”కిల్లర్‌ పోలీస్‌” అంటూ నిరసనలతో ఫ్రాన్స్ అతలాకుతలం

17ఏళ్ల యువకుడి మరణం నేపథ్యంలో ”పోలీస్‌ కిల్స్‌” అనే బ్యానర్‌తో పాటు ”కిల్లర్‌ పోలీస్‌” అంటూ నిరసనకారులు నినాదాలతో ఫ్రాన్స్​ దేశం నిరసనలతో అట్టుడికిపోతోంది. ఈ ఘటనకు బాధ్యత వహిస్తూ..  అంతర్గత మంత్రి గెరాల్డ్‌ డర్మానిన్‌ రాజీనామా చేయాలంటూ వారు డిమాండ్‌ చేస్తున్నారు.
 
ఫ్రాన్స్​లో  నేల్‌ సంస్మరణార్థం నానిటెల్ లో  గురువారం చేపట్టిన నిరసన ర్యాలీపై పోలీసులు విరుచుకుపడ్డారు. నాహెల్​ అనే యువకుడిపై ఓ పోలీసు అధికారి కాల్పులు జరిపాడు. ట్రాఫిక్​ చెక్​ను అతను అధిగమించడంతో కాల్పులు జరపాల్సి వచ్చిందని అధికారులు చెబుతున్నారు. ఈ కాల్పుల్లో 17 ఏళ్ల నాహెల్​ ప్రాణాలు కోల్పోయాడు.
 
మరోవైపు ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్​గా మారాయి. ఫ్రాన్స్​లో జాతి వివక్ష ఉందని, బహుళ జాతి సమాజాలపై జరుగుతున్న దాడులకు ఈ ఘటన చిహ్నం అని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ట్రాఫిక్​ చెక్​ను అధిగమించినంత మాత్రాన చంపే హక్కు పోలీసులకు లేదంటూ దేశవ్యాప్తంగా నిరసనలు మొదలయ్యాయి. వరుసగా మూడు రోజుల పాటు దేశవ్యాప్తంగా హింసాత్మక ఘటనలు జరిగాయి.
 
ప్రధాన నగరాల్లో 40 వేలకు పైగా మంది పోలీసులు, ఎలైట్​ రైడ్​, జీఐజీఎన్​ యూనిట్​ బృందాలు భద్రతా చర్యలు చేపట్టాయి. కానీ పెద్దగా ఫలితం దక్కడం లేదు. నిరసనలకు గంటగంటకు భారీ ఎత్తున మద్దతు పెరుగుతోంది. ఇప్పటివరకు 600మందిని పోలీసులు అరెస్ట్​ చేశారు. కానీ ఇప్పటికే చాలా నష్టం జరిగిపోయిందని తెలుస్తోంది.
 
ఫ్రాన్స్​వ్యాప్తంగా అనేక నగరాల్లో వాహనాలకు నిరసనకారులు నిప్పంటించారు. పలు భవనాలను ధ్వంసం చేశారు. లిల్లే ప్రాంతంలోని ఓ ప్రాథమిక పాఠశాలకు నిప్పంటించారు. తమకు న్యాయం జరగాలంటూ డిమాండ్​ చేస్తున్నారు. ఈ క్రమంలో పోలీసులతోనూ వాగ్వాదానికి దిగుతున్నారు. ఫలితంగా ఇప్పటివరకు వివిధ ఘటనల్లో 249మంది పోలీసులు గాయపడ్డారు.
 
ఫ్రాన్స్​ అధ్యక్షుడు మాక్రోన్​కు వాస్తవానికి ఈయూ సమావేశం కోసం  బ్రసెల్స్​కు వెళ్లారు. కానీ దేశంలో పరిస్థితులు అదుపు తప్పిపోతుండటంతో బ్రసెల్స్​ పర్యటనను ఆయన అర్ధంతరంగా ముగించుకుని దేశానికి తిరిగి వస్తున్నట్లు తెలుస్తోంది. “నేను పోలీసు వ్యవస్థను నిందించడం లేదు. ఆ ఒక్క అధికారిపైనే ఆ కోపం అంత. నా బిడ్డ ప్రాణాలను అతనే తీశాడు. నా కుమారుడు అరబ్​ అని తెలిసే, అతని ప్రాణాలు తీశాడు,” అని నాహెల్​ తల్లి మౌనియా ఆరోపించారు.

అయితే, “ఈ ఘటన చాలా దురదృష్టకరం. కానీ నాహెల్​ను చంపడం ఆ పోలీసు ఉద్దేశం కాదు. మేము రోజు నిద్రలేచి, ఎవరినో ఒకరిని చంపాలని అనుకోము,” అని అధికారులు చెబుతున్నారు. కాగా.. నాహెల్​పై కాల్పులు జరిపిన పోలీసుకు సంబంధించిన వివరాలను అధికారులు చెప్పడం లేదు. అయితే, ఘటనకు కారణమైన పోలీసును అదుపులోకి తీసుకున్నట్లు మాత్రం స్పష్టం చేశారు.