గోదావరి-కావేరి అనుసంధానం డీపీఆర్‌ సిద్ధం

గోదావరి- కావేరి అనుసంధానంపై జాతీయ జలవనరుల అబివృద్ధి సంస్థ (ఎన్‌ డబ్ల్యుడీఏ) ఫైనల్‌ డ్రాప్ట్‌ రూపొందించింది. గోదావరి నుంచి కావేరికి నదీ జలాలను తరలించే అంశంలో వేర్వేరుగా అందిన భాగస్వామ్య రాష్ట్రాల  ప్రతిపాదనలను పరిశీలించిన ఎన్‌ డబ్ల్యుడీఏ టాస్క్‌ ఫోర్స్‌ కమిటీ ఈ మేరకు ఫైనల్‌ డ్రాప్ట్‌ను సిద్ధం చేసి సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్‌)ను కూడా రూపొందించింది.

డీపీఆర్‌ ముసాయిదాను ఇప్పటికే భాగస్వామ్య రాష్ట్రాల్ర ముందుంచిన ఎన్‌ డబ్ల్యూడీఏ వచ్చేనెల 11న నిర్వహించనున్న కీలక సమావేశంలో ఏకాభిప్రాయం సాధించేందుకు ప్రయత్నిస్తోంది ఏకాభిప్రాయం రాకున్నా ఇదే డీపీఆర్‌ ను వీలైనంత తొందరలో ఆచరణలో పెట్టేందుకు అవసరమైన సాంకేతిక, న్యాయపరమైన అంశాలపైనా చర్చిస్తోంది.

గోదావరి-కృష్ణా-పెన్నా-కావేరి అనుసంధానం కోసం రూ 39,274.92 కోట్ల వ్యయమవుతుందని ఎన్‌ డబ్ల్యూడీఏ ప్రాథమిక అంచనా. గోదావరి నుంచి కృష్ణా, పెన్నాల మీదుగా కావేరికి నీళ్లు తీసుకెళ్ళేందుకు మొత్తం 1211 కిలోమీటర్ల పొడవున పనులు చేపట్టాల్సి ఉంటుందని డీపీఆర్‌ లో ఎన్‌ డబ్ల్యూడీఏ వెల్లడించింది.

దీనిలో 299 కిలోమీటర్ల మేర ఉండే గోదావరి-కృష్ణా అనుసంధానానికి రూ 14,765.69 కోట్లు, 393 కిలోమీటర్ల వరకు ఉండే కృష్ణా-పెన్నాకు రూ.9893.05 కోట్లు, 519 కిలోమీటర్లు ఉండే పెన్నా- కావేరి లింక్‌ కోసం రూ 14,616.18 కోట్లు.. మొత్తం రూ 39,274.92 కోట్లు అవసరమవుతాయని ఎన్‌ డబ్ల్యుడీఏ అంచనాలు రూపొందించింది.

గోదావరి- కావేరి అనుసంధానానికి గోదావరిలో చత్తీస్‌ ఘడ్‌ వాటాగా ఉన్న జలాలను వినియోగించుకోవాలని ఎన్‌ డబ్ల్యుడీఏ తుది నిర్ణయం తీసుకుని డీపీఆర్‌ లో కూడా పొందుపర్చింది. గోదావరిలో చత్తీస్‌ ఘడ్‌ కు 283 టీ-ఎంసీల వాటా ఉంది. సాంకేతిక కారణాల వల్ల కేటాయింపు జలాల్లో 141 టీ-ఎంసీలను ఆ రాష్ట్రం వినియోగించుకోలేక పోతుంది.

గోదావరిలో మిగుల జలాలు లేవని కేంద్ర జలసంఘం (సీడబ్ల్యూసీ) స్పష్టం చేసిన నేపథ్యంలో చత్తీస్‌ ఘడ్‌ వినియోగించుకోని 141 టీ-ఎంసీలను గోదావరి- కావేరి అనుసంధానానికి కేటాయించటం ద్వారా భాగస్వామ్య రాష్ట్రాల్ర అభ్యంతరాలకు ముగింపు పలకవచ్చని ఎన్‌ డబ్ల్యూడీఏ భావిస్తోంది.

141 టీఎంసీల్లో ఏపీకి 41.8 టీఎంసీలు, తెలంగాణకు 42.6 టీఎంసీలు, తమిళనాడుకు 38.6 టీఎంసీలు, కర్ణాటకకు 9.8 టీఎంసీలు, పుదుచ్చేరికి 2.2 టీఎంసీలను కేటాయించేలా ఫైనల్‌ డ్రాప్ట్‌ సిద్ధమైంది. దీనికి చత్తీస్‌ ఘడ్‌ నుంచి తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. గోదావరిలో తమ వాటా నీళ్ళను అనుసంధానానికి కేటాయించటం అసంబద్ధం మని పేర్కొంటున్నది.

గోదావరి నీళ్ళను పూర్తిస్థాయిలో వినియోగించుకునేలా అవసరమైన వనరులు సమకూర్చుకుంటున్న దశలో అనుసంధానం కోసం తరలించుకుపోవటంపై ప్రశ్నిస్తామని, అవసరమైతే న్యాయపోరాటం చేస్తామని చత్తీస్‌ ఘడ్‌ అంటోంది. మరోవంక, గోదావరి-కావేరి అనుసంధానం కార్యరూపం దాలిస్తే ఏపీకి కొత్త ఆయకట్టు ఏర్పడనుంది.

రాష్ట్రానికి కేటాయించే 41.8 టీఎంసీల్లో 31.39 టీఎంసీలను వ్యవసాయ అవసరాలకు, మిగిలిన టీఎంసీలను తాగునీరు, పారిశ్రామిక, ఇతర అవసరాలకు వినియోగించనున్నారు. 31.39 టీఎంసీలను సాగు కోసం కేటాయించటం ద్వారా ఏపీలో 2,19,271 హెక్టార్ల కొత్త ఆయకట్టు ఏర్పడనుందని ఎన్‌ డబ్ల్యుడీఏ డీపీఆర్‌ లో పొందుపర్చారు.

తెలంగాణలోనూ 80 వేల హెక్టార్ల కొత్త ఆయకట్టుతో పాటు 1,58,236 హెక్టార్ల ఆయకట్టు స్థిరీకరణ ఏర్పడుతుందని ఎన్‌ డబ్ల్యు డీఏ వెల్లడించింది. అదే విధంగా కర్ణాటక, తమిళనాడు, పుదుచ్చేరి రాష్ట్రాల్ల్రోనూ కొత్త ఆయకట్టుతో పాటు తాగునీటి సమస్య పరిష్కారమవుతుందని ఎన్‌ డబ్ల్యూడీఏ వెల్లడించింది.