ప్రజల్లోకి వెళ్లండి.. క్షేత్రస్థాయిలో ప్రగతిని వివరించండి

ప్రజల్లోకి వెళ్లండి.. క్షేత్రస్థాయిలో ప్రగతిని వివరించండని ప్రధాని నరేంద్ర మోదీ కేంద్ర మంత్రులకు పిలుపునిచ్చారు. ఢిల్లీలోని ప్రగతి మైదాన్‌లోని నూతన నిర్మిత కన్వెన్షన్ సెంటర్‌లో ప్రధాని అధ్యక్షతన ఇంతకు ముందెన్నడూ లేని స్థాయిలో పూర్తిస్థాయి కేబినెట్ భేటీ సోమవారం సాయంత్రం జరిగింది. దీనికి అన్ని స్థాయిల్లోని మంత్రులు హాజరయ్యారు.
 
మూడు నాలుగు గంటల పాటు జరిగిన సమావేశం కాగానే ప్రధాని మోదీ ఓ ట్వీటు వెలువరించారు. కేబినెట్ భేటీ చాలా ఫలప్రద దిశలో సాగిందని తెలిపారు. గడిచిన తొమ్మిదేళ్లలో ప్రభుత్వం అన్ని రంగాల్లో గణనీయ ప్రగతి సాధించిందని , అయితే దీనిని వాస్తవిక రీతిలో ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన బాధ్యత మంత్రులపై ఉందని ప్రధాని కోరారు.
పనులు చేస్తూ ఉండాలి, చేసిన పనులతో సాధించిన ప్రగతిని ప్రజలకు వివరిస్తూ సాగాల్సిన బాధ్యత వచ్చే తొమ్మిది నెలల వరకూ మంత్రిమండలిలోని వారిపై ఉందని ప్రధాని తెలిపారు. రానున్న 9 నెలల కాలంలో ప్రజల్లోకి పూర్తిస్థాయిలో వెళ్లాలని, కేంద్రం చేపడుతున్న వివిధ అభివృద్ధి కార్యక్రమాల గురించి వివరించాలని మంత్రులకు సూచించారు. కార్యాలయాలకే పరిమితం కాకుండా ప్రజల్లో పనిచేయాలని స్పష్టం చేశారు.
మంత్రుల మార్పు ఉంటుందని, కొన్ని రాష్ట్రాల బిజెపిల అధ్యక్షులను మార్చి వేస్తారని ఈ కీలక భేటీపై ప్రచారం జరిగింది. అయితే ప్రభుత్వం పలు రంగాలలో సాధించిన ప్రగతిని తెలిపే వీడియో ప్రదర్శనలు ఈ సమావేశంలో ప్రదర్శించారని సంబంధిత వర్గాలు తెలిపాయి.
 
మౌలిక వ్యవస్థలు మొదలుకుని బడ్జెట్‌లో కేటాయింపుల వరకూ ఈ ప్రజెంటేషన్‌లో తెలియచేశారని వెల్లడైంది. 2047లో భారతదేశం స్వాతంత్య్ర శతజయంతిని నిర్వహించుకుంటుంది. అప్పటివరకూ వివిధ రంగాలకు ఖరారు చేసుకున్న లక్ష్యాలను తెలిపిన తర్వాత ప్రధాని మోదీ వీటి గురించి జనంలో తెలియ చేయాల్సి ఉందని మంత్రులకు హితవు పలికారు.
 
2047 వరకూ దేశానికి అమృతకాల ఘడియలు అని, శత ఉత్సవాల తరువాత ఇక భారత్ ప్రపంచంలోని అత్యంత ప్రగతియుత దేశాల సరసన చేరుతుందని ప్రధాని ఆశాభావం వ్యక్తం చేశారు. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న పలు కీలక సవాళ్లను భేటీలో ప్రధాని మోదీ ప్రస్తావించినట్లు తెలిసింది.
 
కరోనా ఆ తరువాత కొన్ని ప్రాంతాల్లో తలెత్తిన అంతర్గత పోరువంటి పరిణామాలు, ఈ నడుమ ఇతర దేశాలు పలు సంక్లిష్టతలు ఎదుర్కొన్నా భారతదేశం అన్నింటిని అధిగమించి ముందుకు దూసుకు వెళ్లిందని ప్రధాని తెలిపారు. మంత్రివర్గ భేటీ దశలోనే వివిధ మంత్రిత్వ శాఖలకు చెందిన పలువురు సెక్రెటరీలు కీలక విషయాలను ప్రస్తావించారు.
 
విదేశాంగ, రక్షణ కార్యదర్శులు ప్రత్యేకించి ప్రధాని మోదీ ఇటీవల జరిపిన అమెరికా పర్యటన అత్యంత జయప్రదం అయిందని వివరించారు. తరువాతి ఈజిప్టు పర్యటనలో కూడా గణనీయ చర్చలు జరిగాయని తెలిపారు. బడ్జెట్ కేటాయింపుల అమలు ఏ విధంగా సముచిత రీతిలో చేపట్టాల్సి ఉందనేది కూడా విశ్లేషించారు.
 
 ప్రధాని మోదీ ఇక్కడి ప్రగతి మైదాన్ కన్వెన్షన్ సెంటర్‌లోనే సెప్టెంబర్ లో జి 20 భేటీ జరుగనుందని ఈ సందర్భంగా తెలిపారు. ఇప్పుడు జరిగిన భేటీ ప్రయోజనకరం , ప్రత్యేకించి బహుళ పాలసీ విషయాలపై అభిప్రాయాల వినిమయం జరిగిందని పేర్కొంటూ ప్రధాని ఆ తర్వాత తమ ట్వీటులో భేటీ ఫలప్రదంగా జరిగిన్నట్లు సంతోషం వ్యక్తం చేశారు.