స్మృతిని తీసుకువచ్చే సమయం ఆసన్నమైందని, ఇంకెంత మాత్రం ఆలస్యం తదగని  ఉపరాష్ట్రపతి జగ్‌దీప్ ధన్‌ఖడ్ స్పషటం చేశారు. ఐఐటీ గౌహతిలో మంగళవారంనాడు జరిగిన 25వ స్నాతకోత్సవంలో ధన్‌ఖడ్ మాట్లాడుతూ, రాజ్యాంగంలోని 44వ అధికరణ దేశవ్యాప్తంగా ప్రజలంతా ఒకే సివిల్ కోడ్ ఉండాలని సూచిస్తోందని చెప్పారు.

పంచాయతీలు, కోఆపరేటివ్‌లు, విద్యాహక్కు వంటి చట్టాలను ఇప్పటికే తీసుకురావడం జరిగిందని, ఇప్పుడు ఉమ్మడి పౌర స్మృతిని అమలు చేసే సమయం వచ్చిందని ఆయన తెలిపారు.  భారతదేశ ప్రతిష్టను దిగజార్జే ప్రయత్నాలు, జాతి వ్యతిరేక పన్నాగాల పట్ల అప్రమత్తంగా ఉండాలని కూడా ధన్‌ఖడ్ హెచ్చరించారు. భారత వ్యతిరేక వాదనలు వినిపించేవారి ప్రయత్నాలను సమర్ధవంతంగా తిప్పికొట్టేందుకు ఇదే తగిన తరుణమని పేర్కొన్నారు.

 దేశ సార్వభౌమత్వాన్ని, గౌరవాన్ని బలహీన పరచేందుకు ప్రయత్నించే ఏ విదేశీ శక్తులను అనుమతించరాదని ఆయన చెప్పారు. భారతదేశం అతి పురాతన, అతి పెద్ద, సమర్ధవంతమైన, చెక్కుచెదరని ప్రజాస్వామ్య దేశమని, విశ్వ శాంతి, సామారస్యాల కోసం పాటుపడుతూ, ప్రజాస్వామ్యం, రాజ్యాంగ సంస్థలు పరిఢవిల్లుతున్న దేశమని తెలిపారు.

అవినీతిని అరికట్టేందుకు బలంగా ప్రయత్నాలు జరుగుతున్నాయని పేర్కొంటూ అవినీతి రహతి సమాజం అందరి లక్ష్యం కావాలని ఉపరాష్ట్రపతి పిలుపునిచ్చారు. అవినీతి అనేది అప్రజాస్వామికని, పాలనను నీరుగార్చి, వృద్ధిని కుంటుపడేలే చేస్తుందని ఆయన హెచ్చరించారు. అవినీతి చేసి పట్టుబడిన వారిపై చట్టపరమైన ప్రక్రియ కొనసాగుతున్నప్పుడు కొందరు రోడ్లపైకి వచ్చి అసంతృప్తులు వ్యక్తం చేయడం సరికాదని హితవు చెప్పారు.

భారతీయులుగా, భారతదేశ విజయలకు గర్వకారణంగా యువత నిలవాలని సందేశం ఇచ్చారు. ఈ కార్యక్రమంలో అసోం గవర్నర్ గులాబ్ చంద్ కటారియా, ముఖ్యమంత్రి డాక్టర్ హిమంత్ బిశ్వ శర్మ, ఐఐటీ గువాహటి గవర్నర్స్ బోర్డ్ చైర్మన్ డాక్టర్ రాజీవ్ మోదీ, ఐఐటీ గువాహటి డెరెక్టర్ ప్రొఫెసర్ పరమేశ్వర్ కె.అయ్యర్ తదితరులు పాల్గొన్నారు.