మాజీ ఎంపి సోలిపేట రామచంద్రారెడ్డి మృతి

రాజ్యసభ పూర్వ సభ్యులు సోలిపేట రామచంద్రారెడ్డి మంగళవారం ఉదయం స్వల్ప అస్వస్థతతో హైదరాబాదులో కన్నుమూశారు. ఆయన వయసు 92 సంవత్సరాలు. సిద్దిపేట జిల్లా చిట్టాపూర్ కు చెందిన రామచంద్రారెడ్డి తొలితరం కమ్యూనిస్టు నాయకుల స్ఫూర్తితో తెలంగాణ రైతాంగ పోరాటంలో పాల్గొన్నారు.
 
సిటీ కాలేజీలో పట్టభద్రులైన రామచంద్ర రెడ్డి అనంతరం రాజకీయాల్లో పూర్తి కాలం పనిచేశారు. స్వగ్రామం చిట్టాపూర్ సర్పంచ్ గా, దుబ్బాక సమితి అధ్యక్షుడిగా, సిద్దిపేట వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ గా,అప్పటి మెదక్ జిల్లా కేంద్ర సహకార బ్యాంకు అధ్యక్షుడిగా, దొమ్మాట శాసనసభ్యునిగా సేవలందించారు.
 
తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శిగా, రాజ్యసభ సభ్యునిగా,రాజ్యసభలో ఆ పార్టీ నాయకులుగా, రాజ్యసభ హామీల అమలు  స్థాయి సంఘం సభ్యులుగా, పలు హోదాల్లో విశిష్ట సేవలు అందించారు. ఇటీవలి కాలంలోనూ భారత చైనా మిత్ర మండలికి అధ్యక్షులుగా, సి. ఆర్. ఫౌండేషన్, తెలంగాణ అమరవీరుల స్మారక ట్రస్టు వంటి సంస్థలకు సభ్యులుగా సేవలందించారు.
 
లోక్ సత్తా లో కూడా కొంతకాలం కలిసి పని చేశారు.70 ఏళ్ల పాటు రాజకీయాలలో క్రియాశీలంగా పనిచేసి మచ్చలేని వ్యక్తిగా పేరుపొందారు. సోలిపేట రామచంద్రారెడ్డికి భార్య, ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. మహాకవి డాక్టర్ సి.నారాయణరెడ్డి చిన్న కుమార్తెను తమ పెద్ద కుమారుడు వెంకటేశ్వర్ రెడ్డికి చేసుకున్నారు.
 
ఆయన మృతదేహాన్ని బంజారాహిల్స్ శాసనసభ్యుల నివాసాల్లో 272 ఏ లో ఉంచారు.ఈ సాయంత్రం నాలుగు గంటలకు ఫిలింనగర్ మహాప్రస్థానంలో అంత్యక్రియలు జరుగుతాయి. సోలిపేట రామచంద్రారెడ్డి మరణం పట్ల ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు సంతాపాన్ని ప్రకటించారు. తొలితరం కమ్యూనిస్టు నేతగా, నాటి తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో పాల్గొన్న ‘సోలిపేట’ జీవితం ఆదర్శవంతమైనదని సీఎం తెలిపారు.