
తెలుగులో తొలి తీర్పు వెలువరించడం ద్వారా తెలంగాణ హైకోర్టు చరిత్ర సృష్టించింది. సికింద్రాబాద్కు చెందిన ఇద్దరు అన్నదమ్ముల మధ్య జరిగిన ఆస్తి వివాదంపై తెలంగాణ హైకోర్టు తొలిసారిగా తెలుగులో తీర్పు వెలువరించింది. ఈ ఏడాది ఫిబ్రవరిలో కేరళ హైకోర్టు మలయాళంలో తీర్పును వెలువరించింది.
ఆ తీర్పును అనుసరించి సీనియర్ న్యాయమూర్తి జస్టిస్ పి.నవీన్రావు, జస్టిస్ నగేష్ భీమపాకలతో కూడిన ధర్మాసనం తొలిసారిగా తెలుగులో 44 పేజీల తీర్పును ఇచ్చింది.
స్థానిక భాషల్లో కేరళ తరువాత తీర్పు వెలువరించింది తెలంగాణ హైకోర్టు మాత్రమే కావటం విశేషం. సుప్రీంకోర్టు, హైకోర్టుల్లో మొత్తం ఇంగ్లీష్ భాషలోనే వ్యవహారాలుంటాయి. పిటిషన్లు దాఖలు చేసినప్పుడు అనుబంధ డ్యాక్యుమెంట్లు, ఆధారాలు స్థానిక భాషలో ఉన్నప్పటికీ వాటిని ఇంగ్లీష్లోకి ట్రాన్స్లెట్ చేసి కోర్టు రిజిస్ట్రీకి సమర్పించాలి. సుప్రీంకోర్టు కీలక తీర్పులను ఈ మధ్య స్థానిక భాషల్లోకి అనువాదం చేయిస్తోంది.
ఈ నేపథ్యంలో హైకోర్టులు కూడా స్థానిక భాషలో తీర్పు వెలువరించడానికి ఆసక్తి చూపుతున్నాయి. స్థానిక భాషల ప్రాధాన్యం పెరుగుతున్న దృష్ట్యా కోర్టులు కూడా మాతృభాష వైపు అడుగులు వేయడం ప్రారంభించాయి. ఈ నేపథ్యంలోనే సికింద్రాబాద్ మచ్చబొల్లారంలో 4 ఎకరాల స్థలం విషయంలో కె. చంద్రారెడ్డి, కె. ముత్యంరెడ్డి మధ్య వివాదం తలెత్తింది. వారి తల్లి పేరు మీద ఉన్న భూమి ఆమె బ్రతికి ఉన్న సమయంలో పంచి ఇవ్వలేదు. ఆమె మరణించిన తర్వాత ఈ భూమి వివాదానికి దారితీసింది.
తల్లి రాసిన వీలునామా ద్వారా భూమి మొత్తం తనకు వచ్చిందని పెద్ద కుమారుడు చంద్రారెడ్డి పేర్కొనగా, ఆ వీలునామా చెల్లదని అందులో సగం భూమి తనదే అంటూ ముత్యంరెడ్డి సివిల్ కోర్టులో సవాల్ చేశారు. విచారించిన సివిల్ కోర్టు తల్లి రాసిన వీలునామాలో సందేహాలున్నాయని చెప్పింది. ఆ వీలునామా చెల్లదని పేర్కొంటూ.. తల్లి ఆస్తి ఇద్దరికీ సమానంగా చెందుతుందని తీర్పునిచ్చింది.
కింది కోర్టు తీర్పుపై చంద్రారెడ్డి అతని వారసులు హైకోర్టులో అప్పీలు చేశారు. ఇరుపక్షాల వాదనలను విన్న ధర్మాసనం తీర్పు వెలువరిస్తూ కేవలం వీలునామాపై సందేహాలను వ్యక్తం చేయడమే కాకుండా అందుకు స్పష్టమైన కారణాలను కింది కోర్టు పేర్కొందని తెలిపింది. ఆ కోర్టు వెలువరించిన తీర్పులో జోక్యం చేసుకోలేమంటూ చంద్రారెడ్డి అప్పీలును కొట్టివేసింది.
ఈ మేరకు తెలుగులో తీర్పును వెలువరించింది. అధికారిక కార్యకలాపాల నిమిత్తం 41 పేజీల ఆంగ్ల తీర్పునూ వెలువరించింది. కక్షిదారులు, ప్రజల సౌలభ్యం కోసం ఇలా తెలుగులో వెలువరించామని తీర్పు చివరిలో ధర్మాసనం పేర్కొంది. తెలుగులో తీర్పు వెలువరించటంపై ఉమ్మడి ఏపీ హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ ఎ రామలింగేశ్వరరావు హర్షం వ్యక్తం చేశారు. హైకోర్టులు ప్రాంతీయ భాషల్లో తీర్పులు వెలువరించేందుకు వీలుగా పార్లమెంటు తప్పనిసరిగా చట్టం చేయాలన్నారు.
గతంలో తమిళనాడు, గుజరాత్, ఛత్తీస్గఢ్ హైకోర్టుల్లో ప్రాంతీయ భాషలను ప్రవేశపెట్టేందుకు రాష్ట్రపతి అనుమతి కోరగా.. సుప్రీంకోర్టు తిరస్కరించిందని గుర్తు చేశారు. 2014 జూన్లో తమిళనాడు, కర్ణాటకలు కూడా ఇదే విధమైన అప్పీళ్లను సుప్రీంకోర్టుకు పంపాయని జస్టిస్ రామలింగేశ్వరరావు చెప్పారు. ప్రాంతీయ భాషల్లో తీర్పులను వెలువరించటం ద్వారా ప్రజలకు న్యాయవ్యవస్థను మరింత చేరువ అవుతుందని అన్నారు.
More Stories
ప్రయాగ్రాజ్ మహాకుంభ్ నుండి సనాతన- బౌద్ధ ఐక్యత సందేశం
భారత శ్రామిక శక్తికి కృత్రిమ మేధస్సుతో ముప్పు
చరిత్ర సృష్టించిన రవీంద్ర జడేజా