ఒడిశాలో మూడు రైళ్లు ఢీకొన్న ప్రమాదం జరిగి నెల రోజులవుతున్నా 52 మృతదేహాలను ఇంకా గుర్తించలేదు. ఎయిమ్స్ భువనేశ్వర్లో భద్రపరిచిన ఈ మృతదేహాల కోసం ఎవరూ ముందుకు రావడం లేదు. జూన్ 2న బాలాసోర్ సమీపంలో లూప్ లైన్లో ఆగి ఉన్న గూడ్స్ రైలును చెన్నై వెళ్తున్న కోరమండల్ ఎక్స్ప్రెస్ ఢీకొట్టింది.
దాని బోగీలు మెయిన్ లైన్పై పడగా హౌరా వెళ్తున్న షాలిమార్ ఎక్స్ప్రెస్ ఢీకొట్టింది. ఈ ఘోర ప్రమాదంలో 291 మంది మరణించగా వెయ్యి మందికి పైగా గాయపడ్డారు. మూడు రైళ్ల ప్రమాదంపై రైల్వే కమిటీతో పాటు సీబీఐ కూడా దర్యాప్తు చేస్తున్నది. ప్రమాదం తర్వాత వందలాది మృతదేహాలను భువనేశ్వర్లోని ఎయిమ్స్కు తరలించారు.
వాటిలో 81 మృతదేహాలు ఇంకా అక్కడ ఉన్నాయి. మృతదేహాలు తమ వారివే అని పలువురు పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో వారి నుంచి డీఎన్ఏ నమూనాలు సేకరించారు. చనిపోయిన వారిని గుర్తించేందుకు ఆయా నమూనాలను డీఎన్ఏ పరీక్ష కోసం ఢిల్లీ పంపారు. మరోవైపు 29 నమూనాలకు సంబంధించిన డీఎన్ఏ రిపోర్టులు అందినట్లు భువనేశ్వర్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ సులోచనా దాస్ తెలిపారు.
దీంతో మృతుల బంధువులకు ఈ సమాచారం ఇచ్చినట్లు చెప్పారు. గుర్తించిన 29 మృతదేహాల్లో ఐదింటిని వారికి అప్పగించే ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు వారి ఊర్లకు మృతదేహాల తరలింపు కోసం రవాణా సౌకర్యం కల్పిస్తున్నట్లు చెప్పారు. కాగా, మృతదేహాలను ఊర్లకు తీసుకెళ్లని పక్షంలో బంధువుల విన్నపం మేరకు అంత్యక్రియల కోసం భువనేశ్వరంలోని రెండు ప్రాంతాల్లో ఏర్పాట్లు చేసినట్లు మేయర్ సులోచనా దాస్ తెలిపారు. మూడు రైళ్ల ప్రమాదంలో మరణించిన 291 మందిలో 52 మృతదేహాలను ఇంకా గుర్తించాల్సి ఉందని వెల్లడించారు.
మరో కీలక అధికారిపై వేటు
తాజాగా సౌత్ ఈస్టర్న్ రైల్వే జనరల్ మేనేజర్ అర్చనా జోషిపై ప్రభుత్వం వేటువేసింది. ఆమె స్థానంలో కొత్త జీఎంగా అనిల్ కుమార్ మిశ్రాను క్యాబినెట్ అపాయింట్మెంట్స్ కమిటీ నియమించింది. ఈ ప్రమాద ఘటనపై కుట్ర కోణంలో సీబీఐ విచారణ నిర్వహిస్తోంది. ఇప్పటికే ఈ ఘటనలో ఎస్ఈఆర్కు చెందిన ఐదుగురు ఉన్నతాధికారులను రైల్వే బోర్డు తప్పించింది.
వారిలో ఖరగ్పూర్ డివిజనల్ రైల్వే మేనేజర్ శుజాత్ హష్మీ, ఎస్ఈఆర్ జోన్ ప్రిన్సిపల్ చీఫ్ సిగ్నల్ అండ్ టెలికమ్యూనికేషన్ ఇంజినీర్ పీఎం సిక్దర్, ప్రిన్సిపల్ చీఫ్ సేఫ్టీ ఆఫీసర్ చందన్ అధికారి, ప్రిన్సిపల్ చీఫ్ సెక్యూరిటీ కమిషనర్ డీబీ కేసర్, ప్రిన్సిపల్ చీఫ్ కమర్షియల్ మేనేజర్ ఎండీ ఓవైసీ ఉన్నారు.
More Stories
సర్వేల పేరుతో ఓటర్ల వివరాలు సేకరిస్తే చర్యలు
సప్తపదితో ముడిపడినదే హిందూ వివాహం
మే 4 నుంచి దక్షిణాది రాష్ట్రాల్లో ఉరుములు, మెరుపులతో వర్షాలు