భారతీయ విశ్వవిద్యాలయాలకు ప్రపంచ స్థాయి గుర్తింపు

విద్యారంగంలో గత కొద్ది సంవత్సరాలుగా గణనీయ సత్ఫలితాలు కనబడుతున్నాయని చెబుతూ ఇటీవలి కాలంలో చేపట్టిన భవిష్యదార్శనిక విధానాలు, తీసుకున్న నిర్ణయాలతో భారతీయ విశ్వవిద్యాలయాలకు ప్రపంచ స్థాయి గుర్తింపు దక్కిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలిపారు.  శుక్రవారం ప్రధాని మోదీ ఢిల్లీ యూనివర్శిటీ శతజయంతి ఉత్సవాల ముగింపు దశలో జరిగిన స్నాతకోత్సవంలో ప్రసంగిస్తూ విద్యారంగంలో ఘననీయ మార్పులు చోటుచేసుకున్నాయని చెప్పారు.

తాజా క్యూఎస్ గ్లోబల్ ర్యాంకింగ్‌లలో 45 భారతీయ వర్శిటీలు చోటుచేసుకున్నాయని, 2014లో ఈ సంఖ్య 12గా ఉండేదని తెలిపారు. అదే విధంగా ఐఐటిలు, ఐఎంఎస్‌, ఐఐఐఎంఎస్‌, ఎన్‌ఐటిల సంఖ్య కూడా దేశవ్యాప్తంగా పెరిగిందని పేర్కొన్నారు. నవ భారత నిర్మాణ దిశలో ఇటువంటి విద్యాసంస్థల ఏర్పాటు ఇతోధికంగా పెరగడం మంచి పరిణామం అవుతుందని ప్రధాని చెప్పారు.  తాను ఇటీవల అమెరికాకు వెళ్లినప్పుడు ప్రపంచ స్థాయిలో భారతదేశం పట్ల గౌరవం ఇనుమడించిందని గ్రహించినట్లు తెలిపారు.

దీనికి కారణం ఇక్కడి మన యువత సమర్థత, ప్రతిభలకు విశ్వస్థాయిలో విశ్వాసం పెరగడమే అని ప్రధాని స్పష్టం చేశారు. ఇదంతా కూడా యువతరం ప్రతిభ ప్రాతిపదికన తలెత్తిన పరిణామం అని కొనియాడారు. విద్యా, సాంకేతిక, శాస్త్ర రంగాలలో ఎప్పుడూ భవిష్యత్తును పరిగణనలోకి తీసుకుని విధానాలను రూపొందించుకోవాలని. కార్యక్రమాలు చేపట్టాల్సి ఉంటుందని తెలిపారు.

దీనిని తాము ఆచరించడం వల్ల సరైన రీతిలో ఇక్కడి విద్యాసంస్థలకు ప్రాధాన్యత పెరిగిందని, ఇది మన యువతకు, తద్వారా నవభారత నిర్మాణ క్రమానికి ఊతం అందిస్తుందని మోదీ పేర్కొన్నారు. తమ అమెరికా పర్యటనలో కుదిరిన పలు ఒప్పందాలతో ఇక్కడి యువతకు మరింత మేలు జరుగుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ఇక్కడి యువతరానికి బోలెడు సరికొత్త అవకాశాలు దక్కుతాయని భరోసా వ్యక్తం చేశారు.

ఇటు భూమి మొదలుకుని అటు అంతరిక్షం వరకూ వివిధ రంగాలలో బహుముఖ స్థాయిలో యువ ప్రతిభకు గుర్తింపు లభిస్తుందని చెబుతూ దీనితో వారికి సరైన భవిత మల్చుకునే రీతిలో ఉద్యోగ ఉపాధి అవకాశాలు దక్కుతాయని ప్రధాని తెలిపారు. సెమి కండక్టర్లు, కృత్రిమ మేధ (ఎఐ) వంటి క్షేత్రాలలో కూడా ప్రతిభగల వారిని సముచిత అవకాశాలు వరిస్తాయని తెలిపారు.

మైక్రాన్ , గూగుల్ వంటి ఐటి దిగ్గజ సంస్థలు దేశంలో భారీ పెట్టుబడులకు ముందుకు రావడం కీలక విషయం అని ప్రధాని పేర్కొన్నారు. అమెరికాలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా భారతీయ యువత తన ప్రతిభను చాటుకుంటూ ఆయా దేశాల జనజీవన స్రవంతిలో కీలక భాగం కావడం గణనీయ పరిణామం అని ప్రధాని తెలిపారు.

ఈ సందర్భంగా ప్రధాని మోదీ ఢిల్లీ యూనివర్శిటీ వివిధ జీవన అంశాల దిశలో సరైన సేవలను అందించి విశిష్ట సంస్థగా నిలిచిందని ప్రశంసించారు. ఈ వర్శిటీ కేవలం విద్యాసంస్థనే కాకుండా ఓ ఉద్యమంగా చైతన్యవేదికగా నిలిచిందని తెలిపారు.

అంతకుముందు మోదీ లోక్ కల్యాణ్ మార్గ్ మెట్రో స్టేషన్ నుంచి విశ్వవిద్యాలయ మెట్రో స్టేషన్ వరకు మెట్రో రైలులో ప్రయాణించారు. సాధారణ ప్రయాణికులతో కలుపుగోలుగా మాట్లాడారు. యువతీ, యువకులు, మహిళలతో ఎంతో ఆత్మీయంగా, నవ్వుతూ ముచ్చటించారు. చాలా కాలం నుంచి పరిచయం ఉన్న స్నేహితులతో మాట్లాడినట్లుగా ఆయన హావభావాలు కనిపించాయి.