రోడ్లపై నిరసనలకు స్వస్తి చెప్పిన రెజర్లు

డబ్ల్యూఎఫ్ఐ చీఫ్ , బిజెపి ఎంపీ బ్రిజ్ భూషణ్ శరణ్‌ సింగ్‌ కు వ్యతిరేకంగా  గత కొన్ని రోజులుగా నిరసన తెలుపుతున్న భారత అగ్రశ్రేణి క్రీడాకారులు ఇకపై రోడ్డుపైకి వచ్చి నిరసనలు తెలపబోమని ప్రకటించారు. డబ్ల్యూఎఫ్ఐ చీఫ్ తమపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని ఆరోపిస్తూ రోడ్డెక్కిన రెజ్లర్లు తమకు న్యాయం జరిగే వరకూ ఆయనపై ఇక న్యాయ పోరాటం కొనసాగిస్తామని స్పష్టం చేశారు.

అది కోర్టులో తేల్చుకుంటామని, ఇకపై రోడ్డెక్కబోమని ప్రకటించారు. ఈ విషయాన్ని రెజ్లర్లు ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. ‘అధికార బీజేపీకి చెందిన పార్లమెంట్ సభ్యుడు, డబ్ల్యూఎఫ్ఐ చీఫ్ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ పై చార్జీషీట్ దాఖలు చేస్తామని ఇచ్చిన హామీని ప్రభుత్వం నెరవేర్చుకుంది’ అని టాప్ రెజ్లర్లు వినేశ్ ఫోగట్ , సాక్షి మాలిక్ , భజరంగ్ పునియా తెలిపారు.

లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎంపీ బ్రిజ్ భూషణ్‌పై ఢిల్లీ పోలీసులు ఇటీవలే పలు సెక్షన్ల కింద ఛార్జ్‌షీట్ దాఖలు చేశారు. ఈ నేపథ్యంలో రెజ్లర్లు తమ పోరాటం కోర్టులో సాగుతుందని ప్రకటించడం గమనార్హం.

డబ్ల్యూఎఫ్ఐ ఎన్నికల ప్రక్రియ ముగిశాక తమకు ఇచ్చిన హామీలను నెరవేరుస్తామని ప్రభుత్వం తెలిపినట్లు వారు చెప్పారు. ఆ మేరకు వేచి చూస్తామని పేర్కొన్నారు. కానీ, బ్రిజ్ భూషణ్ పై మాత్రం తమ పోరాటాన్ని విరమించే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. ఈ నేపథ్యంలో కొన్నాళ్లపాటు సోషల్ మీడియాకు సైతం దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్లు వినేశ్ ఫోగట్, సాక్షి మాలిక్ తెలిపారు.